బాబోయ్‌ బ్యాంకు

12 Dec, 2016 15:05 IST|Sakshi
బాబోయ్‌ బ్యాంకు
సత్తువ లేకపోయినా ఓపిక తెచ్చుకుని మరీ వృద్ధులు, వితంతువులు, దివ్యాం గులు బ్యాంకుల వద్ద బారులు తీరుతున్నారు. ఆరోగ్యం సహకరించకపోయినా ఉదయం నుంచీ క్యూలో నిలబడక తప్పడం లేదు. చేతికందేది స్వల్ప మొత్తమే అయినా గంటల తరబడి వేచి చూడాల్సిన పరిస్థితి. ఉదయం నుంచే నిరీక్షిస్తున్నా.. డబ్బు చేతికి అందుతుందో లేదోననే ఆందోళన. ఖాతాల్లో సొమ్ములున్నా.. అవసరానికి సరిపడేంత తీసుకునే అవకాశం లేదు. అందరిలోనూ అస హనం పెరిగిపోతోంది. బ్యాంక్‌ ఉద్యోగులకు బీపీ వస్తోంది. నిస్సహాయ స్థితిలో  తమను తామే తిట్టుకుంటూ నోట్ల కోసం పాట్లు పడుతున్నారు. 
 
సాక్షి ప్రతినిధి, ఏలూరు : పెద్ద నోట్ల రద్దుతో కష్టాల కుంపట్లో పడి సామాన్యులు విలవిల్లాడుతున్నారు. రోజంతా క్యూలో నిలబడినా.. సొమ్ము చేతికందుతుందో లేదోననే ఆందోళన అందరిలోనూ కనబడుతోంది. ఒకటో తారీఖున బ్యాంక్‌ ఖాతాల్లో జమ అయిన జీతాలు తీసుకునేందుకు ఉద్యోగులు.. కేవలం పింఛను డబ్బులపైనే ఆధారపడి జీవించే వృద్ధులు, దివ్యాంగులు, వితంతువులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో జిల్లాలోని అన్ని ఏటీఎంలు, బ్యాంకుల పనితీరును ‘సాక్షి’ బృందం పరిశీలించింది. 
 
ఎన్ని బ్యాంకులున్నా.. ఏం లాభం
జిల్లాలో వివిధ బ్యాంకులకు సంబంధించి 585 శాఖలు ఉన్నాయి. వీటికి అనుబంధంగా 594 ఏటీఎంలు ఉన్నాయి. గురు, శుక్రవారాల్లో 368 ఏటీఎంలు మాత్రమే పనిచేశాయి. వీటిలో కేవలం 62 ఏటీఎంలలో రూ.100 నోట్లు పెట్టారు. మిగిలిన ఏటీఎంలలో రూ.2 వేల నోట్లను మాత్రమే అందుబాటులో ఉంచారు. ఈ ఏటీఎంలు కూడా గంట, గంటన్నర మాత్రమే పనిచేశాయి. దీంతో పింఛనుదారులు బ్యాంకుల్లోనే సొమ్ము తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. జిల్లాలో వృద్ధాప్య, దివ్యాంగ, వితంతు, చేనేత, కల్లుగీత విభాగాల్లో 3.38 లక్షల మంది పింఛనుదారులు ఉన్నారు. వీరందరికీ రూ.37 కోట్లు చెల్లించాల్సి ఉంది. గడచిన రెండు రోజుల్లో కేవలం రూ.7 కోట్లు మాత్రమే బ్యాంకులు చెల్లించాయి. మరోవైపు జిల్లావ్యాప్తంగా 34వేల మంది ఉద్యోగులుండగా, 6,800 మంది మాత్రమే బ్యాంకుల నుంచి కొంతమొత్తంలో జీతం సొమ్మును తీసుకోగలిగారు.  ప్రైవేట్‌ ఉద్యోగుల పరిస్థితి కూడా ఇలానే ఉంది. రద్దీ ఉన్న సమయాల్లో సైతం వృద్ధులు, దివ్యాంగులు, మహిళలకు ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేయకపోవడంతో వారి ఇబ్బం దులు అన్నీఇన్నీ కావు. మొదటి రోజున పింఛను సొమ్ము ఖాతాలో పడకపోవడంతో రెండో రోజైనా వస్తుందనుకున్న వృద్ధులకు, వితంతువులకు, వికలాంగులకు నిరాశ తప్పలేదు. చాలాచోట్ల వారి ఖాతాల్లో నగదు జమ కాలేదు. ఒకపక్క బ్యాంకులో నగదు నిల్వలు సరిపడా లేక, మరోవైపు ఖాతాదారుల నుంచి వస్తున్న వత్తిళ్లతో బ్యాంకు సిబ్బంది కూడా నలిగిపోతున్నారు.
 
 ప్రతి బ్యాంకుకు  రూ.6 లక్షల నుంచి రూ.10 లక్షలు మాత్రమే 
నగదు వస్తుండటంతో ఎక్కువ మందికి చెల్లించలేకపోతున్నారు. ఖాతాదారులు వాదనకు దిగుతుండటంతో తమపై కోపం తెచ్చుకుంటే ఉపయోగం లేదని, ప్రభుత్వంపై చూపండంటూ బ్యాంక్‌ ఉద్యోగులు అంటున్నారు. కొవ్వూరు మండలం ధర్మవరం అంధ్రాబ్యాంక్‌లో పింఛను సొమ్ముతీసుకోవడానికి వచ్చిన కార్సిక సూర్యకుమారి అనే వృద్ధురాలు సొమ్మసిల్లి పడిపోయింది. బుట్టాయగూడెం మండలం అచ్చియ్యపాలెంకు చెందిన కాకర్లముడి రాములమ్మ (68) అనే వృద్ధురాలు బ్యాంకు వద్ద క్యూలో నిలబడినా సొమ్ము అందలేదు. ఇంటికి వెళ్లిన అనంతరం వంట చేసుకుంటూ గురువారం రాత్రి మృతి చెందింది. తన కుమార్తెకు ఆరోగ్యం బాగాలేదని డబ్బులు ఇప్పించాలని కామవరపుకోటకు చెందిన ఆకుల చంద్రకళ అనే మహిళ ఆంధ్రాబ్యాంక్‌ మేనేజర్‌కు విన్నవించుకుంది. బ్యాంకులో డబ్బు లేదని, ఎవరైనా జమ చేస్తే ఇస్తానని మేనేజర్‌ సమాధానం ఇచ్చారు.
 
ఎనీ టైం మూత
ఏటీఎంలు ఎనీటైమ్‌ మూత అన్న చందంగా తయారయ్యాయి. భీమవరంలో దాదాపుగా ఏ ఏటీఎంలోనూ నగదు లేదు. చింతలపూడి నియోజకవర్గంలో 35 ఏటీఎంలు ఉండగా ఆరు మాత్రమే పనిచేశాయి. నిడదవోలులో 20 ఏటీఎంలు 11 గంటలకే మూతపడ్డాయి. తాడేపల్లిగూడెం, పెంటపాడులో 59 ఏటీఎంలకు గాను 6 మాత్రమే పనిచేశాయి. ఉండి మండలంలో ఒక్క ఏటీఎం కూడా పనిచేయలేదు. తణుకు, అత్తిలి, ఇరగవరం మండలాలతోపాటు పట్టణ పరిధిలో మొత్తం 50 ఏటీఎంలు ఉండగా ఆరు మాత్రమే పనిచేశాయి. నరసాపురంలో 14 ఏటీఎంలు ఉండగా ఒక్కటి కూడా పనిచేయలేదు. ఎస్‌బీఐ మెయి¯ŒS బ్రాంచ్‌ వద్ద ఏటీఎం మాత్రం ఉదయం 2 గంటలపాటు పనిచేసింది. మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకూ  ఆంధ్రాబ్యాంక్, ఎస్‌బీఐ ఏటీఎంలు పనిచేశాయి. ఆచంట నియోజకవర్గంలో 22 ఏటీఎంలు ఉండగా 13 మూతపడ్డాయి. కొవ్వూరులో ఉన్న 5 ఏటీఎంలు మధాహ్నానికే మూతపడ్డాయి. 
 
మరిన్ని వార్తలు