‘కుడా’కు ఆమోదం

24 Mar, 2017 23:13 IST|Sakshi
‘కుడా’కు ఆమోదం
2599.50 చదరపు కిలోమీటర్లతో ఏర్పాటు 
– 117 గ్రామాలు, 9 మండలాల విలీనం
– ఇందులోనే డోన్‌ నగర పంచాయతీ 
 
కర్నూలు(టౌన్‌): కర్నూలులో కుడా(కర్నూలు అర్బన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ)ను ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు శుక్రవారం రాత్రి జీఓ 277ను మున్సిపల్‌ పరిపాలన ముఖ్య కార్యదర్శి కరికాల్‌ వలవన్‌ జారీ చేశారు. గత ఏడాది సెప్టెంబర్‌ నెలలో కుడా ఏర్పాటుకు ప్రభుత్వం గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. అప్పట్లో 2414.69 కిలోమీటర్ల పరిధిలో కుడాను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. కుడా పరిధిలోకి కర్నూలు మున్సిపల్‌ కార్పొరేషన్, నంద్యాల మున్సిపాలిటీ, గూడూరు నగర పంచాయతీతో పాటు 111 గ్రామాలు, 8 మండలాలను తీసుకొచ్చారు. కుడా ఏర్పాటుకు సంబంధించి ప్రజాభిప్రాయ సేకరణ చేయాలని గత ఏడాది నవంబర్‌ 4వ తేదీ జిల్లా కలెక్టర్‌కు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
 
నెల రోజుల పాటు ప్రజాభిప్రాయ సేకరణకు జిల్లా కలెక్టర్‌ చర్యలు తీసుకున్నారు. అయితే ఎలాంటి అభ్యంతరాలు రాకపోవడంతో కుడా ఏర్పాటుకు సంబంధించి జిల్లా కలెక్టర్‌ ప్రభుత్వానికి నివేదిక సమర్పించారు. దీంతో అధికారికంగా నిర్ణయం తీసుకుంటూ ఉత్తర్వులు జారీ చేసింది. డోన్‌ నగర పంచాయతీని అదనంగా కలుపుకుని 117 గ్రామాలు, 9 మండలాలు విలీనమయ్యాయి. కుడా పరిధిలో భూముల అభివృద్ధి, మాస్టర్‌ ప్లాన్, జోనల్‌ డెవలప్‌మెంట్‌ ప్లాన్స్, అలాగే తనిఖీలు, జరిమానాలు వంటి కార్యక్రమాలను కుడా చేపట్టనుంది. ఏపీ మెట్రో పాలిటన్‌ రీజియన్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ–2016 ప్రకారం కుడా పనిచేయనుంది.
 
మరిన్ని వార్తలు