ఎన్టీఆర్‌కు భారతరత్న ఇవ్వాలి: బాలకృష్ణ

19 Jan, 2017 03:21 IST|Sakshi
ఎన్టీఆర్‌కు భారతరత్న ఇవ్వాలి: బాలకృష్ణ

బంజారాహిల్స్‌ : తెలుగుజాతి అభ్యున్నతికై పాటుపడ్డ మహోన్నత వ్యక్తి ఎన్టీఆర్‌ అని ఆయనకు భారత రత్న ఇవ్వాలని ఈ దిశగా ఇప్పటికే కేంద్రంపై ఒత్తిడి తెస్తున్నామని హీరో బాలకృష్ణ స్పష్టం చేశారు. ఎన్టీఆర్‌ వర్ధంతిని పురస్కరించుకొని బుధవారం బంజారాహిల్స్‌లోని బసవతారకం క్యాన్సర్‌ ఆస్పత్రిలో ఆయన విగ్రహానికి పుష్పాంజలి ఘటించి పేద రోగులకు పండ్లు, దుప్పట్లు పంపిణీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఎన్టీఆర్‌ క్రమశిక్షణకు మారుపేరుగా నిలిచారని అన్నారు. దేశ రాజకీయాల్లో కొత్త ఒరవడి సృష్టించిన నాయకుడిగా విభిన్న సినీ తారగా సామాజిక సేవకుడిగా భారతావనికి సేవలు అందించారని అన్నారు. బాలకృష్ణ అభిమాని గోపీచంద్‌ క్యాన్సర్‌ పేషంట్ల సహాయార్థం రూ.లక్ష చెక్కును బాలకృష్ణకు అందజేశారు. ఆశాకుమారి అనే మహిళ రూ.50 వేల చెక్కును అందజేశారు.

ఎన్టీఆర్‌ అమరజ్యోతి ర్యాలీ
సనత్‌నగర్‌: ఎన్టీఆర్‌ అభిమాన సంఘం ఆధ్వర్యంలో బుధవారం ఎన్టీఆర్‌ అమరజ్యోతి ర్యాలీని నిర్వహించారు. సినీహీరో , ఎమ్మెల్యే బాలకృష్ణ, టీడీపీ నేతలు రమణ, రేవంత్‌రెడ్డి, మాజీ మంత్రి పెద్దిరెడ్డి, నగర నాయకులు ఎంఎన్‌శ్రీనివాస్, సారంగపాణి తదితరులు పాల్గొన్నారు. మొదట బేగంపేట్‌ రసూల్‌ చౌరస్తాలోని ఎన్టీఆర్‌ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం శాంతికపోతాలను గాలిలోకి ఎగురవేసి ఎన్టీఆర్‌ ఘాట్‌ వరకు కొనసాగే అమరజ్యోతి ర్యాలీని ప్రారంభించారు. మాజీ ఎమ్మెల్యే, ఎన్టీఆర్‌ అభిమాన సంఘం వ్యవస్థాపకుడు శ్రీపతి రాజేశ్వర్‌ ప్రారంభించిన అమరజ్యోతి ర్యాలీని ఆయన తనయుడు శ్రీపతి సతీష్, కుటుంబసభ్యులు 21 ఏళ్లుగా నిర్వహించడం అభినందనీయమన్నారు. కార్యక్రమంలో టీడీపీ నేతలు బీఎన్‌రెడ్డి, దీపక్‌రెడ్డి, సనత్‌నగర్‌ నియోజకవర్గ ఇన్‌ఛార్జి కూన వెంకటేష్‌గౌడ్, ఎన్టీఆర్‌ అభిమాన సంఘం అధ్యక్షుడు శ్రీపతి సతీష్,  గంగాధర్‌గౌడ్, కానూరి జయశ్రీ, బాస కృపానందం తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు