రాజంపేట: రాజంపేట పట్టణం పాతబస్టాండులో సోమవారం రాజంపేట డిపోకు చెందిన స్టూడెంట్ బస్సును ఎక్కుతూ ప్రమాదవశాత్తు బస్సు టైర్లకింద పడి నాగార్జున అనే విద్యార్థి తీవ్రంగా గాయపడ్డాడు. పెనగలూరు మండలం ఈటమార్పురం గ్రామానికి చెందిన నాగార్జున పట్టణంలోని ఓ ప్రైవేటు కళాశాలలో డిగ్రీ చదువుతున్నాడు. రోజూ కళాశాలకు వచ్చి ఇంటికి వెళ్లేవాడు. ఇదే క్రమంలో ఆర్టీసీ అధికారులు ఏర్పాటు చేసిన స్టూడెంట్ బస్సును ఎక్కే సమయంలో ప్రమాదవశాత్తు బస్సు టైర్ల కింద పడ్డాడు. దీంతో రెండు కాళ్లు, తలకు తీవ్ర గాయాలయ్యాయి. తోటి విద్యార్థులు వెంటనే స్థానికంగా ఉన్న ఓ ప్రైవేటు ఆసుపత్రికి తీసుకెళ్లారు. అయితే కాళ్లు పనిచేయడంలేదు. దీంతో విద్యార్థి కుటుంబ సభ్యులు మెరుగైన చికిత్స కోసం తిరుపతికి తరలించారు. పోలీసులు బస్సును పోలీసు స్టేషన్కు తరలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.