28లోగా బీఎఫ్‌డీ నమోదు పూర్తిచేయాలి

21 Jul, 2016 23:01 IST|Sakshi
రేషన్‌ డీలర్లకు డీఎస్‌వో ఉమామహేశ్వరరావు ఆదేశం
రెండు మండలాల డీలర్లతో సమావేశం
రావులపాలెం : జిల్లాలోని అన్ని రేషన్‌ దుకాణాల్లో ఈ నెల 28 నాటికి రేషన్‌ కార్డుదారుల కుటుంబ సభ్యులందరినీ త్వరగా గుర్తించే వేలిముద్ర నమోదు (బీఎఫ్‌డీ) పూర్తిచేయాలని జిల్లా పౌరసరాల అధికారి జి.ఉమామహేశ్వరరావు డీలర్లను ఆదేశించారు.  రావులపాలెంలో  గురు వారం ఆయన రావులపాలెం, ఆత్రేయపురం మండలాల డీలర్లతో సమావేశం నిర్వహిం చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బుధవారం నుంచి వేలిముద్రల సేకరణ ప్రారంభమైందన్నారు. కార్డులోని అందరి కుటుంబ సభ్యుల పది వేళ్ల ముద్రలను తీసుకున్నాక, వాటిలో త్వరగా ఈపోస్‌ యంత్రాలు గుర్తించే వేలిని ఎంపిక చేస్తామన్నారు. తద్వారా వేగంగా రేషన్‌ సరఫరా చేసేందుకు అవకాశం ఉంటుందన్నారు. కార్డుదారులు ఈనెల 28 లోగా ఆధార్‌ కార్డులతో సమీపంలోని ఏ రేషన్‌ దుకాణానికైనా వెళ్ళి వేలిముద్రలు నమోదు చేసుకోవాలన్నారు. జిల్లాలోని 2,444 దుకాణాల ద్వారా ప్రస్తుతం 14,30,000 మందికి రేషన్‌ పంపిణీ చేస్తున్నామన్నారు. కొద్ది నెలలుగా రేషన్‌ తీసుకోని వారి వివరాలను అగస్టు ఒకటి నుంచి ఆయా రేషన్‌ దుకాణాల వద్ద ప్రదర్శిస్తామన్నారు. వచ్చే నెల ఒకటో తేదీ నుంచి ఏడో తేదీ లోపు కార్డుదారులు రేషన్‌ తీసుకోవాలన్నారు. కదలలేని స్థితిలో ఉన్నవారికి మాత్రం మీ ఇంటికి మీ రేషన్‌  ద్వారా  ఇంటివద్ద రేషన్‌ పంపిణీ చేస్తామన్నారు. సమావేశంలో అమలాపురం ఏఎస్‌ఓ పి. నిత్యానందం, ఎంఎస్‌ఓ టి.సుభాష్‌ తదితరులు పాల్గొన్నారు. అనంతరం రావులపాలెంలోని కొన్ని రేషన్‌ దుకాణాల వద్ద వేలిముద్ర నమోదును ఆయన పరిశీలించారు. 
 
 
మరిన్ని వార్తలు