పశువైద్యం.. మరింత చేరువ

10 Sep, 2016 23:48 IST|Sakshi
పశువైద్యం.. మరింత చేరువ
– జిల్లా పశు సంవర్ధకశాఖ పునర్‌వ్యవస్థీకరణ
– 30 వైద్యశాలలకు వెటర్నరీ అసిస్టెంట్‌ సర్జన్‌లు
– పదకొండింటి స్థాయి పెంపు
– జేడీ కార్యాలయానికి 5 పోస్టులు
 
కర్నూలు(అగ్రికల్చర్‌): జిల్లా పశుసంవర్ధక శాఖ పునర్‌ వ్యవస్థీకరణకు ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంతో పశువులకు మరింత మెరుగైన వైద్య సేవలు అందే అవకాశం ఏర్పడింది. పలు గ్రామీణ పశువైద్యశాలలు, పశువైద్యశాలలను అప్‌గ్రేడ్‌ చేయడంతో పాటు కొత్తగా ఏడీ, డీడీ పోస్టులు మంజూరయ్యాయి. 
అప్‌గ్రేడ్‌ అయిన గ్రామీణ పశువైద్యశాలలు..
జిల్లాలోని 30 గ్రామీణ పశువైద్యశాలలను అఫ్‌గ్రేడ్‌ చేశారు. ఇప్పటి వరకు కాంపౌండర్‌ స్థాయి ఉద్యోగులతో నడిచే వీటికి ఇకపై వెటర్నరీ అసిస్టెంటు సర్జన్‌లను నియమిస్తారు. అల్లూరు(నందికొట్కూరు), అల్లూరు(ఉయ్యాలవాడ), విరుపాపుర ం, బైచిగేరి, మాధవరం, ఉరుకుంద, ముక్కెళ్ల, కటారుకొండ, డబ్ల్యూ కొత్తపల్లి, ఆలమూరు, యాగంటిపల్లి, నొస్సం, కొచ్చెరువు, ముద్దవరం, ఉల్చాల, నిడ్జూరు, పోలకల్, పెద్దకొట్టాల, నెహ్రూనగర్‌(గోస్పాడు), ఉల్లిందకొండ, గడిగరేవుల, వెంకటాపురం, మోత్కూరు, కైరుప్పల, గూళ్యం, కొటేకల్, ముగితి, కర్నూలు బుధవారపేట, మిట్టకందాల, ప్రాతకోట(వెస్ట్‌) పశువైద్యశాలలు ఈ జాబితాలో ఉన్నాయి. ఇప్పటి వరకు పశువైద్యశాలలు (వెటర్నరీ డిస్పెన్షరీలు) జిల్లాలో 121 ఉండగా వీటితో కలిపి ఈ సంఖ్య 151కి చేరనుంది. జిల్లాకు మొత్తం 33 వెటర్నరీ అసిస్టెంట్‌ సర్జన్‌ పోస్టులు మంజూరయ్యాయి. వీటిని కొత్తవారితో భర్తీ చేస్తారు.
 
11 పశువైద్యశాలల స్థాయి పెంపు
జిల్లాలోని 11 పశువైద్యశాలలను వెటర్నరీ హాస్పిటల్‌గా పదోన్నతి కల్పించారు. ఇకపై వీటిల్లో వెటర్నరీ అసిస్టెంటు సర్జన్‌లకు బదులు అసిస్టెంట్‌ డైరెక్టర్‌ స్థాయి అధికారిని నియమిస్తారు. వెటర్నరీ అసిస్టెంట్‌ సర్జన్‌లకు పదోన్నతి కల్పించడం ద్వారా ఈ పోస్టులను భర్తీ చేస్తారు. పెద్దకడుబూరు, బేతంచెర్ల, కొసిగి, ఆస్పరి, కల్లూరు, జూపాడుబంగ్లా, పాణ్యం, వెలుగోడు, గూడూరు, రుద్రవరం, సంజామల పశువైద్యశాలలు ఈ జాబితాలో ఉన్నాయి. ఇప్పటి వరకు ఇలాంటివి జిల్లాలో 15 ఉండగా ఇకపై 26కు చేరతాయి. 
 
 5 డీడీ పోస్టులు మంజూరు
జిల్లాకు కొత్తగా 5 ఉప సంచాలకుల (డీడీ)పోస్టులు మంజూరయ్యాయి. ఇప్పటి వరకు కర్నూలు, నంద్యాల, ఆదోని, ఆళ్లగడ్డ(నాలుగు) డివిజన్‌లుండగా అసిస్టెంటు డైరెక్టర్‌ స్థాయి అధికారులు నేతత్వం వహిస్తున్నారు. ఈ పోస్టులను కూడా అఫ్‌గ్రేడ్‌ చేశారు. జిల్లా పశుగణాభివద్ధి సంస్థకు ఇప్పటి వరకు ఏడీ స్థాయి అధికారి పనిచేస్తున్నారు. దీనిని డీడీ పోస్టుగా మార్పు చేశారు. పశుగణాభివద్ది సంస్థకు అదనంగా ఒక వెటర్నరీ అసిస్టెంటు సర్జన్‌ పోస్టు మంజారైంది. ఇక నుంచి డివిజనల్‌ స్థాయిలోనూ పశుగణాభివద్ధి సంస్థకు  డీడీలు పనిచే స్తారు. ఏడీలకు పదోన్నతి కల్పించడం ద్వారా వీటిని భర్తీ చేస్తారు. 
 
జేడీ కార్యాలయానికి కొత్తపోస్టులు
పశుసంవర్ధశాఖ జాయింట్‌ డైరెక్టర్‌ కార్యాలయానికి మూడు ఏడీ పోస్టులు, రెండు వెటర్నరీ అసిస్టెంటు సర్జన్‌ పోస్టులు మంజారయ్యాయి. ఇప్పటి వరకు జేడీ కార్యాలయానికి ఎలాంటి పోస్టులు లేకపోవడంతో డిప్యూటేషన్‌పై తెచ్చుకొని పనిచేయించుకుంటున్నారు. పాలు, మాంసం, గుడ్ల ఉత్పత్తి పెంపు లక్ష్యంగా 3 అసిస్టెంట్‌ డైరెక్టర్‌ పోస్టులు. 2 వెటర్నరీ అసిస్టెంట్‌ సర్జన్‌ పోస్టులు మంజారైనట్లు జేడీ డాక్టర్‌ సుదర్శన్‌కుమార్‌ తెలిపారు. 
 
మరిన్ని వార్తలు