దొరికిన వస్తువులు పోలీసులకు అప్పగింతl

15 Aug, 2016 23:20 IST|Sakshi
దొరికిన వస్తువులు పోలీసులకు అప్పగింత
విజయవాడ(మొగల్రాజపురం):
తనకు దొరికిన విలువైన వస్తువుల కోసం ఆశపడకుండా పోలీసులకు అప్పగించి నిజాయితీని నిరూపించుకున్నాడు తమిళనాడులోని మధురైకి చెందిన వెంగస్వామి ప్రభాకర్‌.  వివరాల్లోకి వెళితే.. శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటకు చెందిన బరాటం శ్రీనివాసరావు కుటుంబసభ్యులతో సోమవారం కృష్ణవేణి ఘాట్‌లో స్నానం చేయడానికి వచ్చారు. తడిసిన దుస్తులను మెట్లపై ఉంచారు. కొడుకు, భార్యను అక్కడే ఉండమని చెప్పారు. పిండప్రధానం చేయడానికి వెళ్లారు. శ్రీనివాసరావు భార్య లక్ష్మీరాజ్యం ఘాట్‌లోని నీళ్లు సీసాలో తీసుకురావడానికి వెళ్లింది. విషయాన్ని గమనించిన దొంగలు బాలుడి వీపుపై పౌడర్‌ చల్లారు. దురదగా ఉండటంతో నీటితో కడుక్కోడానికి వెళ్లాడు. వచ్చి చూస్తే దుస్తులు కనిపించలేదు. వెంటనే తల్లిదండ్రులకు విషయాన్ని చెప్పాడు. సమీపంలోని పోలీస్‌ అవుట్‌పోస్ట్‌లో వివరాలు చెప్పారు. నగరంలో వారు బసచేసిన హోటల్‌కు వెళ్లిపోయారు.  ఘాట్‌లోని 22వ నంబరు హైమాస్ట్‌ లైటు దగ్గర స్రీలు దుస్తులు మార్చుకునే గదికి సమీపంలో ఎప్పటి నుంచో తడిసిన దుస్తులు ఉండటం, సమీపంలో ఎవరూ లేకపోవడాన్ని స్నానం చేయడానికి వచ్చిన వెంగస్వామి ప్రభాకర్‌  గమనించారు. పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు శ్రీనివాసరావుకు ఫోన్‌ చేసి ఘాట్‌కు రప్పించారు. దుస్తుల్లోని వాచ్, రెండు పర్సులు, ఏటీఎం కార్డులను సీఐ ఎం.కృపానందం, ఎస్‌ఐ ఏజీ నాయుడు, వెంగస్వామి ప్రభాకర్‌ చేతుల మీదుగా శ్రీనివాసరావు దంపతులకు అప్పగించారు. పర్సులో రూ.17 వేలు పోయాయి. పోలీసులు వెంగస్వామి ప్రభాకర్‌ను అభినందించారు.
 
మరిన్ని వార్తలు