అంత్యం ఆహ్లాదం

11 Aug, 2016 23:59 IST|Sakshi
అంత్యం ఆహ్లాదం
  • పుష్కరుడికి ఘనంగా వీడ్కోలు
  • ముగిసిన గోదావరి అంత్యపుష్కరాలు
  • నిర్విఘ్నంగా ముగిసిన పర్వం
  • వలంటీర్ల సేవలు భేష్‌ 
  • 12 రోజుల్లో 9.66 లక్షల మంది
  • భక్తుల పుణ్యస్నానాలు  
  •  
    సాక్షి, రాజమహేంద్రవరం :
     
    పుష్కర పర్వం ముగిసింది. అంత్య పుష్కరాల 12వ రోజు పుష్కరఘాట్‌లో వేద మంత్రాల నడుమ సీఎం చంద్రబాబు దంపతులు పుష్కరుడికి ఘనంగా వీడ్కోలు పలికారు. అనంతరం జరిగిన గోదావరి హారతిని వీక్షించి భక్త కోటి పరవశించింది. బాణాసంచా వెలుగులతో గోదావరి తీరం వీనుల విందుగా మారింది. గత పన్నెండు రోజులుగా భక్తజనం పుణ్య గోదావరిలో పుష్కర స్నానం ఆచరించి తరించింది. పసిపాప నుంచి వృద్ధుల వరకు గోదావరి మాత స్పర్శకు పులకించారు. గోదావరి తీరం వెంబడి గత పన్నెండు రోజులుగా సందడి నెలకొంది. తీరం వెంబడి ఉన్న దేవాలయాలు భక్తులతో కళకళలాడాయి. 12 రోజుల పాటు జిల్లా వ్యాప్తంగా 9,66,892 మంది పుష్కర స్నానాలు చేశారు. పలువురు పితృదేవతలకు పిండప్రదానాలు పెట్టారు. మరో పదకొండేళ్లకు పుష్కరాలు రానుండడంతో చివరి రోజు జిల్లా వ్యాప్తంగా ఘాట్లకు భక్తులు పొటెత్తారు. రాజమహేంద్రవరంతోపాటు కోనసీమలోని అంతర్వేది, అయినవిల్లి తదితర ఘాట్లకు భక్తులు అధిక సంఖ్యలో వచ్చారు. అధికారులు, స్వచ్ఛంద సంస్థల సేవలు పలువురి ప్రశంసలు అందుకున్నాయి. జిల్లా కలెక్టర్‌ హెచ్‌.అరుణ్‌కుమార్, అంత్యపుష్కరాల నోడల్‌ అధికారి వి.విజయరామరాజు ప్రతి ఘాట్‌కు డిప్యూటీ కలెక్టర్‌ను ఇన్‌చార్జిగా నియమించి పుష్కరాలను ప్రశాంతంగా నిర్వహించారు. ఘాట్ల వద్ద పారిశుధ్య కార్మికు లు ఎప్పటికప్పుడు ఘాట్లను శుభ్రం చేశా రు. గోదావరికి వరద రావడంతో ఇరిగేషన్‌ అధికారులు అప్రమత్తంగా వ్యవహరించి భక్తుల స్నానాలకు ఎలాంటి ఇబ్బం దులు లేకుండా ఏర్పాట్లు చేశారు. భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకుని జిల్లా ఎస్పీ బి.రాజమకుమారి నగరంలో ట్రాఫిక్‌ ఆంక్షలు సడలించారు. ఘాట్లను ప్రతి రోజు పరిశీలిస్తూ బందోబస్తును స్వయంగా పర్యవేక్షించారు. వైద్యఆరోగ్యశాఖ పుష్కర భక్తులకు వైద్య సేవలందించింది. రోడ్లు భవనాలశాఖ, అగ్నిమాకపశాఖ, మత్యశాఖ, దేవాదాయ, విద్యుత్‌ శాఖలు అంత్యపుష్కరాల నిర్వహణలో తమ వంతు ప్రాత పోషించాయి. 
    వలంటీర్ల సేవలు భేష్‌... 
    అంత్యపుష్కరాలకు వచ్చిన భక్తులు వివిధ స్వచ్ఛంద సంస్థలు, కాలేజీ విద్యార్థులు 12 రోజుల పాటు విశేష సేవలందించారు. శ్రీకల్కి మానవసేవా సంస్థ, శ్రీసత్యసాయి సేవా సంస్థ, ఆంధ్రకేసరి యువజన సంఘం, ఆంధ్రకేసరి డిగ్రీ, జూనియర్‌ కళాశాల, ఆర్ట్స్‌ కాలేజీ, ఆదిత్య డిగ్రీ కాలేజీ, కాకినాడ ఎంఆర్‌ కాలేజీ, ప్రభుత్వ జూనియర్‌ కాలేజీ, ఆదికవి నన్నయ్య యూనివర్సిటీ ఎన్‌ఎస్‌ఎస్‌ విద్యార్థులు, ఎన్‌సీసీ క్యాడెట్లు వేకువజాము నుంచే ఘాట్ల వద్దకు చేరుకుని భక్తులకు తాగునీరు ఇవ్వడం, వృద్ధులు, వికలాంగులను ఘాట్లలోకి తీసుకెళ్లడం, తీసుకురావడం, భక్తుల వస్తులు భద్రంగా చూసుకోవడం వంటి సేవలందించారు. 
    సాంసృ్కతిక కార్యక్రమాలు ఫుల్‌.. ప్రేక్షకులు నిల్‌ 
    అంత్యపుష్కరాల 12 రోజులు పుష్కరఘాట్, సరస్వతీఘాట్, ఆనం కళాకేంద్రం, కోటిలింగాల ఘాట్‌ వద్ద ఆధ్యాత్మిక, సాంసృ్కతిక కార్యక్రమాలను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. అయితే ఆయా కార్యక్రమాలకు తగిన ప్రచారం కల్పించకపోవడంతో ప్రేక్షకులు పలుచగా హాజరయ్యారు. పుష్కరఘాట్‌ ఎదురు మండపం వద్ద నిర్వహించిన ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో ప్రతిరోజు శ్రోతలే ప్రేక్షకులుగా నిలిచారు.
     
మరిన్ని వార్తలు