అసమ్మతి నేతలకు బాలయ్య పిలుపు

25 Feb, 2017 00:13 IST|Sakshi

నేడు పీఏ శేఖర్‌ విషయంపై నిర్ణయం?
హిందూపురం అర్బన్‌ : హిందూపురం నియోజకవర్గంలోని తెలుగుదేశం పార్టీలో అసమ్మతి నాయకులను మంగళవారం హైదరాబాద్‌కు రావాలని ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ శుక్రవారం రాత్రి స్వయంగా ఫోన్‌ చేసి పిలిచినట్లు తెలిసింది. కొంతకాలంగా పార్టీలో జరుగుతున్న పరిణామాలు, ఎమ్మెల్యే పీఏ శేఖర్‌ వివాదంపై సీనియర్లతో చర్చించి భవిష్యత్తు కార్యాచరణపై నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం. మాజీ ఎమ్మెల్యే సీసీ వెంకటరాముడు, అంబికా లక్ష్మీనారాయణతో పాటు జెడ్పీటీసీ సభ్యులు లక్ష్మీనారాయణరెడ్డి, ఆదినారాయణ మరికొందరు ముఖ్యనాయకులను హైదరాబాద్‌కు పిలిచారు.

పీఏ శేఖర్‌ వ్యవహారంపై నేడు ప్రకటన?
పీఏ శేఖర్‌ వ్యవహారంపై ఎమ్మెల్యే బాలకృష్ణ శనివారం తన నిర్ణయం ప్రకటించే అవకాశం ఉన్నట్లు పార్టీలో చర్చ జరుగుతోంది. శేఖర్‌ వ్యవహారంపై తేల్చకపోతే కుదరదని అసమ్మతి నాయకులు పట్టుబట్టిన విషయం తెలిసిందే. ఈ మేరకు ఈ అంశంపై నిర్ణయం ప్రకటించిన తర్వాత పార్టీ అసమ్మతి నాయకులతో సమవేశం అవుతారని సమాచారం.

మరిన్ని వార్తలు