కర్నూలు(హాస్పిటల్): ఆఫ్రికా ఖండంలో అత్తి ఎత్తయిన కిలిమంజారో శిఖర అధిరోహణ యాత్ర కోసం రాష్ట్రానికి చెందిన ఎస్సీ, ఎస్టీ యువతీయువకుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా యువజన సంక్షేమ శాఖ అధికారి మస్తాన్వలి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రతి జిల్లా నుంచి 10 మంది ఔత్సాహికులను ఎంపిక చేస్తారు. 13 జిల్లాల నుంచి ఎంపికైన 130 మందికి పర్వతారోహణ, ఆరోగ్యపరీక్షలు, ప్రవర్తన మొదలైన వాటిపై నాలుగురోజులపాటు విజయవాడలో శిక్షణ ఇస్తారు. అనంతరం అందులో 60 మందిని ఎంపిక చేస్తారు. ఈ 60 మంది నుంచి ఆరోగ్యం, నడవడికల ఆధారంగా 20 మంది ఎస్సీ, 20 మంది ఎస్టీ వారిని ఎంపిక చేసి ఏప్రిల్, జూన్ మధ్యలో శిఖర అధిరోహణకు పంపిస్తారు. అభ్యర్థుల వయసు 18 నుంచి 35 ఏళ్లలోపు ఉండాలి. హిందీ, ఇంగ్లిష్ వచ్చిన వారికి ప్రాధాన్యం ఉంటుంది. ఆసక్తి కల్గినవారు ఈ నెల 30వ తేదీలోగా సెట్కూరు కార్యాలయంలో దరఖాస్తు ఫారాలు తీసుకుని పూర్తి చేసి సమర్పించాలి. వివరాలకు సెట్కూరు కార్యాలయంలో నేరుగా గానీ, ఫోన్(08518230140/229146)లో కాని సంప్రదించవచ్చు.