ప్రియురాలిపై చాకుతో దాడి

31 Dec, 2016 02:30 IST|Sakshi
ప్రియురాలిపై చాకుతో దాడి
తాడేపల్లిగూడెం రూరల్‌ : ప్రియురాలు మాట్లాడటం లేదనే ఆక్రోశంతో ఆమెపై దాడికి తెగబడిన ఓ ప్రేమోన్మాది తెగబడ్డాడు. ఈ ఘటన  తాడేపల్లిగూడెం పట్టణం విమానాశ్రయ రన్‌వే ప్రాంతంలో శుక్రవారం సాయంత్రం జరిగింది. సేకరించిన వివరాల ప్రకారం.. ఖమ్మం జిల్లా బూర్గుంపాడుకు చెందిన 28ఏళ్ల మురికి సంజీవ్‌కుమార్‌  స్థానిక హౌసింగ్‌ బోర్డు కాలనీలో నివాసముంటున్నాడు. అతను ఓ ప్రైవేట్‌ కళాశాలలో ఎంటెక్‌ చదువుతూ  ప్రైవేట్‌ కంపెనీలో సేల్స్‌ ప్రమోటర్‌గా పనిచేస్తున్నాడు. సంజీవ్‌ తన ఇంటికి ఎదురుగా నివాసముంటున్న యువతిని రెండేళ్లుగా ప్రేమిస్తున్నాడు. ఈ విషయం యువతి ఇంటిలో తెలియడంతో మందలించారు. దీంతో సంజీవ్‌కు ఆమె దూరంగా ఉంటోంది. నాలుగు రోజులుగా ఆమె మాట్లాడకపోవడంతో ఆగ్రహించిన సంజీవ్‌ చాకు కొని ఆమెను ఎయిర్‌ డ్రమ్‌ ప్రాంతానికి తీసుకెళ్లి దాడి చేశాడు. అనంతరం అదే చాకుతో తన కాలిపైనా గాయం చేసుకున్నాడు. రక్తపు మడుగులో కొట్టుమిట్టాడుతున్న వీరిని స్థానికులు 108 వాహనంలో తాడేపల్లిగూడెం ఏరియా ప్రభుత్వాసుపత్రికి తరలించారు. యువతి పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన వైద్యం కోసం ఏలూరు తరలించారు. ఈ విషయం తెలుసుకున్న పట్టణ ఎస్సై ఐ.వీర్రాజు ఇద్దరి నుంచి స్టేట్‌మెంట్లు నమోదు చేశారు. హత్యాయత్నం కేసు  నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 
 
మరిన్ని వార్తలు