అనంతపురం న్యూటౌన్ : అధికారం రాగానే ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణకు కృషి చేసి పెద్దమాదిగనవుతానని చెప్పిన చంద్రబాబు ఎన్నికల తర్వాత మాదిగలను విస్మరించడం దారుణమని ఎంఈఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బండారు శంకర్ విమర్శించారు. ఆదివారం నగరంలోని లిటిల్ ఫ్లవర్ పాఠశాలలో ఎంఈఎఫ్ (మాదిగ ఉద్యోగుల సమాఖ్య) కార్యకర్తల సమావేశం జరిగింది. ఎంఈఎఫ్ నాయకులు డాక్టర్ నరసింహులు అధ్యక్షతన జరిగిన సమావేశంలో బండారు శంకర్ మాట్లాడుతూ ప్రభుత్వాల మెడలు వంచి వర్గీకరణ సాధించుకుందామని, ఉద్యమానికి అందరూ సిద్ధం కావాలని పిలుపునిచ్చారు.
అందులో భాగంగానే ఈ నెల 25 నుంచి అక్టోబరు 23 వరకు జిల్లాలోని అన్ని మండల కేంద్రాలలో సమాయత్త సదస్సులు నిర్వహిస్తున్నట్టు తెలిపారు. నవంబరు 20న హైదరాబాదులో మందకృష్ణమాదిగ ఆధ్వర్యంలో జరుగనున్న మాదిగల ధర్మయుద్ధ మహాసభకు మాదిగలందరూ కుటుంబ సమేతంగా తరలి రావాలని పిలుపునిచ్చారు. రాజకీయ పార్టీలన్నీ వర్గీకరణకు అనుకూలంగా తీర్మానం చేయాలని డిమాండు చేశారు. కార్యక్రమంలో ఎంఈఎఫ్ జాతీయ కార్యవర్గ సభ్యులు అమర్నాథ్, జిల్లా వర్కింగ్ ప్రెసిడెంటు గోవిందు, జిల్లా ప్రధాన కార్యదర్శి వెంకటేశులు, సాకే నరసింహులు తదితరులు పాల్గొన్నారు.