కలియుగ దైవం లక్ష్మీనరసింహస్వామి

1 Feb, 2017 00:02 IST|Sakshi
కలియుగ దైవం లక్ష్మీనరసింహస్వామి
దక్షిణ కాశీగా పురాణ ప్రసిద్ధి చెంది, చారిత్రక ప్రాధాన్యాన్ని సంతరించుకున్న పవిత్ర పుణ్యక్షేత్రం అంతర్వేది శ్రీలక్షీ్మనృసింహస్వామివారి ఆలయం. ఈ క్షేత్రంలో శ్రీలక్షీ్మనృసింహస్వామివారు శిలారూపంలో పశ్చిమ ముఖంగా అవతరించారు. ప్రకృతి వైపరీత్యాల నుంచి స్వామివారు కాపాడతారని ఇక్కడ భక్తుల ప్రగాఢ విశ్వాçÜం. ఫిబ్రవరి మూడో తేదీ నుంచి స్వామివారి కల్యాణోత్సవాలు ప్రారంభంకానున్నాయి. 
– సఖినేటిపల్లి 
 
సఖినేటిపల్లి మండలం తీరప్రాంత గ్రామం అంతర్వేది క్షేత్ర మహత్యానికి సంబంధించి అనేక పురాణ గాధలున్నాయి. కృతయుగ ఆరంభంలో సృష్టికర్త బ్రహ్మ రుద్రయాగం చేయడానికి నిర్ణయించి, ఆయాగ వేదికను సాగరసంగమం తీరమైన గ్రామంలో నిర్మించినట్టు ఆలయ చరిత్ర చెబుతోంది. యాగరక్షణకు నీలకంఠేశ్వరుడిని ప్రాణప్రతిష్ఠ చేసి, యాగం పూర్తి చేసినట్టు పండితులు చెబుతున్నారు. బ్రహ్మయాగ వేదికగా ఉన్న ఈ గ్రామానికి అంతర్వేదిక పేరొచ్చింది. కాలక్రమంలో అది అంతర్వేదిగా స్థిరపడింది. 
అంతర్వేది ఉత్సవాల షెడ్యూల్‌...
ఫిబ్రవరి 3 నుంచి 11 వరకూ జరుగుతున్న అంతర్వేది శ్రీలక్షీ్మనృసింహస్వామివారి వార్షిక దివ్య తిరు కల్యాణోత్సవాల ప్రధాన ఘట్టాల షెడ్యూల్‌.
∙3న రథసస్తమి. సూర్యవాహనం, చంద్రప్రభ వాహనంపై గ్రామోత్సవం. ముద్రికాలంకరణ(శ్రీస్వామివారినిపెళ్లికుమారుని, అమ్మవారిని పెళ్లికుమార్తె చేయడం)
∙6న పంచముఖ ఆంజనేయస్వామి, కంచుగరుడ వాహనాలపై గ్రామోత్సవాలు. రాత్రి 12.21 గంటలకు మృగశిర నక్షత్రయుక్త తులా లగ్నపుష్కరాంశలో శ్రీస్వామివారి తిరు కల్యాణ మహోత్సవం.
∙7న భీష్మ ఏకాదశి సందర్భంగా శ్రీస్వామివారి రథోత్సవం.
∙10న మాఘ పౌర్ణమి(సముద్ర స్నానాలు)
∙11న అంతర్వేది చెరువులో హంసవాహనంపై తెప్పోత్సవం.
 
నా పూర్వజన్మ సుకృతం
ఇంత వరకూ లక్షీ్మనృసింహస్వామివారికి అర్చకుడిగా సేవలు చేసుకున్న తనకు ఈ ఏడాది స్వామివారి కల్యాణం చేయించే భాగ్యం దక్కడం పూర్వజన్మసుకృతం. ప్రధాన అర్చకుడిగా తొలిసారిగా స్వామివారి కల్యాణం తన చేతుల మీదుగా జరుగునున్న తరుణంలో ఎంతో ఆనందిస్తున్నా. 
– పాణింగిపల్లి శ్రీనివాస కిరణ్, ప్రధాన అర్చకుడు
 
స్వామివారి దయ ఎంతో ఉంది
శ్రీలక్షీ్మనృసింహస్వామివారు కొలువై ఉన్న దేవస్థానానికి అసిస్టెంట్‌ కమిషనర్‌గా బాధ్యతలను నిర్వర్తిస్తుండడం ఎంతో సంతోషకరం. శ్రీస్వామివారి కరుణకటాక్షాలతో భక్తులు, తాము ఎంతో ఆనందంగా జీవిస్తున్నాం. అలాగే స్వామివారు భక్తుల నుంచి కోరుకునే కార్యక్రమాలను తన చేతుల మీదుగా స్వామివారికి చేరడం ఎంతో సంతృప్తి. 
– చిక్కాల వెంకట్రావు, అసిస్టెంట్‌ కమిషనర్‌
 
 
అంతర్వేదిలో సందర్శనీయ ప్రాంతాలు
వశిష్టసేవాశ్రమం: ఆలయానికి సుమారు 500 మీటర్ల దూరంలో ఏటిగట్టుకు ఆవలి వైపున ఉంది. అంతర్వేదిలోని వశిష్టాసేవాశ్రమం ఆధ్యాత్మిక నిలయంగా భాసిల్లుతోంది. ఈ ఆశ్రమాన్ని కల్యాణ మహోత్సవాలకు వచ్చే భక్తులు సందర్శించుకోవచ్చు. ఇక్కడ అరుంధతీ, వశిష్ట మహర్షులు కొలువు దీరారు. చుట్టూ నీరు ఉండేలా అష్టభుజాకారంగా దీనిని ఆచార్య కే.జీ. ప్రసాదరాజు నిర్మించారు. అరుంధతీదేవికి వశిష్ట మహర్షికి వివాహం జరిగిన సమయంలో సమస్త దంపతులకు రక్షణగా నిలవాలని దేవతలు ఆశీర్వదించారని, అందుకే వీరిని దర్శించుకుంటే దంపతుల మధ్య అన్యోన్యత పెరుగుతుందని భక్తుల విశ్వాçÜం.
గుర్రాలక్క ఆలయం
ఆలయానికి సుమారు రెండు కిలోమీటర్ల దూరంలో శ్రీలక్షీ్మనరసింహస్వామివారి సోదరి గుర్రాలక్క(అశ్వ రూఢాంబిక) ఆలయం ఉంది. క్షేత్ర ప్రతిపత్తికి ప్రతీకగా ఉన్న ఆమె ఆలయాన్ని భక్తులు దర్శించుకోవడం ఎంతో శ్రేయస్కరం. రథోత్సవం రోజున రథంపై నూతన వధూవరులుగా మూర్తీభవించిన శ్రీస్వామి సతీసమేతంగా గుర్రాలక్క ఆలయానికి వెళ్లి కొత్త దుస్తులు ఇవ్వడం పరిపాటి. 
నీలకంఠేశ్వరుని ఆలయం
ఆలయానికి సుమారు 200 మీటర్ల దూరంలో శ్రీనీలకంఠేశ్వరుని ఆలయం ఉంది. కృతయుగ ఆరంభంలో బ్రహ్మ రుద్రయాగం నిర్వహించేందుకు వేదికగా ఈ ప్రాంతాన్ని ఎంపిక చేసినట్టు ప్రతీతి. యాగరక్షణకు నీలకంఠేశ్వరస్వామిని ప్రతిíష్ఠించి, యాగాన్ని పూర్తి చేసిన మహాపుణ్యక్షేత్రం ఇది. బ్రహ్మ యజ్ఞవేదికైనందున ఈప్రాంతం అంతర్వేదికగా ఏర్పడి కాలక్రమంలో అంతర్వేదిగా మారింది. ఈ క్షేత్రంలో శ్రీఆంజనేయస్వామిని క్షేత్ర సంరక్షకునిగా కూడా ప్రతిష్ఠించారని పురాణ సారాంశం. 
ఆకట్టుకునే లైట్‌హౌస్, 
సాగరసంగమం 
ఆలయానికి సుమారు రెండు కిలోమీటర్ల దూరంలో లైట్‌హౌస్‌ ఎంతో ఆహ్లాదాన్ని ఇస్తుంది. దానికి సమీపంలోనే సాగరసంగమం ఉంది.
 
మరిన్ని వార్తలు