విద్యుత్ వివాదం మళ్లీ మొదటికి

27 Oct, 2015 05:11 IST|Sakshi

 గైర్హాజరైన తెలంగాణ అధికారులు
 
 సాక్షి, హైదరాబాద్: రెండు తెలుగు రాష్ట్రాల మధ్య కొనసాగుతున్న విద్యుత్ వివాదానికి పీటముడి పడింది. కేంద్ర విద్యుత్ ప్రాధికార సంస్థ(సీఈఏ) సోమవారం ఢిల్లీలో ఇరు రాష్ట్రా ల ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించింది. అయితే ఈ భేటీకి తెలంగాణ అధికారులు గైర్హాజరయ్యారు. ఆ రాష్ట్ర ఇంధన కార్యదర్శి అరవిందకుమార్ రాలేకపోయారు. దీంతో ఏపీ ట్రాన్స్‌కో సీఎండీ విజయానంద్ తమ వాదనను సీఈఏ ముందుంచారు. రాష్ట్ర విభజన చట్టంలో తెలంగాణకు 53.89శాతం, ఏపీకి 46.11శాతం విద్యుత్ వాటాలు కేటాయించారు.

ఉమ్మడి రాష్ట్రంలోని ఏపీ విద్యుత్ నియంత్రణ మండలి నిర్మాణంలో ఉన్న విద్యుత్ ప్రాజెక్టులు మినహా మిగతా వాటి విద్యుత్ కొనుగోలు ఒప్పందాలకు ఆమోదం తెలిపింది. దీంతో అటు తెలంగాణలో, ఇట ఏపీలో కొత్త ప్రాజెక్టుల విద్యుత్ వాటాలపై వివాదం తలెత్తింది. ఏపీలోని కృష్ణపట్నం, హిందూజా ప్రాజెక్టుల పీపీఏలు అంగీకరించలేదు. కాబట్టి ఇందులో తెలంగాణకు ఎలాంటి హక్కు లేదని ఏపీ పట్టుబట్టిం ది. వివాదం పరిష్కారం కోసం కేంద్రం ఏర్పా టు చేసిన కమిటీ ఎలాంటి నిర్ణయం ఇవ్వకుండానే కాల పరిమితి ముగిసింది. ఈ క్రమంలో సీఈఏ నేరుగా రెండు రాష్ట్రాల అధికారులతో సమాలోచనలు జరపాలని నిర్ణయించింది.

తాజా భేటీలో ఏపీ ట్రాన్స్‌కో సీఎండీ కృష్ణపట్నం విద్యుత్ అవసరం లేదని  తెలంగాణ లోడ్ డిస్పాచ్ సెంటర్‌కు లేఖ రాసిందన్నారు. కనుక దీన్ని తమకే కేటాయించాలన్నారు. అలాగే హిందూజా కూడా ఏపీకే చెందాలన్నారు. తెలంగాణలో 600 మెగావాట్లతో నిర్మిస్తున్న కాకతీయ థర్మల్ పవర్‌స్టేషన్ రెండో దశలో ఏపీకి 46.11 శాతం వాటా రావాలన్నారు. 120 మెగావాట్ల పులిచింత విద్యుత్ కేంద్రంలో ఇదే నిష్పత్తిలో వాటా కోరారు. ఆదిలాబాద్ జిల్లాల్లో నిర్మిస్తున్న సింగరేణి ప్రాజెక్టులోనూ 484 మెగావాట్లు ఏపీకి హక్కు ఉందని స్పష్టం చేశారు. ఏపీలో కొత్తగా రాయసీమ థర్మల్ స్టేషన్ నాలుగో దశ, నాగార్జునసాగర్ టెయిల్ పాండ్ ఆంధ్రప్రదేశ్‌కే ఇవ్వాలన్నారు.  తమ వాదనపై తెలంగాణ అభిప్రాయాలు తెలుసుకుని, నిర్ణయాన్ని ప్రకటిస్తామని సీఈఏ ఛైర్మన్ చెప్పినట్టు విజయానంద్ తెలిపారు.

మరిన్ని వార్తలు