సమయ పాలనకు సరైన పరిష్కారం

24 Jul, 2016 00:32 IST|Sakshi
– అన్ని కార్యాలయాల్లో బయోమెట్రిక్‌ డివైజ్‌లు
– పంచాయతీల్లోనూ సత్వర ఏర్పాటుకు ఆదేశం
– అన్ని శాఖల అధికారులకు జేసీ ఆదేశం
 
కర్నూలు(అగ్రికల్చర్‌):  అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో బయోమెట్రిక్‌ డివైజ్‌లు ఏర్పాటు చేసుకోవాలని జాయింట్‌ కలెక్టర్‌ సి.హరికిరణ్‌ జిల్లా అధికారులను ఆదేశించారు. ఇందుకు సంబంధించి శనివారం ఆయన తన చాంబర్‌లో జిల్లా అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఇప్పటి వరకు ఏఏ శాఖల్లో బయోమెట్రిక్‌ ఏర్పాటు చేసుకున్నారు, ఇంకా ఎన్నిటికి అవసరం, గ్రామ పంచాయతీల్లో బయోమెట్రిక్‌ సిస్టమ్‌ అమలుతీరు తదితర అంశాలపై సమీక్షించారు. మొదటి విడత కింద 339  పంచాయతీల్లో బయోమెట్రిక్‌ డివైజ్‌లు ఏర్పాటు చేసుకోవాల్సి ఉన్నా ఇంతవరకు మూడు డివిజనల్‌ పంచాయతీ అధికారి కార్యాలయాలు, 18  పంచాయతీల్లో మాత్రమే ప్రక్రియ పూర్తికావడంపై అసంతప్తి వ్యక్తం చేశారు. 60 బయోమెట్రì క్‌ డివైజ్‌లు సరఫరా అయినప్పటికి 21 మాత్రమే ఏర్పాటు చేయడం తగదన్నారు. గ్రామ స్థాయిలో పనిచేసే ఉద్యోగులందరు గ్రామ పంచాయతీలో ఏర్పాటు చేసే మిషన్‌లో బయోమెట్రిక్‌ ఇవ్వాలన్నారు. సత్వరం అన్ని పంచాయతీల్లో వీటిని ఏర్పాటు చేయాలని జిల్లా పంచాయతీ అధికారిని ఆదేశించారు. పాలన పాదర్శకంగా ఉండటానికి, ప్రతి ఒక్కరు సమయపాలన పాటించడానికి ఇవి అత్యవసరమని తెలిపారు. ఇంతవరకు బయోమెట్రిక్‌ డివైజ్‌లు ఏర్పాటు చేసుకోని ప్రభుత్వ శాఖల కార్యాలయాల్లో సత్వరం ఏర్పాటు చేసి అమలు చేయాలన్నారు. జిల్లా పరిషత్, మండల పరిషత్‌లకు బయోమెట్రిక్‌లు ఏర్పాటు చేసుకున్నామని ఎన్‌ఆర్‌ఈజీఎస్‌ ఏపీఎంలు ఇక్కడే బయోమెట్రిక్‌లు ఇస్తారని జెడ్పీ సీఈఓ ఈశ్వర్‌ తెలిపారు. అన్ని మండల సమాఖ్యల్లో ఏర్పాటు చేశామని, డీఆర్‌డీఏ సిబ్బంది ఇందులో వేలిముద్రలు ఇస్తారని పీడీ రామకష్ణ తెలిపారు. పీహెచ్‌సీలు, కమ్యూనిటీ హెల్త్‌ సెంటర్లలో 148 బయోమెట్రిక్‌ డివైజ్‌లను ఏర్పాటు చేసినట్లు డీఎంహెచ్‌ఓ తెలిపారు. అన్ని శాఖల కార్యాలయాల్లో బయోమెట్రిక్‌ మిషన్‌లు ఏర్పాటు చేసుకునే విధంగా అన్ని శాఖలతో సమన్వయం చేయాలని జేడీఏను ఆదేశించారు. సమావేశంలో జేడీఏ ఉమామహేశ్వరమ్మ, డీఆర్‌ఓ గంగాధర్‌గౌడు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
 
మరిన్ని వార్తలు