మూడు నెలల వయసులో నటినయ్యా..

6 Aug, 2016 07:58 IST|Sakshi
మూడు నెలల వయసులో నటినయ్యా..
సింహాచలం: మూడు నెలల వయస్సు ఉన్నప్పుడే సినిమాల్లో నటించానని, ప్రస్తుతం తల్లి పాత్రలంటే చాలా ఇష్టమని సీనియర్‌ సినీ నటి తులసి తెలిపారు. సింహాచలం శ్రీవరాహ లక్ష్మీనసింహస్వామిని శుక్రవారం ఆమె దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆమె స్థానిక విలేకర్లతో మాట్లాడుతూ 1967లో విడుదలైన భార్య సినిమాలో రాజబాబు కుమారుడి(మూడు నెలల పాపనైన నన్ను తీసుకున్నారు)గా నటించానన్నారు. మహానటి సావిత్రి మా అమ్మకి బెస్ట్‌ ఫ్రెండ్, దాంతో నెలల బాబు అవసరం కావడంతో నన్ను తీసుకున్నారన్నారు.

అలా సావిత్రి ఇచ్చిన ఆ అవకాశమే నాకు జీవితంగా మారిందని చెప్పారు. బాలనటిగా ఊహ తెలిసి జీవిత తరంగాలు సినిమాలో తొలి డైలాగ్‌ చెప్పానని గుర్తు చేసుకున్నారు. శంకరాభరణం చిత్రం బాలనటిగా తనకు మంచి గుర్తింపునిచ్చిందన్నారు. హీరోయిన్‌గా తొలిసారి చిరంజీవి నటించిన శుభలేఖ సినిమాలో నటించానన్నారు. తెలుగు, తమిళం, హిందీ, మలయాళం భాషల్లో మొత్తం 318 చిత్రాల్లో నటించినట్టు ఆమె చెప్పారు. రామ్‌ కథానాయకుడిగా తీస్తున్న హైపర్‌ సినిమాలో తల్లి పాత్రలో ప్రస్తుతం నటిస్తున్నానన్నారు. కష్ణవంశీ దర్శకత్వంలో సందీప్‌ కిషన్‌ హీరోగా తెరకెక్కుతున్న నక్షత్ర వనం సినిమా కూడా ప్రస్తుతం చేస్తున్నానన్నారు. కష్ణవంశీ సినిమాల్లో తెలుగుదనం ఉట్టిపడుతుందని, అందుకే ఆయనంటే చాలా ఇష్టమని చెప్పారు. బాలనటిగా, కథనాయికిగా, తల్లిగా ఇలా అన్ని పాత్రల్లో నటించడం చాలా ఆనందంగా ఉందన్నారు. తల్లిపాత్రలో మరిన్ని సినిమాలు చేయాలని అభిమానులు అడుగుతున్నారన్నారు.

ఈ తరం కథనాయకుల్లో అల్లు అర్జున్, నయనతార, అప్పట్లో ఎస్‌.వి.రంగారావు, సావిత్రి అంటే ఎంతో ఇష్టమన్నారు. ఇటీవల విడుదలైన బిచ్చగాడు సినిమాలో తల్లి పాత్ర తానే చేయాల్సి ఉందని, కొన్ని పరిస్థితుల కారణంగా యాక్ట్‌ చేయలేకపోయానన్నారు. ప్రస్తుతం బెంగళూరులో ఉంటున్నట్లు తులసి చెప్పారు. సింహాద్రి అప్పన్న దర్శనం కోసం వచ్చిన ఆమె కప్ప స్తంభాన్ని ఆలింగనం చేసుకుని అంతరాలయంలో అష్టోత్తరంపూజ నిర్వహించారు. ఆలయ సంప్రదాయం ప్రకారం స్వామి ప్రసాదాన్ని టెంపుల్‌ ఇన్‌స్పెక్టరు వాయునందనరావు ఆమెకు అందజేశారు.
మరిన్ని వార్తలు