-
హైకోర్టు వార్నింగ్ ఇస్తుందని రాపూరు మార్కెటింగ్ పాలకమండలి రద్దు
-
మార్కెటింగ్ ఇన్చార్జిగా ఏడీని నియమిస్తు జీఓ జారీ
నెల్లూరు: జిల్లాలో అధికార పార్టీకి మరో షాక్కు తగిలింది. హైకోర్టు వార్నింగ్ ఇస్తుందని భయపడి హడావిడిగా రాత్రికిరాత్రే రాపూరు వ్యవసాయ మార్కెటింగ్ పాలక మండలిని రద్దు చేస్తున్నట్లు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ కమిటీ చైర్మన్ నియామకంపై శుక్రవారం హైకోర్టు తీర్పు ఇవ్వనున్న నేపథ్యంలో ప్రభుత్వ భయపడి ఆ ఉత్తర్వులు జారీ చేసినట్లు సమాచారం. దీంతో అధికారపార్టీకి ఎదురుదెబ్బ తగిలింది. గతంలో రాపూరు వ్యవసాయ మార్కెటింగ్ చైర్మన్ పదవికి బెల్లంకొండ మస్తాన్నాయుడు అర్హుడు కాదంటూ గతంలో హైకోర్టు తీర్పులో వెల్లడించింది. దీంతో ప్రభుత్వం దానిపై పిటిషన్ దాఖలు చేసింది. ఇరువురు వాదనలు విన్న కోర్టు తీర్పును ఈ నెల 29వతేదీ లోపల స్పష్టమైన ఆధారాలను చూపాలంటూ ప్రభుత్వానికి గడువు ఇచ్చింది.
పాలక మండలి వ్యవహారం ఇలా..
మండలంలోని రామసాగరం గ్రామానికి చెందిన బెల్లంకొండ మస్తాన్నాయుడిని రాపూరు వ్యవసాయ మార్కెటింగ్ కమిటీ చైర్మన్గా నియమిస్తూ జీఓ ఆర్టీ569, 6–8–2015 తేదీన ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కాగా చైర్మన్గా ఎన్నికైన బెల్లంకొండ మస్తాన్నాయుడు గూడూరు కోర్టులో దివాళ పిటిషన్ నంబర్ 6/95 మీద 11–03–1998 డిక్రీ పొంది ఉన్నారు. దివాళ తీసిన వ్యక్తి మార్కెటింగ్ కమిటీ చైర్మన్కు అర్హుడు కాదంటూ హైకోర్టులో ఆ గ్రామానికి చెందిన ఇద్దరు వ్యక్తులు రిట్ పిటిషన్ దాఖలు చేశారు.
రిట్ పిటిషన్ను కూడా మస్తాన్నాయుడు ఖాతరు చేయకుండానే ముందస్తుగా చైర్మన్ పగ్గాలను చేపట్టారు. దీంతో ఇరువురి వాదప్రతివాదనలు విన్న రాష్ట్ర అత్యున్నత న్యాయం స్థానం జనవరి 4వతేదీన మస్తాన్నాయుడు చైర్మన్ నియామకానికి సంబంధించి జోవో చట్టబద్ధంగా లేదని, ఇన్సాల్వెన్సిగా(ఐపీ పెట్టిన) ఉన్న వ్యక్తి ఏ పదవిని చేపట్టేందుకు అర్హుడు కాదని ఉత్తర్వులు జారీ చేసింది. ఆరు నెలలు గడవక ముందే చైర్మన్గా మస్తాన్నాయుడు నియామకం చెల్లదంటూ హైకోర్టు తీర్పునిచ్చింది. దీంతో ప్రభుత్వం మరో గడువు కావాలంటూ పిటిషన్ దాఖలు చేయడంతో ఈ కేసు ఇంతకాలం నడిచింది. ఎట్టకేలకు గురువారం పాలకమండలి రద్దయింది.
కంగుతిన్న టీడీపీ
పాలకమండలి వ్యవహారాల్లో అధికార పార్టీ వ్యవహరిస్తున్న తీరు చూస్తుంటే ఆ పార్టీ నాయకుల్లోనే అసంతృప్తులు వ్యక్తమవుతున్నాయి. ఓ కేసులో ఐపీ పెట్టిన వ్యక్తికి మార్కెటింగ్ కమిటి చైర్మన్ పదవిని కట్టబెట్టడంతో ఆ పార్టీలోనే అంతర్గత కుమ్ములాటలు ప్రారంభమయ్యాయి. ప్రమాణ స్వీకారం చేసిన ఏడు నెలల్లోనే రాపూరు వ్యవసాయమార్కెటింగ్ పాలక మండలిని ప్రభుత్వం రద్దు చేసింది. దీంతో టీడీపీకి వెంకటగిరి నియోజకవర్గంలో ఎదురు దెబ్బ తగిలింది.
మార్కెటింగ్ కమిటీ పర్సన్ ఇన్చార్జిగా ఏడీ
రాపూరు వ్యవసాయ మార్కెటింగ్ పాలక మండలిని రద్దు చేస్తున్నట్లు ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు అందాయని ఆ శాఖ జాయింట్ డైరెక్టర్ తెలిపారు. దీంతో నెల్లూరు వ్యవసాయమార్కెటింగ్ ఏడీకి పర్సన్ ఇన్చార్జీగా బాధ్యతలను అప్పగిస్తున్నట్లు ఆయన తెలిపారు. కొత్తపాలక మండలి ఏర్పాటయ్యేంత వరకు ఏడీ విధులను నిర్వర్తిస్తారని పేర్కొన్నారు.