తండ్రిపై కుమారుడి హత్యాయత్నం..?

6 Feb, 2017 01:03 IST|Sakshi
తండ్రిపై కుమారుడి హత్యాయత్నం..?

కడిపికొండలో కలకలం

కాజీపేట అర్బన్‌ : కుమారుడు ఇచ్చిన కూల్‌డ్రింక్‌ తాగి అపస్మారక స్థితిలోకి వెళ్లి చికిత్స పొందుతున్న ఓ తండ్రి..ఈ విషయం తెలిసిన తనయుడు సైతం పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఘటనలో ఇరువురు ప్రాణాపాయస్థితిలోకి చేరుకున్నారు. ఈ సంఘటన శనివారం నగరంలోని 35 డివిజన్‌ కడిపికొండలో చోటుచేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం కడిపికొండ గ్రామానికి చెందిన గంగుల దేవేందర్‌రెడ్డి కాజీపేట రైల్వే స్టేషన్‌లో గ్యాంగ్‌మెన్‌గా విధులు నిర్వర్తిస్తున్నాడు. ఈ క్రమంలో కొంతకాలంగా ఆరోగ్యం సరిగాలేకపోవడంతో తన కుమారుడు భరత్‌కుమార్‌రెడ్డికి వీఆర్‌ఎస్‌లో ఉద్యోగాన్ని ఇప్పించేందుకు ప్రయత్నాలు చేస్తున్నాడు. ఇదిలా ఉండగా భరత్‌కుమార్‌రెడ్డికి నాలుగునెలల క్రితం వరికోల్‌ గ్రామానికి చెందిన జ్యోతితో వివాహం జరిగింది.పెళ్లి అయినప్పటి నుంచి ఖాళీగా ఉంటున్న భరత్‌కుమార్‌రెడ్డితో జ్యోతికి గొడవలు జరిగి తన తల్లిగారి ఇంటికి వెళ్లిపోయింది.

ఈ క్రమంలో శనివారం తెల్లవారుజామున భరత్‌కుమార్‌రెడ్డి తండ్రికి కూల్‌డ్రింక్‌ ఇవ్వడంతో అది తాగిన దేవేందర్‌రెడ్డి అపస్మారక స్థితిలోకి వెళ్లారు.ఈ విషయాన్ని ఆయనే స్వయంగా శనివారం పాలప్యాకెట్ల విక్రయదారుడికి వెల్లడించారు. దీంతో సదరు విక్రయదారుడు 108కు సమాచారం అందించడంతో చికిత్స నిమిత్తం సుబేదారిలోని ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం దేవేందర్‌ రెడ్డి పరిస్థితి విషమంగా ఉంది.ఈ విషయాన్ని తెలుసుకున్న తనయుడు భరత్‌కుమార్‌రెడ్డి సైతం పురుగుల మందు తాగి ఎంజీఎంలో చికిత్స పొందుతున్నాడు. దీనిపై సమాచారం అందుకున్న మడికొండ పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించినట్లు స్థానికులు వెల్లడించారు. కాగా, సంఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.     

>
మరిన్ని వార్తలు