బ్యాటరీ సైకిల్‌పై సవారీ

22 Jul, 2017 23:33 IST|Sakshi
బ్యాటరీ సైకిల్‌పై సవారీ
35 కిలోమీటర్ల వేగంతో ప్రయాణం
ఆకట్టుకుంటున్న ఈ-పేంథర్‌, ఈ-డ్రాగన్‌ సైకిళ్లు
రూపొందించిన గైట్‌ విద్యార్థులు 
రాజానగరం : ఆలోచనలకు పదును పెడితే అనేక అద్భుతాలను ఆవిష్కరించవచ్చని నిరూపిస్తున్నారు స్థానిక గైట్‌ కళాశాలకు చెందిన బీటెక్‌ విద్యార్థులు. ఆటోమొబైల్‌ ఇంజినీరింగ్‌ చేస్తున్న థర్డియర్, ఫైనల్‌ ఇయర్‌కు చెందిన ఏడుగురు విద్యార్థులు బ్యాటరీతో నడిచే సైకిళ్లను రూపొందించారు. ఈ సైకిళ్లకు ‘ఈ–పేంథర్, ఈ–డ్రాగాన్‌’ అని నామకరణం చేశారు. వీటికి సంబంధించిన వివరాలను హెచ్‌ఓడీ సుబ్రహ్మణ్యం శనివారం స్థానిక విలేకరులకు తెలిపారు. 
ఈ–పేంథర్‌
ఆటోమెబైల్‌ ఇంజినీరింగ్‌ చదువుతున్న బీటెక్‌ థర్డియర్‌ విద్యార్థులు హర్షవర్థన్‌రెడ్డి, కుమార్‌ వెంకటేష్, చంద్రశేఖర్‌ తాతాజీ పాత సైకిళ్లను తీసుకుని మెరుగులు దిద్దారు. బ్యాటరీ, మోటారును అమర్చిన సైకిల్‌కు ‘ఈ–పేంథర్‌’ అని పేరుపెట్టారు. దీని తయారీకి రూ.17 వేలు ఖర్చయింది.
ఈ–డ్రాగాన్‌ 
బీటెక్‌ ఫైనలియర్‌కు చెందిన రాఘవ, మంజూష, మోహన్, సందీప్‌లు ఇదే తరహాలో బ్యాటరీతో నడిచే సైకిళ్లను రూపొందించారు. ‘ఈ–డ్రాగాన్‌’ పేరు పెట్టిన వీటి తయారీకి రూ.16 వేల వరకు ఖర్చు చేశారు. ప్రొఫెసర్‌ సందీ రాజశేఖర్‌ పర్యవేక్షణలో వీటిని తయారు చేశారు. 
బాలల నుంచి వృద్ధుల వరకూ ఈ వాహనాలను నడిపే వీలుంది. 35 కి.మీ. వేగంతో నడిచే ఈ వాహనాలకు ఉపయోగించే బ్యాటరీకి ఒకసారి చార్జింగ్‌ పెడితే 30 కి.మీ. వరకూ నడుస్తుంది. ఈ సైకిళ్లకు ఒక్కోదానికి 250 వాట్స్‌ మోటారు, కంప్యూటర్‌ యూపీఎస్‌లో వాడే బ్యాటరీలు నాలుగు (ఒక్కొక్కటి 12 వాట్స్‌) ఉపయోగించారు. ప్రాజెక్టు వర్కులో భాగంగా వీటిని తయారు చేశారని హెచ్‌ఓడీ తెలిపారు. 
మరిన్ని వార్తలు