చేతబడి నెపంతో తండ్రీకొడుకులపై దాడి

7 Jul, 2017 10:13 IST|Sakshi
చేతబడి నెపంతో తండ్రీకొడుకులపై దాడి

ములకలపల్లి(అశ్వారావుపేట): చేతబడి నెపంతో మండలంలోని మొగరాళ్ళగుప్ప గ్రామంలో గురువారం తండ్రీకొడుకులపై దాడి జరిగింది. మొగరాళ్ళగుప్ప గ్రామానికి చెందిన గుండు రమేష్‌–సీత దంపతులకు ఇద్దరు కుమార్తెలు. పెద్దకుమార్తె గుండు అశ్విని, ఖమ్మంలోని బాలికల గురుకుల పాఠశాలలో రెండేళ్లపాటు చదివింది. ఇంటిలో ఆర్థిక ఇబ్బంది కారణంగా ఈ ఏడాది చదువు ఆపేసింది. ఆమె కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతోంది.

థైరాయిడ్‌ ఎక్కువగా ఉందని వైద్యులు చెప్పారు. మందులు వాడినప్పటికీ ఇది తగ్గలేదు. తనను ఎవరో చంపడానికి ప్రయత్నిస్తున్నారని, అందుకే తనకు ఇలా జరుగుతున్నదని ఆమె తన తల్లిదండ్రులతో చెప్పింది. ఆమె గురువారం ఉదయం మృతిచెందింది. మృతదేహాన్ని చూసేందుకు గ్రామస్తులు వచ్చారు. వారిలో కీసరి రామచంద్రం ఉన్నాడు. ఆయనను చూసి న అశ్విని కుటుంబీకులు... ‘చేతబడి చేసి చంపావు’ అంటూ కర్రలతో దాడికి దిగారు. ఈ విషయం తెలుసుకుని, కాపాడేందుకు వెళ్లిన రామచంద్రం కుమారుడు శ్రీనును కొట్టారు. వారిని పాల్వంచ ఆస్పత్రికి ఎస్సై రామ్‌చరణ్‌ తరలించారు. దాడికి దిగిన వారిపై కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.

మరిన్ని వార్తలు