ఒకే రోజు రెండిళ్లలో చోరీ

3 Feb, 2017 00:31 IST|Sakshi
- ఆత్మకూరులో ఘటనలు
- బైకు, టీవీ, బంగారు, నగదు అపహరణ
 
ఆత్మకూరురూరల్:  ఆత్మకూరు సాయిబాబానగర్‌, పాత ఠాణా సమీప ప్రాంతంలో బుధవారం రాత్రి దొంగలు పడ్డారు. ఒకేరాత్రి రెండిళ్లను దోచేశారు. తాళం వేసిన గృహాలే లక్ష్యంగా చేసుకుని తమ పని కానిచ్చేశారు. సాయిబాబ నగర్‌లో నివాసం ఉంటున్న స్థానిక  స్టేట్‌ బ్యాంకు ఫీల్డ్‌ ఆఫీసర్‌ కృష్ణ చైతన్య బంధువుల ఇంట్లో శుభకార్యం ఉండడంతో మూడు రోజుల క్రితం కుటుంబీకులతో కలిసి హైదరాబాద్‌ వెళ్లారు. విషయం గ్రహించిన దొంగలు బుధవారం రాత్రి తాళాలు పగులగొట్టి ఇంట్లోకి ప్రవేశించారు. బీరువాలను తెరిచి విలువైన వస్తువులు దొరక్క పోవడంతో సెల్‌ ఫోన్‌తోపాటు ఇంటి ముందు పార్క్‌ చేసి ఉంచిన పల్సర్‌ బైక్‌ను ఎత్తుకెళ్లారు.
 
అలాగే పాత ఠాణా సమీపంలో  నివాసముంటున్న కండక్టర్‌ మహబూబ్‌ బాషా డ్యూటీకి వెళ్లాడు. ఆయన బార్య పుట్టింటికి వెళ్లడంతో ఇంటికి తాళం వేసి ఉంది. ఆ ఇంటిలో చొరబడిన దొంగలు రూ.10 వేలు నగదు, మూడున్నర్ర‡ తులాల బంగారు నగలను దొంగిలించారు. ఇంట్లోని టీవీని కూడా ఎత్తుకెళ్లారు. పక్కింటి వారి ఫిర్యాదు మేరకు సీఐ కృష్ణయ్య, ఎస్‌ఐ లోకేష్‌కుమార్‌ ఘటనాస్థలాలకు వెళ్లి పరిశీలించారు. కర్నూలు నుంచి క్లూస్‌ టీంను రప్పించి ఆధారాలు సేకరించారు. ఇందుకు సంబంధించి ఎస్‌ఐ లోకేష్‌కుమార్‌ మాట్లాడుతూ ఏదైనా పనులపై ఇంటికి తాళం వేసి వెళ్లేవారు విలువైన వస్తువులను వెంట తీసుకెళ్లాలన్నారు. అలాగే పోలీసులకు సమాచారం అందిస్తే నిఘా వేసి ఉంచుతామన్నారు.   
 
>
మరిన్ని వార్తలు