సమయానుకూలంగా మెలకువలు పాటించాలి
మోతాదుకు మించి ఎరువులు వాడకూడదు
వ్యవసాయ అధికారుల సలహా, సూచనలు తప్పనిసరి
టేక్మాల్ ఏఈఓ సునిల్కుమార్
టేక్మాల్: సస్యరక్షణ చర్యలను పాటిస్తూ కంది సాగులో అధిక దిగుబడులు సాధించవచ్చు. పంటను చీడపీడలు ఆశించినా, తెగుళ్లు సోకినా.. దిగులు చెందాల్సిన పనిలేదు. సమయానుకూలంగా మెలుకువలు పాటిస్తే సత్ఫలితాలు వస్తాయి. వ్యవసాయాధికారుల సలహా సూచనలు పాటిస్తూ, సస్యరక్షణ చర్యలు పాటిస్తూ, తగిన మోతాదులో ఎరువులను వాడితే రైతులు మెరుగైన ఫలితాలను కళ్ల చూస్తారని టేక్మాల్ ఏఎఈఓ సునిల్కుమార్ (99499 68674) తెలిపారు. కంది పంట సాగు, సస్యరక్షణ చర్యలపై ఆయన అందించిన సలహాలు, సూచనలు..
పురుగులు:
ఆకుచుట్టు పురుగు: కంది పెరిగే దశలో ఆకు చుట్టూ పురుగు ఆశిస్తుంది. ఆకులను, పూతను చుట్టగా చుట్టుకొని లోపల ఉండి గీరి తింటుంది. దీని నివారణకు 1.6 మిల్లీలీటర్ల మోనోక్రోటోఫాస్ లేదా 2.0 మి.లీ. క్వినాల్ఫాస్ లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి.
కాయ తొలుచు పురుగు: ఈ పురుగు పూత, పిందె దశలో కాయలకు రంధ్రాలు చేసి గింజలను తింటూ, ఒక కాయ నుండి మరో కాయకు ఆశిస్తుంది. దీని నివారణకు సమగ్ర సస్యరక్షణ తప్పక పాటించాలి.
మరుకా మచ్చల పురుగు: దీని నివారణకు క్లోరిపూరిఫాస్ 2.5 మి.లీ లేదా నోవోల్యురాన్ 0.75 మి.లీ లేదా స్పైనోసాడ్ 0.75 మి,లీ లేదా సైహలోత్రిన్ 1 మి.లీ లీటను నీటికి కలిపి మందును మార్చి వారానికోసారి పిచికారి చేయాలి.
సమగ్ర సస్యరక్షణ:
తెగుళ్లు:
ఎండుతెగులు: ఈ తెగులు సోకిన మొక్కలు పూర్తిగా కాని మొక్కలో కొంతభాగం కాని వాడి ఎండిపోతాయి. ఎండిన మొక్కలను పీకి కాండం మొదలు భాగం చీల్చి పరిశీలిస్తే గోధుమ వర్ణపు నిలువు చారలు కనిపిస్తాయి. నివారణకు ఈ తెగులు అధికంగా కనిపించిన పొలాల్లో పొగాకు లేక జొన్నతో పంట మార్పిడి చేయాలి. ఐ.సి.పి.యల్ 87119 మరియు ఐ.సి,పి.యల్ 8863 అనే కంది రకాలు ఈ తెగులును తట్టుకుంటాయి.ఈ తెగులు నివారణకు ఎలాంటి మందులు లేవు. నీరు నిల్వ వుండే భూముల్లో కందిని సాగు చేయాకూడదు.
వెర్రితెగులు(స్టెరిలిటి మొజాయిక్): ఇది వైరస్ తెగులు. తెగులు సోకిన మొక్క లేత ఆకుపచ్చ రంగు గల చిన్న ఆకులను విపరీతంగా తొలుస్తుంది. పూత పూయదు. ఈ తెగులు నల్లి (మైట్స్) ద్వారా వ్యాపిస్తుంది. నల్లి నివారణకు లీటరు నీటికి 3 గ్రాముల నీటిలో కరిగే గంధకపు పొడి లేక 4 మి.లీ, కెల్థేన్ కలిపి వారానికొకసారి రెండు దఫాలుగా పిచికిరి చేయాలి. ఈ తెగులును తట్టుకోగల ఐ.సి.పి.యల్ 87119, 227 రకాలను సాగుచేయాలి.
మాక్రోఫొమినా ఎండు తెగులు: ముదురు మొక్కల కాండంపైన నూలు కండె ఆకారం కలిగిన ముదురు గోధుమ వర్ణపు మచ్చలు కన్పిస్తాయి. ఈ మచ్చలు చుట్టూ గోధుమ వర్ణంలోనూ మధ్య భాగం తెలుపు వర్ణంలోనూ వుంటాయి. తెగులు సోకిన మొక్కలు ఎండిపోతాయి. ఒక్కొక్కప్పుడు కొన్ని కొమ్మలు మాత్రమే ఎండి పోతాయి. యం.ఆర్.జి 66 కంది రకం ఈ తెగులును తట్టుకొంటుంది. కందిని ఎక్కువ కాలం ఒకే పొలంలో వేయరాదు.