ఆక్వా లాబ్స్‌కు రిజిస్ట్రేషన్‌ తప్పనిసరి

14 May, 2017 23:49 IST|Sakshi
ఆక్వా లాబ్స్‌కు రిజిస్ట్రేషన్‌ తప్పనిసరి
కాట్రేనికోన (ముమ్మిడివరం) : రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రతి ఆక్వా ల్యాబ్‌ రిజిస్ట్రేషన్‌ చేయించుకోవాలని కాకినాడ స్టేట్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ ఫిషరీష్‌ టెక్నాలజీ (ఎస్‌ఐఎఫ్‌టీ) ప్రిన్సిపాల్‌ పి.కోటేశ్వరరావు అన్నారు. ఆక్వా ల్యాబ్స్‌ రిజిస్ట్రేషన్‌ కోసం దరఖాస్తు చేసుకున్న ప్రైవేట్‌ ల్యాబ్‌లను పరిశీలించి అనుమతులు ఇచ్చేందుకు నెట్‌ వర్కింగ్‌ ఆక్వా ల్యాబ్‌ రిజిస్ట్రేషన్‌ బృందం సభ్యులు ఆదివారం విస్తృతంగా పర్యటించారు. జిల్లావ్యాప్తంగా కాకినాడ, అమలాపురం, కాట్రేనికోనలో పలు ఆక్వా ల్యాబ్‌లను పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఆక్వా పరిశ్రమ అభివృద్ధి, రైతుల సంక్షేమం కోసం ప్రత్యేక దృష్టి సారించిందన్నారు. రాష్ట్రంలో ఉన్న ప్రైవేట్‌ ఆక్వా ల్యాబ్‌ జీఓ నెం.49 ప్రకారం రిజిస్ట్రేషన్‌ చేయించుకోవాలన్నారు. రిజిస్ట్రేషన్‌ చేయించుకున్న నెట్‌ వర్కింగ్‌ ఆక్వా ల్యాబ్స్‌ ఎస్‌ఐఎఫ్‌టీ నోడల్‌ కేంద్రంగా పనిచేస్తాయన్నారు. నెట్‌ వర్కింగ్‌ ల్యాబ్‌ అనుసంధానంతో ల్యాబ్స్‌ నెల వారీ రిపోర్టింగ్, డీసీజ్‌ సర్వేలైన్స్‌ (వ్యాధులపై పర్యవేక్షణ, నిఘా), ల్యాబ్‌ సిబ్బంది రైతులకు అందిస్తున్న సేవలు, మొబైల్‌ ఆక్వా ల్యాబ్‌ల పనితీరుపై నిఘా ఉంటుంది. ప్రభుత్వ, ఫ్రైవేట్‌ ఆక్వా ల్యాబ్‌లు ఒక గొడుగు కిందకు తీసుకుని రావడంతో వివిధ ప్రాంతాలలో విజృంభిస్తున్న వ్యాధులపై పర్యవేక్షణ–నిఘా ఉంటుందన్నారు. రాష్ట్రంలో తూర్పుగోవారి జిల్లాలో 10, పశ్చిమ గోదావరిలో 35, కృష్ణాజిల్లా 39, గుటూరు 8, ప్రకాశం 12, నెల్లూరు 27, విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలో 3 ఆక్వా ల్యాబ్స్‌ ఉన్నాయన్నారు. అనంతరం పల్లంలో బాక్స్‌ కల్చర్‌ విధానంపై మత్స్యశాఖ చేపడుతున్న పీతల కల్చరును పరిశీలించారు. ఈ బృందంలో కాకినాడ, అమలాపురం  మత్స్యశాఖ డీడీలు రామ్మోహనరావు, జయరావు, ఏడి రామచంద్రరావు, శ్రీవెంకటేశ్వర విశ్వ విద్యాలయం శాస్త్రవేత్త సందీప్, ఎస్‌ఐఎఫ్‌టీ మైక్రోబయాలజీ ల్యాబ్‌ ఎఫ్‌డీఓ షేక్‌ దిల్‌షాద్‌ తదితరులు ఉన్నారు.
మరిన్ని వార్తలు