డిగ్రీ కళాశాలల్లో బయోమెట్రిక్‌

20 Sep, 2016 00:28 IST|Sakshi
డిగ్రీ కళాశాలల్లో బయోమెట్రిక్‌
 
 
నెల్లూరు(టౌన్‌): పేద విద్యార్థుల సంక్షేమం కోసం అమలు చేస్తున్న పథకాలు పక్కదారి పడుతున్నాయన్న ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం బయోమెట్రిక్‌ విధానానికి శ్రీకారం చుట్టింది. కళాశాలల్లో విద్యార్థుల హాజరు శాతం తక్కువగా ఉండడం, ప్రైవేటు కళాశాలల యాజమాన్యం వాస్తవానికి మించి విద్యార్థులను ఎక్కువ సంఖ్యలో చూపించి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను పొందడం లాంటి వాటిని నియంత్రించేందుకు ప్రభుత్వం గతేడాది నుంచే ప్రభుత్వ, ప్రైవేటు డిగ్రీ కళాశాలల్లో బయోమెట్రిక్‌ విధానాన్ని అమలు చేయాలని నిర్ణయించింది. అయితే ప్రైవేటు కళాశాలల యాజమాన్యం ఇచ్చే అమ్యామ్యాలతో బయోమెట్రిక్‌ విధానాన్ని అమలు చేయాల్సిన అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు. ఈ విషయంపై ఉన్నత విద్యాశాఖ ఆగ్రహం వ్యక్తం చేయడంతో అక్టోబర్‌ 1 నుంచి జిల్లాలోని ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రైవేటు కళాశాలల్లో బయోమెట్రిక్‌ విధానాన్ని అమలు చేయాలని నిర్ణయించారు.
జిల్లావ్యాప్తంగా మొత్తం 96 డిగ్రీ కళాశాలలు ఉన్నాయి. ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో 1944 మంది విద్యార్థులు, ఎయిడెడ్‌ కళాశాలల్లో 2430 మంది, ప్రైవేటు డిగ్రీ కళాశాలల్లో 23400 మంది విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారు. కళాశాలల్లో చదివే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, ఈబీసీ, దివ్యాంగులైన విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్‌ సౌకర్యాన్ని ప్రభుత్వం అందిస్తోంది. ఒక్కో విద్యార్థికి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ కింద సైన్స్, ఆర్ట్స్‌ విద్యార్థులకు రూ.10 వేలు చెల్లిస్తున్నారు. దీంతో పాటు మెస్‌ బిల్లుల కింద నెలకు రూ.550 వంతున ఏడాదికి రూ.5500 అందజేస్తున్నారు. ఇంత పెద్ద మొత్తంలో ఖర్చు చేసినా ఆశించిన ఫలితాలు రావడం లేదు. 
75 శాతం హాజరు ఉంటేనే ఫీజు రీయింబర్స్‌మెంట్‌ 
ప్రైవేటు కళాశాలల యాజమాన్యాలు ఫీజు రీయింబర్స్‌మెంట్‌ విధానాన్ని పక్కదారి పట్టిస్తున్నాయన్న ఆరోపణలు ఉండడంతో 75 శాతం హాజరు ఉంటేనే ఫీజు రీయింబర్స్‌మెంట్, మెస్‌ ఛార్జీలను ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. కళాశాలలో ప్రతి 100 మంది విద్యార్థులకు ఒక బయోమెట్రిక్‌ యంత్రాన్ని ఏర్పాటు చేయాలని ఉన్నత విద్యాశాఖాధికారులు ఆదేశించారు. బయోమెట్రిక్‌ యంత్రాన్ని  ఈ పాస్‌కు అనుసంధానం చేయనున్నారు. అయితే ప్రైవేటు కళాశాలల్లో బయోమెట్రిక్‌ను వర్తింప చేయకుండా ఉండేందుకు వీఎస్‌యూలో కీలకంగా పనిచేసే ఓ అధికారి గతంలోనే ఒక ప్రతిపాదనను తెరపైకి తీసుకువచ్చార ని చెబుతున్నారు. ఒక్కో ప్రైవేటు కళాశాల యాజమాన్యం నుంచి రూ.10 వేలు వసూలు చేసినట్లు సమాచారం. ఈ నేపథ్యంలోనే గతేడాదిలోనే బయోమెట్రì క్‌ విధానం అమలు చేయాల్సి ఉన్నా, వచ్చేనెల 1 నుంచైనా ప్రైవేటు కళాశాలల్లో బయోమెట్రిక్‌ విధానం అమలు చేస్తారో లేదాన్నది వేచి చూడాల్సి ఉంది. 
మరిన్ని వార్తలు