అర్థరాత్రి యువకుడిపై దాడి

26 Jul, 2016 22:35 IST|Sakshi
అర్థరాత్రి యువకుడిపై దాడి

తూర్పు గోదావరి జిల్లా : జగ్గంపేట మండలంలోని రామవరం గ్రామంలో అర్థరాత్రి జగ్గంపేటకు చెందిన యువకుడు కేశినీడి వీరబాబుపై హత్యాయత్నం జరిగింది. స్థానికులు, పోలీసుల వివరాల ప్రకారం రామవరం హైవేను ఆనుకుని వీరబాబు దాబా హోటల్‌ను నిర్వహిస్తున్నాడు. అర్థరాత్రి సమయంలో హోటల్‌లో పనులు ముగించుకుని రామవరంలో ఉంటున్న నివాసం వద్దకు వెళుతుండగా గుర్తుతెలియని వ్యక్తులు అతనిపై దాడి చేశారు.

 వీరబాబు కేకలకు సమీపంలో ఉన్నవారు మేల్కోవడంతో నిందితులు పరారయ్యారు. సంఘటనా స్థలం వద్ద బురదగా ఉండడంతో వీరబాబు ఒంటి నిండా బురదతో నిండిపోవడంతో కడిగి కాకినాడ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. సుమారు పది మంది మూకుమ్మడిగా వచ్చిన వ్యక్తులు బైక్‌పై వెళ్తున్న తనను కొట్టి కింద పడేసి కాళ్లు, చేతులతో దాడి చేశారని, తాళ్లతో చేతులు, కాళ్లు కట్టి హత్యాయత్నానికి పాల్పడినట్టు పోలీసులకు బాధితుడు ఫిర్యాదు చేశాడు.

తీవ్రంగా గాయపడిన వీరబాబు కాకినాడ ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఎసై్స అలీఖాన్ బాధితుడి నుంచి ఆస్పత్రిలో స్టేట్‌మెంట్ రికార్డు చేసుకున్నారు. పోలీసులు కేసును అన్ని కోణాల్లోను దర్యాప్తు చేస్తున్నారు. జగ్గంపేటలో స్థల వివాదమే వీరబాబుపై హత్యాయత్నానికి కారణమై ఉంటుందని భావిస్తున్నారు.
 

మరిన్ని వార్తలు