తమ్ముడూ..మోసాల కుమ్ముడు

16 Mar, 2017 23:06 IST|Sakshi
  • బడ్జెట్‌ ‘సిత్రాలు’
  • రూ.500 కోట్లు జిల్లాకే సరిపోవు  ∙
  • ఆ అంకెలతో ఎందుకీ రంకెలు  l
  • ప్రశ్నిస్తున్న  84 వేల మంది నిరుద్యోగులు
  •  
    నిరుద్యోగ భృతి కోసం రాష్ట్ర బడ్జెట్లో కేటాయించింది రూ.500 కోట్లు. ఓసారి ఈ లెక్కల చిత్రాలేమిటో విశ్లేషించుకుందాం.  జిల్లాలో నిరుద్యోగుల మొత్తం సంఖ్య 84 వేలు ... ఇచ్చిన హామీ భృతి రూ.2000. అంటే 84 వేల నిరుద్యోగులతో రూ.2000 గుణిస్తే ఎంత వస్తుంది...నెలకు సుమారు రూ.17 కోట్లు. బాబు అధికారంలోకి వచ్చి 36 నెలలైంది. బ్యాక్‌లాగ్‌ బకాయిలతో కలుపుకుంటే ... అంటే 36 నెలలు... 84 వేల మంది నిరుద్యోగులు ... నెలకు రూ.17 కోట్లు గుణిస్తే ఇప్పటి వరకు నిరుద్యోగులకు బాబు సర్కారు ఇవ్వాల్సింది సుమారు రూ.612 కోట్లు. అంటే బడ్జెట్లో కేటాయించిన రూ.500 కోట్లకు ఇంకో రూ.112 కోట్లు అదనమన్నమాట. ఒక్క ఈ జిల్లాకే సరిపడని ఈ కేటాయింపులతో  ‘తందానా అంటే తాన తందానా’ అంటూ గంతులేస్తున్న ఈ తెలుగు తమ్ముళ్లు ఏం సమాధానం చెబుతారని నిరుద్యోగులు ప్రశ్నిస్తున్నారు.   
     
    సాక్షిప్రతినిధి, కాకినాడ :
    నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి కల్పిస్తా’మన్న చంద్రబాబు రాష్ట్ర బడ్జెట్‌ ‘సాక్షి’గా నిరుద్యోగులను నిలువునా దగా చేశారు. గతంలో ఎవరూ ఇవ్వని భృతిపై ఆశలు పెంచడంతో జిల్లాలో నిరుద్యోగులు, యువత గత సార్వత్రిక ఎన్నికల్లో చంద్రబాబుకు ఓటేశారు.బాబు అధికారంలోకి వచ్చి మూడేళ్లు అయిపోయింది. ఆయన మాటలు నమ్మి ఓటేసినందుకు తగిన బుద్ధి చెప్పారని నిరుద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇన్నేళ్లయినా ఇచ్చిన హామీపై చంద్రబాబు పెదవి విప్పలేదు. కనీసం రాష్ట్ర బడ్జెట్‌లో భారీగా కేటాయింపులుంటాయని గంపెడాశ పెట్టుకున్నారు. బుధవారం ప్రవేశపెట్టిన రాష్ట్ర బడ్జెట్‌లో కేటాయింపులు నిరాశనే మిగిల్చాయి. నిరుద్యోగ భృతి కింద రాష్ట్రవ్యాప్తంగా ఉన్న నిరుద్యోగులకు రూ.500 కోట్లు కేటాయించారు. ఆ బడ్జెట్‌ ఏమూలకు వస్తుందని నిరుద్యోగ యువకులు ప్రశ్నిస్తున్నారు. ఎన్నికల సమయంలో ‘నాకు ఓటేయండి మీకు ఉద్యోగాలు కల్పిస్తానని, ఇవ్వలేని పక్షంలో నిరుద్యోగ భృతి కింద ఒక్కో నిరుద్యోగికి  రూ.2000 ఇస్తామని ’ నాడు గొప్పగా ప్రకటించి ఆచరణలో దగా చేశారని విద్యార్థి సంఘాలు దుమ్మెత్తిపోస్తున్నాయి.
    ఉపాధి వేటలో సుమారు 84 వేల మంది...
    జిల్లా కేంద్రం కాకినాడ ఎంప్లాయ్‌మెంట్‌ కార్యాలయంలో అధికారికంగా నమోదైన నిరుద్యోగులు 84 వేల151 మంది ఉన్నారు. వీరిలో పదో తరగతి ఉత్తీర్ణులై 10,641 మంది, ఇంటరీ్మడియట్‌ ఉత్తీర్ణులై 16,412 మంది, డిగ్రీ ఉత్తీర్ణులై 16596 మంది, బీఈడీ చేసి ఖాళీగా ఉన్న 4297 మంది, ఐటిఐ 13,314 మంది, డిపొ్లమా చేసి 5423 మంది,  ఇతరులు 17,468 మంది నిరుద్యోగులు ఉద్యోగాల వేటలో ఉన్నారు. అధికారంలోకి వచ్చాక ఇస్తానన్న నిరుద్యోగ భృతి ఇవ్వాలంటే సర్కార్‌ జిల్లా ఉపాధి కల్పనా కేంద్రంలో నమోదైన వారి సంఖ్యనే  ప్రామాణికంగా తీసుకుంటుంది. జిల్లాలో అధికారిక లెక్కల ప్రకారం ఉన్న 84 వేల 151 మంది నిరుద్యోగులకు చంద్రబాబు ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారమే రూ.2000 వంతున లెక్కేస్తే నెలకు రూ.16 కోట్ల 83 లక్షలపై చిలుకు నిరుద్యోగ భృతి ఇవ్వాల్సి ఉంటుంది. అలా చంద్రబాబు అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి అంటే 36 నెలలకు తాను ఇచ్చిన మాటను అమలు చేయాలంటే రూ.612 కోట్లు చెల్లించాల్సి ఉంటుంది. అధికారికంగా జిల్లా ఉపాధి కల్పనా కేంద్రంలో నమోదైన నిరుద్యోగుల లెక్కలు తీసుకుంటేనే ఇంత మొత్తంలో నిరుద్యోగ భృతి చెల్లించాలి. ప్రభుత్వం నిరుద్యోగ భృతికి ప్రస్తుత బడ్జెట్‌లో కేటాయించిన రూ.500 కోట్లు మన జిల్లాలో నిరుద్యోగులకే సరిపోవు. ఉపాధి కల్పనా కేంద్రంలో  నమోదైన నిరుద్యోగుల సంఖ్యకు రెట్టింపు సంఖ్యలోనే అంటే సుమారు లక్షన్నర మంది నమోదు కాని నిరుద్యోగులుంటారని అంచనా. బడ్జెట్‌లో అరకొర కేటాయింపులతోపాటు అర్హతకు నిర్ధేశించుకున్న మార్గదర్శకాలేమిటో కూడా స్పష్టం చేయకపోవడం తమను దగా చేయడమేనని నిరుద్యోగులు మండిపడుతున్నారు.
     
మరిన్ని వార్తలు