'భవిష్యత్తులో ఏం జరుగుతుందో చెప్పలేను'

28 Feb, 2016 08:49 IST|Sakshi
'భవిష్యత్తులో ఏం జరుగుతుందో చెప్పలేను'

మహేష్‌బాబుతో చిత్ర నిర్మాణం
ఆ సంస్థ అధినేత అశ్వనీదత్
 
కొత్తపేట : తెలుగులో ప్రముఖ దర్శకులు, హీరోలతో భారీ బడ్జెట్ చిత్రాల్ని నిర్మించిన వైజయంతీ మూవీస్ కొన్నేళ్ల విరామం తరువాత తిరిగి చిత్ర నిర్మాణాన్ని చేపడుతున్నట్టు ఆ సంస్థ అధినేత సి.అశ్వనీదత్ తెలిపారు. ఆయన శనివారం సతీసమేతంగా మందపల్లి మందేశ్వర (శనేశ్వర) స్వామివార్ని దర్శించుకుని ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. అనంతరం ‘సాక్షి’తో ప్రత్యేకంగా మాట్లాడారు. కాలం కలిసి రాక చిత్ర నిర్మాణంలో విరామం ఏర్పడిందని, ఈ ఏడాది నుంచి వరుసగా చిత్రనిర్మాణానికి ప్లాన్ చేస్తున్నామని చెప్పారు.
 
 గౌతమ్‌మీనన్ దర్శకత్వంలో మహేష్‌బాబు హీరో గా త్వరలో చిత్ర నిర్మాణం ప్రారంభించి వచ్చే ఏడాది మేలో విడుదలకు ప్లాన్ చేశామని, ఈ ఏడాది ద్వితీయార్థంలోనే రామ్‌చరణ్ హీరోగా చిత్రనిర్మాణం ప్రారంభిస్తామని, ఆ చిత్రానికి దర్శకుడిని నిర్ణయించాల్సి ఉందని చెప్పారు. తన అభిమాన హీరోలు సీనియర్ ఎన్‌టీఆర్, మెగాస్టార్ చిరంజీవి అని చెప్పారు.
 
చిరంజీవితో తీసిన ‘జగదేక వీరుడు-అతిలోక సుందరి’ ఎక్కువ పేరు తెచ్చిందన్నారు. చిరంజీవి 151 లేదా 152 చిత్రాన్ని తానే నిర్మిస్తానన్నారు. తన కుమార్తె ప్రియాంకదత్ స్వప్నా బ్యానర్ స్థాపించి ‘ఎవడే సుబ్రహ్మణ్యం’ చిత్రాన్ని నిర్మించిందని, ఆ చిత్ర దర్శకుడు నాగ అశ్విన్ దర్శకత్వంలో మహానటి సావిత్రి జీవితకథతో చిత్రాన్ని నిర్మించనుందని చెప్పారు. మహానటుడు ఎన్‌టీఆర్ స్ఫూర్తితో టీడీపీలోకి వచ్చిన తాను అదే పార్టీలో కొనసాగుతున్నానన్నారు. ఒక్కసారి టీడీపీ తరఫున ఎన్నిక ల్లో పోటీ చేసినా ప్రస్తుతం ఆ ఆలోచన లేదని, భవిష్యత్తులో ఏం జరుగుతుందో చెప్పలేనని అన్నారు.
 

>
మరిన్ని వార్తలు