ఘనంగా బోనాల ఉత్సవాలు

1 Aug, 2016 00:15 IST|Sakshi
ఘనంగా బోనాల ఉత్సవాలు
  •  పోటాపోటీగా బోనాల పండగా
  • ఆకట్టుకున్న కేరళ కళాకారులు నృత్యాలు
  • బోనాలు, బండ్ల ఊరేగింపుతో ముగిసిన జాతర
  • చిందులేసిన మాజీ ఎమ్మెల్యేజగ్గారెడ్డి
  • మెదక్‌: పట్టణంలోని స్వర్ణకారుల ఆధ్వర్యంలో ఆదివారం  మహాకాళి మాతకు ఘనంగా బోనాలను తీశారు. మహిళలు బోనాలతో పట్టణంలో ఊరేగింపు తీశారు. డప్పు చప్పుళ్లు, పోతరాజుల విన్యాసం, యువకుల నృత్యాల మధ్య ఊరేగింపు ముందుకు సాగింది. అనంతరం అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసి బోనాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు.

     సంగారెడ్డి మున్సిపాలిటి:జిల్లాకేంద్రమైన సంగారెడ్డిలో ఆదివారం బోనాల సందడి నెలకొంది. ఆషాడమాసం చివరి ఆదివారం కావడంతో బోనాల ఉత్సవాల ముగింపు సంగారెడ్డిలో జోరుగా కొనసాగింది. ఈ సందర్భంగా పలు కులసంఘాలు పోటీపడి వేర్వేరుగా బోనాలు ఊరేగింపు నిర్వహించాయి. మరోవైపు మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి నేతృత్వంలో నిర్వహించిన బోనాల ఊరేగింపులో కేరళకు చెందిన కళాకారులు వేసిన వేషా«ధరణలు ఆకట్టుకున్నాయి.

    యువతసైతం డిజేసౌండ్‌ల నడుమ నృత్యాలు చేస్తూ ఆనందోత్సవాలు జరుపుకున్నారు. మరోవైపు బోనాల ఉత్సవాలను పురస్కరించుకొని మహిళలు సంప్రదాయ దుస్తుల్లో బోనాలు ఎత్తుకొని అమ్మవారి ఆలయాలకు వచ్చారు. పట్టణంలోని సంగమేశ్వర ఆలయం నుండి హస్తబలి రేణుక ఎల్లమ్మ ఆలయం వరకు నిర్వహించిన బోనాల ఊరేగింపును స్థానిక ఎమ్మెల్యే చింతా ప్రభాకర్‌ ముదిరాజ్‌ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. అంతకు ముందు అమ్మవారికి ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం గంగపుత్ర సంఘం ఆధ్వర్యంలో పట్టణంలోని రాంమందిర్‌ నుండి ప్రారంభమైన బోనాల ఉత్సవాలను మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి ప్రారంభించారు.

    రాంమందిర్‌నుండి ప్రధానరహదారి మీదుగా ఉప్పర్‌ బజార్, ప్రైడే మార్కెట్, భవాని మాత ఆలయం మీదుగా దుర్గమాత ఆలయం ఈ బోనాల ఊరేగింపు కొనసాగింది. కింది బజార్‌ బోనాలను హనుమాన్‌ నగర్‌లోని నల్లపోచమ్మ ఆలయం నుండి భవాని మందిర్‌ వరకు వచ్చి గంగపుత్ర సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన బోనాల్లో కలిశారు. అంతకు ముందు నలంద నగర్‌నుండి వచ్చిన బోనాలు నేరుగా దుర్గామాత ఆలయం వరకు ఊరేగింపుగా వచ్చారు.

    బోనాల ఊరేగింపుల్లో పోతరాజులతో కలిసి మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి సైతం చిందులేశారు. ప్రత్యేకంగా కేరళనుండి వచ్చిన కళాకారులు వివిధ దేవతా మూర్తుల వేషాధరణాలు వేయడం అందరిని ఆకట్టుకున్నాయి. తొలిసారిగా బోనాల పండగాను కుల సంఘాలు వేర్వేరుగా నిర్వహించడంతో పోలీసులు ముందస్తుగా బందో బస్తు ఏర్పాటు చేశారు. ఈసందర్భంగా ఐదుమంది సీఐలు, పదిమంది ఎస్‌ఐలతోపాటు 50మంది కానిస్టేబుళ్లతో పట్టణంలో భారీ బందోబస్తు ఏర్పాటుచేశారు. మొత్తంగా బోనాల జాతర ఉత్సవాలు ఆదివారం సంగారెడ్డి పట్టణంలో ప్రశాంత వాతావరణంలో జరిగాయి.

    మరోవైపు బోనాల సందర్భంగా ఆలయ సమీపంలోని ప్రధాన రహదారులపై సరైన లైట్లు ఏర్పాటు చేయక పోవడంతో భక్తులు అంధకారంలోనే బోనాలు ఊరేగించారు.  మెదక్‌:మెదక్‌ పట్టణంలో ఆదివారం  స్వర్ణకారుల ఆధ్వర్యంలో కాళికామాతకు  ఘనంగా బోనాల ఉత్సవాలు నిర్వహించారు. కాగా మున్సిపల్‌చైర్మన్‌ మల్లికార్జున్‌గౌడ్‌ స్థానిక మున్సిపాలిటి ఆధ్వర్యంలో ఎదురెళ్లి ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వర్షాలు బాగా కురిసి పంటలు పండి ప్రజలంతా సుఖ సంతోషాలతో జీవించాలని అమ్మవారికి మొక్కుకున్నారు. ఆయన వెంట కమిషనర్‌ ప్రసాదరావు తదితరులు ఉన్నారు.

    -ముత్యాలమ్మకు  భక్తితో పూజలు,
    -మొక్కులు తీర్చుకున్న భక్తులు.
    నర్సాపూర్‌ః
    పట్టణంలోని ముత్యాలమ్మ తల్లికి ఆదివారం పట్టణ ప్రజలు భక్తి శ్రద్దలతో ఘణంగా పూజలు చేశారు. ఉదయం నుంచి భక్తులు ఆలయానికి వెల్లి పూజలు చేసి తమ మొక్కులు తీర్చుకున్నారు.  సాయంత్రం బండ్లు ఊరేగింపుగా వచ్చి ఆలయం చుట్టు ప్రదక్షిణలు చేశారు. మహిళలు బోనాలతో వచ్చి ఆలయం చుట్టు ప్రదక్షిణలు చేసిన అనంతరం  తల్లికి నైవేద్యం సమర్చించి తమ మొక్కలు తీర్చుకున్నారు.   అనంతరం పట్టణంలోని పద్మాశాలి సంఘం ఆద్వర్యంలో అమ్మవారికి  వస్తా‍్రలు సమర్పించారు.  పూజలు, ఆయా కార్యక్రమాల్లో సర్పంచ్‌ రమణ, ఎంపీటీసీలు సురేష్‌, రాజేందర్‌,  పలువురు వార్డు సభ్యులు ఆయా పార్టీల నాయకులు పాల్గొన్నారు. ఇదిలాఉండగా ఆలయానికి  వెల్లె దారిలో బురదగా ఉన్నప్పటికి దారిని బాగు చేయకపోవడం పట్ల ప్రజలు నిరసనలు వ్యక్తం చేశారు.

    సిద్దిపేట జోన్:సిద్దిపేట పట్టణంలో ఆదివారం అశాడమాస ముంగిపు సందర్భంగా పెద్ద ఎత్తున భోనాలు నిర్వహించారు. స్థానిక దీకొండ మైసమ్మ దేవాలయంలో వార్షికోత్సవాలను పురస్కరించుకోని నిర్వహకులు ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టారు. ముఖ్యంగా  అమ్మవారి మైలలు తీయుటు, ఓడి బియ్యంతో పాటు కాలనీకి చెందిన ప్రతి ఇంటి నుంచి ఒక్కోక్క భోనంతో భోనాల కార్యక్రమాన్ని నిర్వహించారు. పోతరాజుల నృత్యాలు, శివసత్తుల పునాకలతో పట్టణంలో భోనాలు కోట్టోచ్చినట్లుగా మారింది. అదే విధంగాస్థానిక శ్రీనగర్‌ కాలనీ వాసులు భోనాల కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నిర్వహకులు శ్రీనివాస్‌రెడ్డి, పాల శేఖర్‌, శ్రీను, నరేష్‌తో పాటు తదితరులు పాల్గొన్నారు.

     జహీరాబాద్‌:జహీరాబాద్‌ పట్టణం బోనాల ఉత్సవాలతో సందడిగా మారింది. ఆదివారం పట్టణంలోని హౌసింగ్‌బోర్డు, బాగారెడ్డిపల్లి కాలనీ మహిళలు దేవాలయాలకు బోనాలను ఊరేగింపు తీసుకెళ్లారు. హౌసింగ్‌బోర్డు కాలనీ పోచమ్మ దేవాలయానికి కాలనీ మహిళలు పెద్ద సంఖ్యలో తరలి వెళ్లి బోనాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ ఉత్సవాల్లో మున్సిపల్ చర్‌పర్సన్‌ లావణ్యచందు, కౌన్సిలర్‌ రాజశేఖర్‌, నర్సింహారెడ్డి, ముత్యాలచందు, తేజ్‌రెడ్డి, బాల్‌రెడ్డి, ప్రజలు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. దీంతో కాలనీలోని 7,12వ వార్డులు సందడిగా మారాయి.

    13వ వార్డు పరిధిలోని బాగారెడ్డి పల్లిలో సైతం బోనాలు ఉత్సవాలు ఘనంగా జరిగాయి.  కాలనీ నుంచి శ్రీ చక్ర పోచమ్మ దేవాలయానికి నిర్వహించిన ఉత్సవాలు అలరించాయి. 1వ వార్డు పరిధిలోని మాణిక్‌ప్రభు వీధిలో గల పోచమ్మ దేవాలయానికి కాలనీ మహిళలు బోనాల ఊరేగింపు నిర్వహించారు. ఉత్సవాల్లో వార్డు కౌన్సిలర్‌ కండెం సుజాత, కాంగ్రెస్‌ పార్టీ పట్టణ అధ్యక్షుడు కండెం నర్సింహులు, కాలనీ ప్రముఖులు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అలాగే మండలంలోని పస్తాపూర్‌ గ్రామంలో గల భూలక్ష్మమ్మ, దుర్గమ్మ దేవాలయాలకు గ్రామ ప్రజలు ఘనంగా బోనాల ఉత్సవాలను నిర్వహించారు. దీంతో గ్రామంలో పండుగ వాతావరణం ఏర్పడింది. ఉత్సవాల్లో సర్పంచ్‌ రామకృష్ణారెడ్డితో పాటు మాణిక్‌రెడ్డి, పెంటారెడ్డి, విఠల్‌రెడ్డి, రమేష్‌రెడ్డి, అశోక్‌రెడ్డి,  గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

    భక్తిశ్రద్ధలతో భోనాల ఊరేగింపు
    హజరైన మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి

    సదాశివపేట: మండల పరిధిలోని నందికంది గ్రామంలో ఆదివారం భక్తిశ్రద్దలతో ఘనంగా మహిళలు బోనాల ఊరేగింపు నిర్వహించారు. మాజీ  మార్కెట్‌ కమిటి చైర్మన్‌ కుందెన రాజు ఆధ్వర్యంలో బోనాల పండుగ సందర్భంగ బోనాల ఊరేగింపు కార్యక్రమం జరుపుకున్నారు. ఈ కార్యక్రమానికి మాజీ ఎమ్మెల్యే తూర్పు జయప్రకాశ్‌రెడ్డి, హజరై ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామానికి చెందిన చింటుగౌడ్‌, రమేశ్‌యాదవ్‌, సంగయ్య, బుచ్చం, మాణయ్య, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.
     

    గజ్వేల్‌రూరల్‌ : ఆషాడ మాసం చివరి ఆదివారం కావడంతో భక్తులు అమ్మవార్లకు బోనాలను సమర్పించి తమ మొక్కులను చెల్లించుకున్నారు. గజ్వేల్‌-ప్రజ్ఞాపూర్‌ నగర పంచాయతీ పరిధిలోని సిరి ఎన్‌క్లేవ్‌ కాలనీలో అధ్యక్షుడు జగదీశ్వర్‌ ఆధ్వర్యంలో ఆదివారం ఉదయం బోనాలను నెత్తినపెట్టుకున్న మహిళలు, ఆడపడుచులు డప్పు చప్పుళ్ల నడుమ తమ పిల్లాపాపలతో ఊరేగింపుగా తరలివచ్చి ప్రజ్ఞాపూర్‌లోని పోచమ్మతల్లికి సమర్పించారు. ఈ సందర్భంగా వర్షాలు సమృద్ధిగా కురిసి పంటలు బాగా పండాలని అమ్మవార్లను వేడుకున్నారు. అలాగే పట్టణంలోని పోచమ్మ, మహంకాళి అమ్మవార్లకు పలువురు మహిళలు బోనాలను సమర్పించారు.

    తూప్రాన్‌లో ఘనంగా బోనాల ఉత్సవాలు
    ఎంపీ ప్రభాకర్‌రెడ్డి ప్రత్యేక పూజలు

    తూప్రాన్‌:
    పట్టణంలోని మహంకాళి దేవాలయంలో మూడు రోజులపాటు సాగే బోనాల ఉత్సావాలు ఆదివారం ఉదయం నుంచే పట్టణంలో పండుగ వాతవారణం నెలకొంది. ఆదివారం ఉజ్జయిని మహంకాళి ఉత్సవాల సందర్భంగా  అమ్మవారికి బోనాలు సమర్పించారు.  ఈ ఉత్సవాలు  స్థానిక సర్పంచ్‌ చిట్టిమిల్ల శివ్వమ్మ ఆధ్వర్యంలో ప్రారంభమయ్యాయి. బోనాల ఉత్సవాల్లో మెదక్‌ ఎంపీ ప్రభాకర్‌రెడ్డి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ బోనాల పండుగను సీఎం కేసీఆర్‌ రాష్ట్ర పండుగగా ప్రకటించిన విషయం గుర్తుచేశారు. తెలంగాణలో ఈఏడు వర్షాలు సమృద్ధిగా కురిసి, పంటలు బాగా పండాలని, ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని అమ్మవారిని కోరుకున్నట్లు తెలిపారు. 

    సీఎం అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని తెలిపారు. ఉదయం నుంచి అమ్మవారిని పెద్దసంఖ్యలో దర్శించుకుని బోనాలు సమర్పించారు. పోతారాజుల విన్యాసాలు, శివసత్తుల పూనకాలతో ఆలయ పరిసరాలు ఆధ్యాత్మిక వాతావరణ నెలకొంది. యువకులు ప్రత్యేకంగా దేవతామూర్తులను అలంకరించి అమ్మవారికి తొట్టేలను సమర్పించారు. అమ్మవారికి గౌడ సంఘం ఆధ్వర్యంలో ఘటంను ఊరేగింపుగా తీసుకువచ్చి బోనాలు సమర్పించారు.  జాతర సందర్భంగా బొమ్మల దుకాణాలు ఏర్పాటుచేశారు. అమ్మవారి ఆలయం వద్ద కళాకారులతో దుంధాం నిర్వహించారు.

    భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా స్థానిక సీఐ.రమేశ్‌బాబు, ఎస్‌ఐ వెంకటేశ్‌ తమ సిబ్బందితో బందో బస్తు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మార్కెట్‌ కమిటీ వైస్‌ చైర్మన్‌ రామునిగారి శ్రీశైలంగౌడ్‌, టీఆర్‌ఎస్‌ మండలపార్టీ అధ్యక్షుడు ర్యాకల శేఖర్‌గౌడ్‌,  సర్పంచ్‌ శివ్వమ్మ,  ఎంపీపీ ఉపాధ్యక్షుడు అనంతరెడ్డి, ఉప సర్పంచ్‌ నందాల శ్రీనివాస్, వార్డు సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు.

    మునిపల్లి : మండలంలోని ఆయా గ్రామాల్లో బోనాల పండుగను ఘనంగా నిర్వహించారు. ఆదివారం మండలంలోని తాటిపల్లి, ఖమ్మంపల్లి, పోల్కంపల్లి గ్రామాల్లో దుర్గమ్మ, పోచమ్మ అమ్మవార్లకు బోనాలను సమర్పించారు. ప్రత్యేక పూజలు చేశారు. శివసత్తుల పూనకాలు ఆకట్టుకున్నాయి. ఆయా గ్రామాల్లో అన్నదానం చేశారు.

మరిన్ని వార్తలు