బైక్‌ బోల్తా..యువకుడు మృతి

17 Dec, 2016 23:14 IST|Sakshi
– రామచంద్రాపురంలో విషాదం
పత్తికొండ టౌన్‌:  బైక్‌ అదుపుతప్పి బోల్తాపడడంతో యశ్వంత్‌(24) అనే యువకుడు మృత్యువాతపడ్డాడు. శుక్రవారం అర్ధరాత్రి రామచంద్రాపురం కొట్టాల గ్రామ సమీపంలో ఈ దర్ఘటన చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన రమేష్, శ్రీకళ దంపతులకు ఒక కుమార్తె, ఒక కుమారుడు ఉన్నారు. కుమార్తెకు వివాహం చేశారు. కుమారుడు యశ్వంత్‌ డిగ్రీ మధ్యలో మానివేసి, టమాట వ్యాపారంలో తండ్రికి చేదోడువాదోడుగా ఉంటున్నాడు.  పత్తికొండకు పనిమీద వచ్చి..శుక్రవారం రాత్రి తిరిగి గ్రామానికి వెళ్లేటపుడు రామచంద్రాపురం కొట్టాలకు సమీపంలో బైక్‌ అదుపుతప్పి రోడ్డుపక్కనే ఉన్న గుంతలో పడ్డాడు. ప్రమాదంలో యశ్వంత్‌ అక్కడిక్కడే మృతిచెందాడు.రాత్రివేళ కావడంతో ప్రమాదం జరిగిన విషయం ఎవరికి తెలియలేదు. ఉదయం పత్తికొండకు వస్తున్న గ్రామస్తులు గమనించి యువకుడి తల్లిదండ్రులకు సమాచారం అందించారు. ఒక్కగానొక్క కుమారుడి మృతితో తల్లిదండ్రులు తల్లడిల్లిపోయారు. యువకుడు మృతిచెందిన సమాచారం తెలుసుకుని శనివారం ఉదయం  కేడీసీసీ మాజీవైస్‌చైర్మన్‌ రామచంద్రారెడ్డి, టీడీపీ జిల్లా ఉపాధ్యక్షుడు సాంబశివారెడ్డి తదితరులు యశ్వంత్‌ కుటుంబాన్ని పరామర్శించి, ప్రగాఢసంతాపాన్ని తెలియజేశారు.
మరిన్ని వార్తలు