ఎమ్మిగనూరురూరల్: కలుగోట్ల గ్రామ సమీపంలోని బావికి ఈతకు వెళ్లిన ఓ బాలుడు అందులో మునిగి మృత్యువాతపడ్డాడు. ఎమ్మిగనూరు ఖబరస్తాన్ కాలనీకి చెందిన షేక్షావలి(లేట్), నూర్జహన్ దంపతుల కుమారుడు షాదిక్(8) మానసికస్థితి సరిగా లేకపోవడంతో స్కూల్కు కూడా వెళ్లేవాడు కాదు. తల్లి నూర్జహన్ కూలీ పనులకు వెళ్లేది. ఆదివారం కాలనీలోని పిల్లలతో కలసి స్నానం చేసేందుకు బావికి వెళ్లాడు. ఈత సరిగా రాకున్నా బావిలోకి దూకడంతో నీటిలో మునిగిపోయాడు. తోటి పిల్లలు కేకలు వేయడంతో పరిసరాల్లో ఉన్న వారు వచ్చి బావిలోకి దూకి బయటకు తీశారు. అయితే అప్పటికే బాలుడు మృతి చెందాడు. బాలుడి మృతదేహం దగ్గర కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి.