చీమలు చంపేశాయ్!

3 May, 2016 07:07 IST|Sakshi
ఆస్పత్రిలో చీమలు కుట్టి మృతిచెందిన శిశువు

- బెజవాడ ప్రభుత్వాస్పత్రిలో దారుణం
-  చీమలు కుట్టడంతో శిశువు మృతి
- పసికందుపై సెలైన్ బాటిల్సూ పడిన వైనం
- ఆస్పత్రి సిబ్బంది నిర్లక్ష్యంపై చిన్నారి బంధువుల ఆగ్రహం
- పొంతనలేని సమాధానాలిస్తున్న వైద్యులు
- సర్కార్ తీరుపై ఆందోళనలతో దద్దరిల్లిన ఆస్పత్రి ప్రాంగణం

 
విజయవాడ (లబ్బీపేట): గుంటూరులో ఎలుక కరచి చిన్నారి మృతి చెందిన సంఘటన మరువక ముందే విజయవాడలో మరో దారుణం జరిగింది. బరువు తక్కువగా ఉన్నాడంటూ ప్రత్యేక నవజాత శిశు వైద్యవిభాగంలో ఉంచి చికిత్స అందిస్తున్న శిశువు చీమలు కుట్టడంతో మృతి చెందాడు. నవమాసాలు మోసి పండంటి బిడ్డకు జన్మనిచ్చిన ఆ తల్లికి పుత్రశోకం మిగిలింది.  శిశువు ఛాతీ, పొట్టపై చీమలు కుట్టిన గాయాలు, సెలైన్ బాటిల్ మీదపడి ఉండడాన్ని గమనించి ఇదేమిటని సిబ్బందిని ప్రశ్నిస్తే ‘ఇక్కడ 40 మంది ఉన్నారు.. అందర్నీ నేనే  చూడాలి’ అనే సమాధానం చిన్నారి బంధువులను మరింత క్షోభకు గురిచేసింది. సిజేరియన్ అయిన తల్లికి శిశువు మృతి విషయాన్ని చెప్పకపోవడంతో ఇంకా తన బిడ్డ బతికే ఉన్నాడని ఆ మాతృమూర్తి భావిస్తోంది.  
 
 జరిగింది ఇదీ..
 గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం పెనుమాకకు వేముల లక్ష్మి ప్రసవం కోసం ఏప్రిల్ 28న విజయవాడ ప్రభుత్వాస్పత్రిలో చేరింది. ఆమెకు మరుసటి రోజు సిజేరియన్ చేయగా మగశిశువు జన్మించాడు. కాగా శిశువు బరువు తక్కువగా ఉన్నాడని, శ్వాస తీసుకోవడం కష్టంగా ఉందంటూ ప్రత్యేక నవజాత శిశు వైద్య విభాగం(ఎస్‌ఎన్‌సీయూ) లోని ఇంక్యుబేటర్‌లో ఉంచి చికిత్స అందిస్తున్నారు. అదేరోజు సీ టాప్ వేయగా, ఆదివారం సాయంత్రం వెంటిలేటర్‌పై ఉంచి చికిత్స చేశారు. అయితే, సోమవారం ఉదయం 6 గంటల సమయంలో ఆస్పత్రి సిబ్బంది శిశువు మృతి చెందినట్లు తండ్రి అంజి, అమ్మమ్మ లక్ష్మి, నానమ్మ తిరుపతమ్మ, బంధువులకు తెలిపారు. దీంతో నానమ్మ తిరుపతమ్మ ఎన్‌ఐసీయూలోకి వెళ్లి చూడగా చిన్నారి ఛాతీ, పొట్టపై చీమలు కుట్టిన గాయాలతోపాటు పొట్టపై సెలైన్ బాటిల్ పడి ఉండడం గమనించింది. అక్కడే ఉన్న వర్కర్‌ను ఆమె ప్రశ్నించగా, ఇంత మందిని నేను ఒక్కరినే చూడాలి ఏమి చేయమంటావంటూ సమాధానం ఇచ్చినట్లు చెబుతున్నారు. నిరుపేద కుటుంబానికి చెందిన వారు కావడంతో ఏం చేయాలో తోచక మృత శిశువును ఇంటికి తీసుకెళ్లి అంత్యక్రియలు చేశారు.
 
 ఆస్పత్రి వద్ద ఆందోళన
 శిశువు మృతదేహానికి అంత్యక్రియలు చేసిన అనంతరం బంధువులందరూ కలసి ప్రభుత్వాస్పత్రికి చేరుకున్నారు. ఆస్పత్రి ఎదుట ఆందోళనకు దిగారు. మూడు రోజుల పాటు ఎస్‌ఎన్‌సీయూలో ఉంచి కనీసం చూసేందుకు కూడా పంపించలేదని, శనివారం సాయంత్రం వరకు బాగానే ఉన్నాడని చెప్పిన సిబ్బంది, మృతి చెందిన అనంతరం లోపలికి అనుమతించారంటూ ఆవేదన వ్యక్తం చేశారు.  
 
 సమాధానాలు దాటవేసిన వైద్యులు  
 చిన్నారికి చీమలు కుట్టకుంటే అలా గాయం ఎందుకైందని ప్రశ్నించిన వారికి వైద్యులు తమదైన శైలిలో సమాధానాలు ఇచ్చారు. శ్వాస తీసుకోని సమయంలో ఛాతీపై ప్రెజర్ చేస్తామని, ఆ సమయంలో గోళ్ల గాయాలై ఉండవచ్చున్నారు. మూడు రోజుల శిశువు ఛాతీపై ప్రెజర్ చేసేటప్పుడు గ్లౌజులు ఎందుకు వేసుకోలేదని ప్రశ్నిస్తే సమాధానం దాటవేశారు. పొట్టపై సెలైన్ బాటిల్ పడి గాయమైందని, దానిని పక్కనే పెట్టారని ప్రశ్నించగా, తల అటు ఇటు  తిరగకుండా సెలైన్ బాటిల్స్‌ను సపోర్టుగా ఉంచుతామని పిడియాట్రిక్ విభాగం చీఫ్ డాక్టర్ ఎంఏ రెహమాన్ పేర్కొన్నారు. విషయం తెలుసుకుని ఆస్పత్రి వద్దకు వచ్చిన జిల్లా కలెక్టర్ బాబు ఎ, విజయవాడ తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్‌లను ఆందోళనకారులు అడ్డుకున్నారు.  
 
 విచారణ చేయిస్తా: మంత్రి కామినేని
 సాక్షి, హైదరాబాద్: లండన్ పర్యటనలో ఉన్న వైద్య ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ విజయవాడ ప్రభుత్వాసుపత్రిలో చీమలు కుట్టి శిశువు చనిపోయిన ఘటన తెలుసుకొని స్పందించారు. ఘటనపై పూర్తిస్థాయి విచారణ జరిపించి చర్యలు తీసుకుంటామని మంత్రి పేర్కొన్నారు. ఈ మేరకు ఓ ప్రత్రికా ప్రకటన విడుదల చేశారు.

మరిన్ని వార్తలు