మహిళా ఉద్యోగిపై దాడి

22 Aug, 2016 23:56 IST|Sakshi
మహిళా ఉద్యోగిపై దాడి
  • lపరిస్థితి ఆందోళనకరం
  • పోలీసు స్టేషన్‌లో లొంగిపోయిన భర్త
  • విధులు ముగించుకుని ఇంటికి బయల్దేరిన డీజిల్‌షెడ్‌ కార్యాలయ సూపరింటెండెంట్‌ సుకన్య (37)పై గుర్తు తెలియని వ్యక్తులు వేటకొడవళ్లు, కత్తులతో దాడి చేశారు. వివరాల్లోకి వెళితే....

    పట్టణంలోని డీఆర్‌ఎం కార్యాలయం పర్సనల్‌ బ్రాంచ్‌ విభాగంలో పని చేస్తున్న సుకన్య నాలుగు రోజుల కిందట డీజిల్‌షెడ్‌కు బదిలీ అయ్యారు. సోమవారం సాయంత్రం డ్యూటీ ముగించుకొని ఇంటికి బయలుదేరారు. ఆర్‌పీఎఫ్‌ చెక్‌పోస్టు వద్దకు రాగానే కాపు కాచిన నలుగురైదుగురు గుర్తుతెలియని వ్యక్తులు ఆమెపై మారణాయుధాలతో దాడి చేశారు. ముఖం, చేయి, కుడికాలు, కడుపు భాగాల్లో తీవ్ర గాయాలయ్యాయి. కొన ఊపిరితో ఉన్న ఆమెను సహోద్యుగులు సమీపంలోని రైల్వే ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు ఆమె  పరిస్థితి ఆందోళనకరంగా ఉందని వెల్లడించారు.  రూరల్‌ సీఐ గురుప్రసాద్, వన్‌టౌన్‌ ఎస్‌ఐ నగేష్‌బాబులు సంఘటన స్థలానికి చేరుకొని దర్యాప్తు ప్రారంభించారు.

    రైల్వే ఉద్యోగులతో ఆస్పత్రి కిటకిట
      విషయం తెలుసుకున్న ఏడీఆర్‌ఎం సుబ్బరాయుడు, కార్మిక సంఘాల నాయకులు, ఉద్యోగులు  రైల్వే ఆస్పత్రికి తరలివచ్చారు. సీనియర్‌ డీఎంఈ (డీజిల్‌) గోపాల్,  డీపీఓ మాలతి, మజ్దూర్‌ యూనియన్‌ డివిజన్‌ ప్రధాన కార్యదర్శి ఎస్‌.విజయ్‌కుమార్, ఎంప్లాయీస్‌ సంఘ్‌ డివిజన్‌ ప్రధాన కార్యదర్శి కే.ప్రభాకర్‌ తదితరులు సుకన్య ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. ఆర్‌పీఎఫ్‌ కమాండెంట్‌ ఎలీషా సంఘటన స్థలాన్ని పరిశీలించారు.


    ప్రాణహానిపై వారం కిందటే ఫిర్యాదు
    రైల్వే ఉద్యోగి సుకన్య 13 ఏళ్ల కిందట రఘు అనే వ్యక్తిని పెళ్లి చేసుకుంది. వీరికి ఇద్దరు కుమారులున్నారు. వీరి మధ్య సఖ్యత లేకపోవడంతో వ్యవహారం కోర్టు వరకు వెళ్లింది. ప్రస్తుతం రఘు ఇద్దరు పిల్లలతో వేరు కాపురముంటున్నాడు. రఘు తరచూ ఆమె పని చేసే కార్యాలయం వద్దకు వెళ్లి గొడవ పడుతుండేవాడని తెలిసింది. భర్త  వల్ల తనకు ప్రాణహాని ఉందని సుకన్య వారం రోజుల కిందట వన్‌టౌన్‌ పోలీసుస్టేçÙన్‌లో ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో సోమవారం ఒక్కసారిగా మారణాయుధాలతో కొందరు సుకన్యపై దాడిచేశారు. కొన ఊపిరితో పోరాడుతున్న సుకన్య భర్త రఘు పేరు చెబుతుండటంతో సహా ఉద్యోగులు, స్థానికులు పోలీసులకు తెలిపారు.
    లొంగిపోయిన భర్త: సుకన్య భర్త రఘు రాత్రి పోలీసు స్టేషన్‌లో లొంగిపోయాడు. తన భార్యపై తానే హత్యాయత్నం చేయించినట్లు ఒప్పుకున్నట్లు తెలిసింది.

     

మరిన్ని వార్తలు