ఆక్వా పార్క్‌ పనులు ఆపాల్సిందే

5 Apr, 2017 00:15 IST|Sakshi
ఆక్వా పార్క్‌ పనులు ఆపాల్సిందే
మొగల్తూరులోని ఆనంద ఆక్వా ప్లాంట్‌లో విషవాయువుల్ని వెదజల్లి ఐదుగురి ప్రాణాలను పొట్టన పెట్టుకున్న ఘటనతో అయినా ప్రభుత్వం కళ్లు తెరవాలని వైఎస్సార్‌ సీపీ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ ఆళ్ల నాని డిమాండ్‌ చేశారు. తక్షణమే తుందుర్రులో గోదావరి మెగా ఆక్వా ఫుడ్‌ పార్క్‌ పనులను నిలుపుదల చేయాలని కోరారు. అఖిలపక్షం ఆధ్వర్యంలో మీడియాతో కలిసి మొగల్తూరు నల్లంవారి తోటలో ఆనంద ఆక్వా ప్లాంట్‌ను, గొంతేరు డ్రెయిన్‌ను మంగళవారం పరిశీలించారు. 
నరసాపురం : ‘మొగల్తూరులో ఐదుగురు మరణానికి కాలుష్యం కారణం కాదు. ఫ్యాక్టరీ యాజమాన్యం నిర్లక్ష్యమే కారణం. ఆ ప్లాంట్‌లో అసలు కాలుష్యమే లేదు’ అని అసెంబ్లీ సాక్షిగా రాష్ట్ర మంత్రి కింజరపు అచ్చెన్నాయుడు ఇటీవల ప్రకటించారు. ఈ నేపథ్యంలో అక్కడ కాలుష్యం ఏ మేరకు ఉంది, నిబంధనలకు నీళ్లొదిలి అనంద యాజమాన్యం కాలుష్యాన్ని గొంతేరులో ఏవిధంగా కలుపుతోందన్న విషయాలపై అఖిలపక్షం మొగల్తూరులో పర్యటించింది. అక్కడి పరిస్థితులను ఆళ్ల నాని మీడియాకు చూపించారు. ఆనంద ఆక్వా ప్లాంట్‌ నిర్వహణ నిబంధనల మేరకే జరుగుతోందని, 
తొలగించారని ప్రభుత్వం ఆబద్ధపు ప్రకటన చేసింది. వాస్తవానికి ప్లాంట్‌లో ప్రమాదానికి కారణమైన సంప్‌ నుంచి నేరుగా పైపులైన్లను గొంతేరు డ్రెయిన్‌లోకి వేసింది. పడవల్లో గొంతేరు డ్రెయిన్‌లోకి మీడియాను, అఖిలపక్షాన్ని తీసుకువెళ్లిన స్థానిక మత్య్సకారులు అనంద యాజమాన్యం అక్రమంగా వేసిన పైపులైన్లను చూపించారు. ఆ పైపులైన్ల ద్వారా గొంతేరులో కలిసిన వ్యర్థాలను సైతం నీటిలోంచి తీసి చూపించారు. రొయ్యల తలలు, ఇతర భాగాలను గొంతేరు డ్రెయిన్‌లో కలుపుతున్న విషయం దీంతో తేటతెల్లమైంది. ఈ పైప్‌లైన్‌లనే ఐదు నెలల క్రితమే తొలగించినట్టు మంత్రి అచ్చెన్నాయుడు అసెంబ్లీలో చెప్పారని, మరి వీటి గురించి ఇప్పుడేం సమాధానం చెబు తారని మీడియా ద్వారా ఆళ్ల నాని ప్రశ్నించారు. ప్రమాదానికి కారణమైన సంప్‌ నుంచి వారం రోజులు గడుస్తున్నా విషవాయువులకు సంబం« దించిన దుర్వాసన తగ్గకపోవడానికి అక్కడికి వెళ్లిన వారంతా గమనించారు. పరిస్థితి ఇంత దారుణంగా ఉన్నా ప్రమాదానికి విద్యుదాఘాతం కారణమంటూ ప్రభుత్వం మసిపూసి మారేడుకాయ చేసేందుకు ప్రయత్నించడం దుర్మార్గమని ఆళ్ల నాని ధ్వజమెత్తారు. ఆనంద యాజమాన్యం చేస్తున్న తప్పులను, వారిని వెనకేసుకొస్తూ సాక్షాత్తు అసెంబ్లీ సాక్షిగా ప్రభుత్వం చెపుతున్న అబద్ధాలను వివరించారు. ఫ్యాక్టరీ వ్యర్థాలను రీసైక్లింగ్‌ చేస్తున్నారని, ట్రీట్‌మెంట్‌ ప్లాంట్‌ ద్వారా శుద్ధి చేసిన నీటిని యాజమాన్యం మొక్కల పెంపకానికి వినియోగిస్తోందని మంత్రులు అసెంబ్లీలో చెప్పారన్నారు. ఇక్కడ యాజమాన్యం పెంచుతున్న మొక్కలు ఎక్కడ ఉన్నాయని, ట్రీట్‌మెంట్‌ ప్లాంట్‌ ఎక్కడుందని ప్రశ్నించారు. అక్కడున్న రైతులు, మహిళలు, మత్స్యకారులు వైఎస్సార్‌ సీపీ, అఖిలపక్ష నాయకులకు తమ ఇబ్బందులను వివరించారు. ప్లాంట్‌ను ఇక్కడి నుంచి తరలించకపోతే తమకు బతుకులు ఉండవని వేడుకున్నారు. వారితో ఆళ్ల నాని మాట్లాడుతూ ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అసెంబ్లీలో ఇదే విషయమై ప్రభుత్వంతో తీవ్రంగా పోరాడుతున్నారని చెప్పారు. అధైర్యపడవద్దని వైఎస్సార్‌ సీపీ అండగా నిలబడుతుందని, న్యాయం జరిగే వరకూ పోరాడుతుందని భరోసా ఇచ్చారు. అసెంబ్లీలో పచ్చి అబద్ధపు ప్రకటన చేసిన మంత్రి అచ్చెన్నాయుడు దమ్ముంటే మీడియాతో కలిసి ఫ్యాక్టరీ వద్దకు చర్చకు రావాలని డిమాండ్‌ చేశారు. ఆనంద ప్లాంట్‌ పూర్తిగా నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్నట్టు పొల్యూషన్‌ కంట్రోల్‌ బోర్డు నివేదిక ఇచ్చిందని, పరిస్థితి మారకపోతే ఎలాంటి నోటీసు ఇవ్వకుండా ఫ్యాక్టరీని సీజ్‌ చేయాలని కూడా ఆదేశించిందని వివరించారు. అప్పుడు పరిశ్రమల శాఖ మంత్రిగా ఉన్న అచ్చెన్నాయుడు ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు. ఘోరం జరిగింది, ఐదుగురు ప్రాణాలు కోల్పోయిన ఘటనపై ఆలోచన చేయండని బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అసెంబ్లీలో కోరితే.. తప్పును సరిదిద్దే ప్రయత్నం చేయకపోగా శవ రాజకీయాలు చేస్తున్నారని మంత్రి అచ్చెన్నాయుడు అనడం దారుణమన్నారు. ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా జనం చనిపోతే వారిని ప్రతిపక్ష నేతగా పరామర్శించడం శవ రాజకీయాలు అవుతాయా, మానవత్వం మరిచిపోయి ఎక్కడ శవాలు ఉంటే అక్కడకు వైఎస్‌ జగన్‌ వెళ్లిపోతున్నారంటూ వ్యంగ్యంగా మాట్లాడతా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. కొత్తగా కార్మిక, పరిశ్రమల శాఖ మంత్రిగా బాధ్యతలు తీసుకున్న పితాని సత్యనారాయణకు జిల్లాలో కాలుష్యకారక పరిశ్రమలపై అవగాహన ఉందన్నారు. ముఖ్యంగా నరసాపురం ప్రాంతంపై పట్టుందన్నారు. ఆయనైనా మొగల్తూరు ఘటనపై న్యాయంగా వ్యవహరించాని సూచించారు. తుందుర్రు ఫ్యాక్టరీ నిర్మాణ పనులు ఆపాలనే డిమాండ్‌తో మాజీ ఎమ్మెల్యే ముదునూరి ప్రసాదరాజు ఈనెల 7, 8 తేదీల్లో నరసాపురంలో నిరాహార దీక్ష చేస్తున్నారని వివరించారు. 
ప్రజలు క్షమించరు
మాజీ ఎమ్మెల్యే ముదునూరి ప్రసాదరాజు మాట్లాడుతూ తుందుర్రులో ఆక్వా పార్క్‌ నిర్మిస్తే తమ జీవితాలు నాశనమైపోతాయని మూడేళ్లుగా ప్రజలు పోరాటం చేస్తుంటే ప్రభుత్వం దారుణంగా వ్యవహరిస్తోందన్నారు. ప్రభుత్వ నిర్లక్ష్యానికి ఐదుగురు యువకులు బలైపోయారని అన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం కళ్లు తెరవకుంటే, ప్రజలు క్షమించరని అన్నారు. సీపీఎం జిల్లా కార్యదర్శి బి.బలరామ్‌ మాట్లాడుతూ తుందుర్రు ఆక్వా పార్క్‌ను జనావాసాలు లేని సముద్ర తీరానికి తరలించే ఏర్పాటు చేయాలని కోరారు. తాము పరిశ్రమల ఏర్పాటుకు వ్యతిరేకం కాదనే విషయాన్ని మొదటి నుంచీ చెబుతున్నామని, ప్రజల జీవితాలను నాశనం చేసే విధంగా పరిశ్రమలు పెట్టొదని మాత్రమే కోరుతున్నారన్నారు. చిన్న పరిశ్రమలో లోపమే ఐదుగురి ప్రాణాలు తీసిందన్నారు. వైఎస్సార్‌ సీపీ పాలకొల్లు నియోజకవర్గ కన్వీనర్‌ గుణ్ణం నాగబాబు, పార్టీ కేంద్ర పాలకమండలి సభ్యుడు పీడీ రాజు, పార్టీ రాష్ట్ర కార్యదర్శి బర్రి శంకరం, నాయకులు బొద్దాని శ్రీనివాస్, నూకపెయ్యి సుధీర్‌బాబు, గుడిదేశి శ్రీనివాస్, ఎం.జయప్రకాష్, పాలంకి ప్రసాద్, వైకేఎస్, మంచెం మైబాబు, సీపీఎం నేత జేఎన్‌వీ గోపాలన్, పోరాట కమిటీ నాయకులు పాల్గొన్నారు.  
 
 
మరిన్ని వార్తలు