2018 నాటికి ‘చింతలపూడి’ని పూర్తి చేస్తాం

1 Oct, 2016 23:45 IST|Sakshi
2018 నాటికి ‘చింతలపూడి’ని పూర్తి చేస్తాం
చింతలపూడి : 2018 ఆగస్ట్‌ నాటికి చింతలపూడి ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేసేందుకు ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని రాష్ట్ర స్త్రీ, శిశు సంక్షేమ, గనుల శాఖ మంత్రి పీతల సుజాత పేర్కొన్నారు. స్థానిక మార్కెట్‌ కమిటీ ఆవరణలో వర్షాలకు ఇళ్లు కోల్పోయిన నిర్వాసితులకు ప్రభుత్వం నుంచి వచ్చిన ఆర్థిక సహాయాన్ని అందచేశారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ వచ్చే బడ్జెట్‌లో పథకానికి కావాల్సిన నిధులను కేటాయించనున్నట్టు చెప్పారు. 
అదేవిధంగా ఎత్తిపోతల పథకంలో భూములు కోల్పోతున్న రైతులకు న్యాయం చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. ముఖ్యమంత్రి దష్టిలో పెట్టనున్నట్టు చెప్పారు. దోమల నిర్మూలనపై ప్రజల ఆరోగ్యం ఆధారపడిందని, అందుకే దోమలపై దండయాత్ర చేపట్టామని తెలిపారు. మండలంలో నివాసాలు కోల్పోయిన 14 మందికి బియ్యం, కందిపప్పు, నూనెతో పాటు నగదు సాయాన్ని అందచేశారు. కార్యక్రమంలో జెడ్పీటీసీ తాళ్లూరి రాధారాణి, ఎంపీపీ దాసరి రామక్క, తహసీల్దార్‌ టి.మైఖేల్‌రాజ్, ఎంపీడీవో ఎం.రాజశేఖర్, చింతలపూడి, రాఘవాపురం సొసైటీ అధ్యక్షుడు నలమాటి రామకృష్ణ, ఎం.శ్రీనివాసరావు, ఎంపీటీసీలు, చిన్నంశెట్టి సీతారామయ్య, సయ్యద్‌ బాబు, బందెల ఆశీర్వాదం పాల్గొన్నారు.  
 
మరిన్ని వార్తలు