కోట్లు వస్తాయని నమ్మి..

12 Dec, 2016 14:27 IST|Sakshi

బంజారాహిల్స్‌: రైస్‌పుల్లింగ్‌ యంత్రంతో రూ.10 వేల కోట్లు వస్తాయని నమ్మి మోసపోయానని, ఈ క్రమంలో తాను ఆదాయ పన్ను శాఖను మోసం చేశానని బానాపురం లక్ష్మణ్‌రావు వెల్లడించారు. శనివారం ఆయన ఈ ఘటనపై ’సాక్షి’తో మాట్లాడారు. మూడేళ్ల క్రితం కర్నాటక బెల్గాంకు చెందిన షౌకత్‌అలీ అనే వ్యక్తి తన రియల్‌ ఎస్టేట్‌ భాగస్వాములు భాస్కర్‌రావు, రమేష్‌ల ద్వారా పరిచయం అయ్యాడని, తనకు తెలిసిన వ్యక్తి వద్ద రైస్‌పుల్లింగ్‌ కాయిన్ ఉందని, దాని వల్ల ధనలక్ష్మి తాండవిస్తుందని చెప్పడమే కాకుండా పలు పూజలు కూడా చేయించాడని వెల్లడించారు.

ఆయనను నమ్మి తాను రూ.10 వేల కోట్ల వస్తాయని ఆశతో ఆదాయపు పన్ను శాఖాధికారులకు సెప్టెంబర్‌లో లేఖ రాసినట్లు వెల్లడించారు. తన వద్ద 10 వేల కోట్లు ఉన్నాయని ఐడీఎస్‌ కింద దరఖాస్తు చేసుకున్నానని పేర్కొన్నారు. ఈ విషయంలో మొదటి విడత కట్టేం దుకు ప్రయత్నించగా చిల్లిగవ్వ కూడా దొరకలేదని ఈ లోపు న ఐటీ అధికారులు ఇంటిపై దాడి చేశారని, వారికి ఇదే విషయాన్ని వెల్లడించడం జరిగిందన్నారు.

తాను షౌకత్‌అలీని నమ్మి మోసపోయిన విషయాన్ని ఆధారాలతో సహా చూపి ంచానని పేర్కొన్నారు. మూడేళ్ల క్రితం నుంచి షౌకత్‌అలీ రైస్‌పుల్లింగ్‌ యంత్రం తెస్తానంటూ రూ. 60 లక్షల వరకు వసూ లు చేశాడని, ఉన్నవన్నీ అమ్ముకొని అప్పు తెచ్చి ఈ మొత్తాన్ని ఇచ్చానని పేర్కొన్నాడు. షౌకత్‌అలీ తనను చీటింగ్‌ చేసిన విషయాన్ని ఐటీ అధికారులతో పాటు పోలీసులకు కూడా ఫిర్యాదు చేశానని, తనకు న్యాయం చేయాలని కోరారు.

కట్టు కథేనా.?
10 వేల కోట్ల ఐడీఎస్‌ కింద ప్రకటించి ఐటీ అధికారులకు చుక్కలు చూపించిన ఫిలింనగర్‌ సైట్‌–2 నివాసి బానాపురం లక్ష్మణ్‌రావు చెప్పిందంతా కట్టు కథేనని పోలీసులు భావిస్తున్నారు. పక్కా పథకం ప్రకారం ఎవరో రాసిచ్చిన స్క్రిప్టును ఉన్నది ఉన్నట్టు ఐటీ అధికారులకు చదివి వినిపించాడని అనుమానిస్తున్నారు.

లక్ష్మణ్‌రావు వెనుకాల ఓ బడాబాబు ఉండి ఉంటాడని పోలీసులు పేర్కొంటున్నారు. ఈ విషయంపై సమగ్ర విచారణ చేపడితే బాగుంటుందని భావిస్తున్నారు. లక్ష్మణ్‌రావు అంత ధైర్యంగా ఐడీఎస్‌ ప్రకటించడని ముందస్తుగా ఎవరో నల్లధనం ఉందన్న విషయం చెప్పడం వల్లనే ఐటీకి లేఖ రాశారని సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి.  

 

మరిన్ని వార్తలు