ఇన్‌చార్జి ఈఓగా జగన్నాథరావు

16 Jun, 2017 22:29 IST|Sakshi
- నేడు అన్నవరం దేవస్థానం బాధ్యతలు చేపట్టనున్న ఏసీ
- ప్రిన్సిపల్‌ సెక్రటరీ విదేశీ పర్యటనతో రెగ్యులర్‌ ఈఓ నియామకంలో జాప్యం
అన్నవరం (ప్రత్తిపాడు) : ప్రముఖ పుణ్యక్షేత్రమైన అన్నవరం శ్రీ వీర వేంకట సత్యనారాయణస్వామి దేవస్థానం ఇన్‌చార్జి కార్యనిర్వహణాధికారి(ఫుల్‌ అడిషనల్‌ చార్జి)గా అసిస్టెంట్‌ కమిషనర్‌ ఈరంకి వేంకట జగన్నాథరావు నియమితులయ్యారు. ఈమేరకు దేవాదాయ శాఖ కమిషనర్‌ కార్యాలయం శుక్రవారం సాయంత్రం ఆదేశాలు జారీ చేసింది. ప్రస్తుత ఈఓ, స్పెషల్‌ గ్రేడ్‌ డిప్యూటీ కలెక్టర్‌ కె.నాగేశ్వరరావును విజయనగరం జిల్లా జాయింట్‌ కలెక్టర్‌-2గా ఈ నెల 8న ప్రభుత్వం బదిలీ చేసిన విషయం తెలిసిందే. ఆయన స్థానంలో వచ్చేందుకు పలువురు ప్రయత్నాలు చేశారు. అవి ఇంతవరకూ ఒక కొలిక్కి రాలేదు. దీనికితోడు దేవాదాయ శాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ జేఎస్‌వీ ప్రసాద్‌ రెండు వారాల పాటు సెలవు పెట్టి శుక్రవారం విదేశాలకు వెళ్లారు. ఆయన ఈ నెల 30న తిరిగి వస్తారు. ఆ తరువాతే ఈఓ నియామకంపై ఒక నిర్ణయం తీసుకుంటారని విశ్వసనీయవర్గాల సమాచారం. ఈలోగా దేవస్థానంలో పాలన వ్యవహారాలు చూసేందుకు, బదిలీ అయిన ఈఓ నాగేశ్వరరావును రిలీవ్‌ చేసేందుకు ఇన్‌చార్జిగా ఈరంకిని నియమించారు. ఆయనను ఆ ఇన్‌చార్జి ఈఓగా నియమించే అవకాశం ఉందని ‘సాక్షి’ ముందే చెప్పింది. బదిలీ అయిన ఈఓ నాగేశ్వరరావు నుంచి జగన్నాథరావు శనివారం ఉదయం బాధ్యతలు స్వీకరించనున్నారు. విజయనగరం జేసీ-2గా సోమ లేదా మంగళవారాల్లో తాను బాధ్యతలు స్వీకరిస్తానని నాగేశ్వరరావు శుక్రవారం సాయంత్రం ‘సాక్షి’కి తెలిపారు.
ఈరంకికి ఈ బాధ్యతలు ఏడోసారి..
గత ఆరేళ్లుగా ఏసీ జగన్నాథరావు ఆరుసార్లు అన్నవరం దేవస్థానం ఇన్‌చార్జి ఈఓగా పని చేశారు. ఈసారి కూడా కలుపుకుంటే అది ఏడోసారి అవుతుంది. 2010లో అప్పటి ఈఓ కె.రామచంద్రమోహన్‌ అమెరికాలో సత్యదేవుని వ్రతాల నిర్వహణకు వెళ్లినపుడు ఈరంకి పది రోజులు ఇన్‌చార్జి ఈఓగా పని చేశారు. రామచంద్రమోహన్‌ తరువాత 2012లో స్పెషల్‌ గ్రేడ్‌ డిప్యూటీ కలెక్టర్‌ ప్రసాదం వేంకటేశ్వర్లు ఈఓగా నియమితులయ్యారు. ఆయన బాధ్యతలు తీసుకోవడానికి 15 రోజులు పట్టడంతో అప్పుడు కూడా జగన్నాథరావే ఇన్‌చార్జి ఈఓగా పని చేశారు. వేంకటేశ్వర్లు 2013లో ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లినపుడు 12 రోజులు ఇన్‌చార్జి ఈఓగా పని చేశారు. వేంకటేశ్వర్లు 2013 మే నెలలో 15 రోజులు సెలవు పెట్టినపుడు కూడా ఇన్‌చార్జి ఈఓగా పని చేశారు. 2014 ఆగస్టులో వేంకటేశ్వర్లు వ్యవసాయ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు పీఏగా బదిలీ కాగా, ఆయన స్థానంలో 2015 జూలై రెండో తేదీన కె.నాగేశ్వరరావు ఈఓగా వచ్చే వరకూ ఈరంకి ఇన్‌చార్జి ఈఓగా పని చేశారు. ఇప్పుడు తిరిగి ఇన్‌చార్జి ఈఓగా శనివారం బాధ్యతలు స్వీకరించనున్నారు.
మరిన్ని వార్తలు