అప్రమత్తంగా ఉండాలి

27 Sep, 2016 00:40 IST|Sakshi
సమీక్షలో మాట్లాడుతున్న డిప్యూటీ సీఎం
  • ప్రజలకు ఏ అవసరం వచ్చినా ఆదుకోవాలి
  • గోదావరి ఉధృతి మరింత పెరగనుంది
  • ముంపు ప్రాంతాల ప్రజలను పునరావాసాలకు తరలించాలి
  • నిత్యావసర వస్తువులు, మందులు అందుబాటులో ఉంచాలి
  • ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి ఆదేశం
  • ఏటూరునాగారంలో అధికారులతో సమీక్ష 
  • ఏటూరునాగారం : ఏజెన్సీలోని తాడ్వాయి, మంగపేట, ఏటూరునాగారం మండల్లోని ప్రజలకు ఏ అవసరం వచ్చినా వెంటనే అందించే విధంగా ఉండాలని, అన్ని శాఖల అధికారులు మండల కేంద్రాల్లో ఉండాలని డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి ఆదేశించారు. గోదావరి వరద పరిస్థితిపై సోమవారం ఐటీడీఏ కార్యాలయంలో అన్నిశాఖల అధికారులతో ఉప ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు. వర్షాలు ఎక్కువగా ఉన్నాయని, గోదావరి ఉధృతి మరింత పెరిగే అవకాశం ఉన్నందున లోతట్టు గ్రామాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలన్నారు.
     
    ఏజెన్సీలోని మూడు మండలాల్లో నిత్యావసర సరుకులు అక్టోబర్, నవంబర్, డిసెంబర్‌ నెలలకు సరిపడా నిల్వలు గ్రామాల్లో ఉంచాలని ఆర్డీఓ మహేందర్‌జీని ఆదేశించారు. వైద్య ఆరోగ్యశాఖ సేవలను విస్తృతం చేసి ప్రజలకు అనునిత్యం సేవలు అందించాలని డీఎంహెచ్‌ఓ సాంబశివరావును ఆదేశించారు.  104, 108 వాహనాలను మండలానికి గ్రామాలకు మధ్యలోని ప్రాథమిక కేంద్రాలకు అందుబాటులో ఉంచితే రోగులకు తిప్పలు ఉండవన్నారు. ఐటీడీఏ పరిధిలోని 17 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో వైద్యులు సరిపడా ఉండాలన్నారు. జిల్లా వ్యాప్తంగా 28 వేల కుటుంబాలకు పరీక్షలు చేసి ఉచితంగా మందులు అందజేశామని, దీంతో రోగాల తీవ్రత తగ్గిందని కలెక్టర్‌ కరుణ ఉప ముఖ్యమంత్రికి వివరించారు.  
     
    11 మీటర్లకు వస్తే ముంపు ప్రాంతాలను గుర్తించాలి 
    గోదావరి నది 11 మీటర్ల స్థాయికి వస్తే నీటితో మునిగే ప్రాంతాలను గుర్తించాలని ఇరిగేష¯ŒS ఎస్‌ఈ శ్రీనివాస్‌రెడ్డిని ఉప ముఖ్యమంత్రి ఆదేశించారు. అలాంటి కుటుంబాలను గుర్తించి డబుల్‌ బెడ్‌ రూం ఇళ్లను మంజూరయ్యే విధంగా చూస్తామన్నారు. ముందుగా కుటుంబాల వివరాల తర్వాత ప్రభుత్వ స్థలాల ఎంపిక అనంతరం ఇళ్ల నిర్మాణాలను చేపట్టాల్సి ఉంటుందన్నారు. ప్రస్తుతం లోతట్టు గ్రామాల ప్రజలకు కావాల్సిన ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. ఏటూరునాగారం మండలంలో 93 కుటుంబాలకు చెందిన 210 మందిని పునరావాస కేంద్రాలకు తరలించామని, నీరు, భోజనం, వసతి సౌకర్యం కల్పించామని, మంగపేట పొదుమూరులో 12 కుటుంబాలకు చెందిన 48 మంది ప్రజలను జెడ్పీహెచ్‌ఎస్‌కు తరలించినట్లు ఆర్డీఓ ఉప ముఖ్యమంత్రికి వివరించారు.
     
    రామన్నగూడెం, రాంనగర్‌ గ్రామాల మధ్యలోని లోలెవల్‌కాజ్‌వే పై నుంచి గోదావరి ప్రవహించడంతో రాంనగర్, లంబాడీతండా గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయని ఆర్డీఓ వెల్లడించారు. ప్రజలకు నిత్యావసర సరుకులు, కావాల్సిన వైద్య సదుపాయాలను ఏర్పాటు చేసినట్లు ఐటీడీఏ పీఓ అమయ్‌కుమార్‌ తెలిపారు. పోలీసులు, ఎ¯ŒSడీఆర్‌ఎఫ్‌ సిబ్బంది కూడా ఇక్కడే ఉంటారని, ప్రజలు భయపడాల్సిన అవసరం లేదని శ్రీహరి అన్నారు.  ముఖ్యంగా రోడ్లను మరమ్మతు చేయాలని, ఆర్‌అండ్‌బీ ఎస్‌ఈ నర్సింహకు ఉప ముఖ్యమంత్రి ఆదేశించారు. ఏటూరునాగారం నుంచి తుపాకులగూడెం వెళ్లే ప్రధాన రోడ్డు బురదమయంగా మారిందని, ఇసుక లారీలను నిలిపివేశామని, 15 గ్రామాల ప్రజలు అవస్థలు పడుతున్నారని  ఇందు కోసం రోడ్డు మరమ్మతులు చేసి రవాణా సౌకర్యం కల్పించాలని కలెక్టర్‌ ఎస్‌ఈని ఆదేశించారు. రోడ్డు పనులు వేగంగా చేసి ప్రజలు ఇబ్బందులు పడకుండా చూడాలని ఉప ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. 
     
    పుర ప్రముఖుల సలహాలను పాటిస్తాం 
    గ్రామ పెద్దల ఇచ్చే సూచనలు, సలహాలను పాటిస్తామని కడియం శ్రీహరి అన్నారు. మంగపేట, ఏటూరునాగారం మండలాలకు చెందిన గ్రామ పెద్ద మనుషులను సమీక్షకు పిలిపించారు. గోదావరి చుట్టూ నిర్మించిన కరకట్టకు అమర్చిన గేట్ల ద్వారా వరద నీరు గ్రామాల్లో రావడం వల్ల పంటలు, ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని  చక్రధర్‌రావు, నూతి కృష్ణ, ఇర్సవడ్ల వెంకన్న, చిటమట రఘు ఉప ముఖ్యమంత్రికి వివరించారు. కరకట్టకు ఉన్న గేట్లు ఎందుకు సరిగ్గా బిగించలేదని ఎస్‌ఈ శ్రీనివాసరెడ్డి ఉప ముఖ్యమంత్రి ప్రశ్నించారు. బీడింగ్‌ సరిగ్గా లేదని ఎస్‌ఈ చెప్పగా వెంటనే చేయించాలని ఆదేశించారు.
     
    అలాగే మండల కేంద్రంలో సుమారు 200ల కుటుంబాలు వరద వల్ల ముంపు గురవుతున్నాయని జెడ్పీటీసీ వలియాబీ అన్నారు. వారికి సురక్షిత ప్రాంతాలకు తరలించే ఏర్పాట్లు చేయాలని పీఓను డిప్యూటీ సీఎం ఆదేశించారు. గ్రామంలో సహాయక చర్యలు చేపట్టినందుకు కాంగ్రెస్‌ పార్టీ ఇర్సవడ్ల వెంకన్నను కలెక్టర్‌ అభినందించారు. మంగపేట మండలం అకినేపల్లి మల్లారంలో బ్యాక్‌వాటర్‌ వల్ల ప్రమాదం ఉందని, మంగపేట పుష్కరఘాట్‌ కోతకు గురికావడం వల్ల 60 ఎకరాలు నీట మునిగి నష్టపోయాయని శ్రీధర్‌  వివరించారు. ఒడ్డు కోతకు గురికాకుండా నాపరాయి, ఇసుక బస్తాలు, కాంక్రీట్‌తో రక్షణ చర్యలు చేపట్టాలని పీఓ, ఆర్డీఓలను డిప్యూటీ సీఎం ఆదేశించారు. అలాగే ఐలాపురం గ్రామానికి రోడ్డు సౌకర్యం లేక చాలా ఇబ్బందులు పడుతున్నామని టీఆర్‌ఎస్‌ నాయకుడు చంద్రం శ్రీహరికి విన్నవించారు. రోడ్డు నిర్మాణం జరిగే విధంగా చూస్తామన్నారు. 
     
     హెల్ప్‌లై¯ŒS సెల్‌ ఏర్పాటు 
    ఐటీడీఏ కార్యాలయంలో వరద బాధితుల కోసం ప్రత్యేక హెల్ప్‌లై¯ŒS సెల్‌ ఏర్పాటు చేసినట్లు ఐటీడీఏ పీఓ అమయ్‌కుమార్‌ తెలిపారు. ఎవరికైనా ఏ అవసరం వచ్చినా, ఆపదలో ఉన్నా 08717–231246, సెల్‌ 94909 57006కు కాల్‌ చేయాలన్నారు. సమీక్షలో ఎస్పీ అంబర్‌కిషోర్‌ఝా, ఓఎస్డీ శ్వేతారెడ్డి, ఏఎస్పీ విశ్వజిత్‌కాంపాటి, ఏపీఓ వసంతరావు, ఈఈ కోటిరెడ్డి, ఎంపీపీ మెహరున్నీసా, తహశీల్దార్‌ నరేందర్, ఎంపీడీ ప్రవీణ్‌ పాల్గొన్నారు. 
     
మరిన్ని వార్తలు