- విద్యుదాఘాతంతో బాలుడు మృతి
హాలహర్వి: ఆడుకుంటూ ఓ బాలుడు విద్యుదాఘాతంతో మృత్యువాత పడ్డాడు. ఈ ఘటన బాపురం గ్రామంలో శనివారం చోటు చేసుకుంది. బంధువులు తెలిపిన వివరాల మేరకు.. గ్రామంలోని బసవేశ్వరదేవాలయం వద్ద ఉన్న పార్కులో తోటి పిల్లలతో మల్లికార్జున(12).. క్రికెట్ ఆడుతున్నాడు. బాల్ పార్కు కాంపౌండ్లో పడడంతో దానికి తీసుకొచ్చేందుకు మల్లికార్జున వెళ్లాడు. కాంపౌండ్కు చుట్టూ ఇనుప కంచె ఉండగా..ఇటీవల రైతులు మిరప దిగుబడులను అరబోసి..రాత్రి పూట వెలుతురు కోసం పార్కు వద్దనున్న విద్యుత్ స్తంభం నుంచి సిల్క్ వైరు ద్వారా ఓ లైటును ఏర్పాటు చేసుకున్నారు. అయితే శనివారం మధ్యాహ్నం 3 గంటల సమయంలో గాలివానకు వైరు తెగి కాంపౌండ్కు ఏర్పాటు చేసిన ఇనుప కంచెపై పడింది.
బంతిని తీసుకోవడానికి వెళ్లిన మల్లికార్జున.. ఇనుప కంచెను తాకడంతో విద్యుత్షాక్కు గురై అక్కడిక్కడే మృతిచెందాడు. విద్యార్థి మృతి చెందడంతో తల్లిదండ్రులు సుశీలమ్మ, పరశప్పలు బోరున విలపించారు. దంపతులకు ఏడుగురు ఆడపిల్లలు, ఒక కుమారుడు సంతానం. వీరిలో ఏకైక కుమారుడు చనిపోవడంతో వారు కన్నీరుమున్నీరుగా విలపించారు. విషయం తెలుసుకున్న హాలహర్వి ఎస్ఐ కృష్ణమూర్తి ఘటనా స్థలాన్ని పరిశీలించి.. వివరాలు తెలుసుకున్నారు. బంధువులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసుదర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు.