భీమవరం ఇ–బైక్స్‌ అద్వితీయం

26 Sep, 2016 23:36 IST|Sakshi
భీమవరం: భీమవరం శ్రీ విష్ణు ఇంజినీరింగ్‌ మహిళా కళాశాలలో నాలుగు రోజులగా నిర్వహించిన విష్ణు ఇ–మోటో చాంపియన్‌షిప్‌–2016 ఇ–బైక్‌ రేసింగ్‌  పోటీలు సోమవారం ముగిశాయి. కర్నాటకుకు చెందిన శ్రీసాయిరాం ఇంజినీరింగ్‌ కళాశాల విద్యార్థులు ఓవరాల్‌ చాంపియన్‌షిప్‌గా నిలిచి రూ.80 వేల నగదు బహుమతి గెలుచుకున్నారు. ఓవరాల్‌ చాంపియన్‌షిప్‌ రన్నరప్‌గా భీమవరం విష్ణు ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ విద్యార్థులు నిలిచి రూ.40 వేల నగదు బహుమతిని గెలుచుకున్నారు. ఎండ్యూరెన్స్‌ విభాగం విజేతగా కర్నాటకకు చెందిన శ్రీసాయిరాం ఇంజినీరింగ్‌ కళాశాల విద్యార్థులు నిలిచి రూ.10 వేలు, రన్నరప్‌గా భీమవరం శ్రీవిష్ణు మహిళా ఇంజినీరింగ్‌ కళాశాల విద్యార్థినులు నిలిచి రూ.5 వేలు బహుమతులు అందుకున్నారు. పోటీలకు ఉభయ తెలుగు రాష్ట్రాలతోపాటు కర్నాటక, మధ్యప్రదేశ్, పంజాబ్, తమిళనాడు నుంచి సుమారు 500 మంది విద్యార్థులు 25 బృందాలుగా తలపడ్డారు. 
 
తయారీ రంగంపై దృష్టి సారించాలి
ప్రపంచ ఇంజినీరింగ్‌లో నవీన ఆవిష్కరణలతో ముందుకు సాగుతున్న తరుణంలో యువత తయారీ రంగం, ఆటోమొబైల్, మెకానికల్‌ ఇంజినీరింగ్‌ విభాగాలపై దృష్టిసారించాలనిభీమవరం విష్ణు ఎడ్యుకేషనల్‌ సొసైటీ వైస్‌ చైర్మన్‌ ఆర్‌.రవిచంద్రన్‌ అన్నారు. బహుమతి ప్రదానోత్సవ సభలో ఆయన మాట్లాడారు. టెక్‌మహీంద్రా డెలివరీ మేనేజర్‌ దండు సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ విద్యార్థి దశలో నూతన ఆవిష్కరణలు రూపొందించడం ఎలక్ట్రికల్‌ బైక్‌ల తయారీ, ప్రదర్శన, రేసుల్లో పాల్గొనడం ద్వారా విష్ణు ఇ–మోటో చాంపియన్‌షిప్‌ పోటీలు పారిశ్రామిక, తయారీ రంగాల దృష్టిని ఆకర్షించాయన్నారు. కళాశాల ప్రిన్సిపాల్‌ జి.శ్రీనివాసరావు మాట్లాడారు. వైస్‌ ప్రిన్సిపాల్‌ పి.శ్రీనివాసరాజు, సమన్వయకర్తలు వికాస్, సాగర్, మనోనీత్‌కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.
 
>
మరిన్ని వార్తలు