ఏరియా ఆసుపత్రుల్లోనూ డయాలసిస్!

7 Oct, 2015 00:50 IST|Sakshi
ఏరియా ఆసుపత్రుల్లోనూ డయాలసిస్!

♦  పీపీపీ పద్ధతిలో ఏర్పాటుకు సర్కారు యోచన
♦ ఆరోగ్యశ్రీ వర్తించే పేదలకు మరింత ప్రయోజనం
 
 సాక్షి, హైదరాబాద్: మూత్రపిండాల వ్యాధితో సతమతమయ్యే డయాలసిస్ రోగులకు శుభవార్త. వారానికి రెండు మూడుసార్లు డయాలసిస్ చేయించుకునే ఆరోగ్యశ్రీ రోగులు ఇక నుంచి సమీప ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే చేయిం చుకునేలా వైద్య ఆరోగ్యశాఖ ఏర్పాట్లు చేస్తోం ది. ప్రస్తుతం హైదరాబాద్, మహబూబ్‌నగర్, నిజామాబాద్, వరంగల్‌లోనే ప్రభుత్వ ఆధ్వర్యంలో డయాలసిస్ యూనిట్లు ఉండగా.. మిగిలిన జిల్లా కేంద్ర ఆసుపత్రుల్లోనూ ఏర్పా టు చేయాలని సర్కారు నిర్ణయించింది. అలాగే ఎక్కువమంది డయాలసిస్ రోగులున్న గ్రామాల సమీపంలోని ఏరియా ఆసుపత్రుల్లోనూ నెల కొల్పాలని యోచిస్తోంది. వాటన్నింటినీ ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యం (పీపీపీ)తో ఏర్పాటుచేయనుంది. ఇప్పుడు ప్రభుత్వ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినవన్నీ పీపీపీ పద్ధతిలో నడుస్తున్న డయాలసిస్ యూనిట్లే. వీటిని ఆరోగ్యశ్రీ రోగులతో పాటు ఇతరులూ ఉపయోగించుకోవచ్చు.

 7,374 మందికి డయాలసిస్
 ప్రస్తుతం రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ ద్వారా 7,374 మంది రోగులు డయాలసిస్ చేయించుకుంటున్నారు. వీరుకాక మరో 8 వేల మంది సాధారణ పద్ధతిలో డయాలసిస్ చేయించుకునే వారున్నారు. హైదరాబాద్ మినహా కేవలం మూడు జిల్లాల్లోనే ప్రభుత్వ ఆధ్వర్యంలో డయాలసిస్ యూనిట్లు ఉండటంతో ఆరోగ్యశ్రీ రోగులు ఇబ్బందులు పడుతున్నారు. వారానికి రెండు మూడుసార్లు డయాలసిస్ కోసం సుదూర ప్రాంతాలకు వెళ్లాల్సి వస్తోంది. ఆదిలాబాద్ జిల్లాలో ఆరోగ్యశ్రీ ద్వారా 310 మంది డయాలసిస్ చేయించుకుంటున్నారు. అక్కడ ప్రభుత్వ యూనిట్లు లేకపోవడంతో 115 మంది కరీంనగర్‌కు, 99 మంది నిజామాబాద్‌కు, 91 మంది హైదరాబాద్‌కు, ఐదుగురు వరంగల్‌కు వెళ్తున్నారు.

కరీంనగర్ జిల్లాలో ఆరోగ్యశ్రీ ద్వారా 697మందిలో 85మంది హైదరాబాద్, మిగిలినవారు స్థానికంగా  చేయించుకుంటున్నారు. ఖమ్మం జిల్లాలో 412 మందికి 100మంది హైదరాబాద్‌కు, 146మంది విజయవాడకు వెళ్తున్నా రు. మరో 78మంది ఖమ్మం ప్రైవేటు ఆసుపత్రుల్లో చేయించుకుంటున్నారు. నల్లగొండ జిల్లాలో 965 మందికి 637 మంది హైదరాబాద్‌కు వస్తున్నారు. మిగిలినవారు స్థానిక ప్రైవేటు ఆసుపత్రుల్లో చేయించుకుంటున్నారు. మహబూబ్‌నగర్ జిల్లాలో 662 మందిలో 354 మందిలో 213 మంది హైదరాబాద్‌కు వస్తున్నారు. ఇలా వారానికి రెండుమూడుసార్లు చార్జీ లు పెట్టుకొని వెళ్లడమంటే భారమే. అందుకే ఏరియా ఆసుపత్రుల్లోనూ డయాలసిస్ యూనిట్లు ఏర్పాటుకు సర్కారు యోచిస్తోంది.

 స్థలం, విద్యుత్, నీరు ఇస్తే చాలు
 డయాలసిస్ యూనిట్ కంపెనీలకు స్థలం, విద్యుత్, నీటి వసతి కల్పిస్తే యూనిట్‌ను వారే నెలకొల్పుతారు. ఉద్యోగులు, ఇతర సిబ్బంది బాధ్యత కూడా వారిదే. ఒకసారి డయాలసిస్ చేస్తే రూ.1,250 వసూలు చేస్తారు. ఆ మొత్తాన్ని ఆరోగ్యశ్రీ ట్రస్టు సంబంధిత కంపెనీకి చెల్లిస్తుంది. సొంతంగా ఏర్పాటు చేయడం కంటే పీపీపీ పద్ధతే మేలంటున్న సర్కారు దీనికోసం సంబంధిత కంపెనీలతో చర్చలు జరుపుతోంది.

మరిన్ని వార్తలు