చంపేసి.. మృతదేహంపై రాళ్లు పేర్చి

13 Jan, 2016 00:04 IST|Sakshi
చంపేసి.. మృతదేహంపై రాళ్లు పేర్చి

తాండూరు రూరల్: దుండగులు ఓ యువకుడిని దారుణంగా హత్య చేసి.. అనంతరం మృతదేహంపై బండరాళ్లు పేర్చారు. తీవ్ర కలకలం సృష్టించిన ఈ సంఘటన తాండూరు పట్టణంలోని సీతారాంపేట్‌లో మంగళవారం ఉదయం వెలుగుచూసింది. పట్టణ సీఐ వెంకట్రామయ్య తెలిపిన వివరాల ప్రకారం.. బం ట్వారం మండలం కల్కోడ గ్రామానికి చెందిన చాకలి శ్రీను(30) కొన్నేళ్ల క్రితం  పాతతాండూరుకు చెందిన లక్ష్మిని పెళ్లి చేరుకొని అత్తగారివద్ద  ఉంటున్నాడు. స్థానికంగా రోజు వారి కూలీపనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. ఇదిలా ఉండగా పట్టణంలోని సీతారాంపేట్‌లో ఉన్న శ్మశానవాటికలో ఓ  యువకుడి(30) మృతదేహాన్ని మంగళవారం ఉదయం స్థానికులు గుర్తించారు.

సమాచారం అందుకున్న తాండూరు పట్టణ సీఐ వెంకట్రామయ్య, ఎస్‌ఐ నాగార్జున సిబ్బందితో సంఘటనా స్థలానికి చేరుకొని మృతదే న్ని పరిశీలించారు. మృతుడిని చాకలి శ్రీనుగా గుర్తించారు. దుండగులు అతడిని చంపేసిన అనంతరం మృతదేహంపై బండరాళ్లు పేర్చారు. ముఖంపై రాళ్లతో మోదడంతో పూర్తి ఛిద్రమైపోయింది. వెంటనే పోలీసులు వికారాబాద్ నుంచి డాగ్‌స్క్వాడ్, క్లూస్ టీంల ను  రప్పించారు. పోలీసు జాగిలం సంఘటనా స్థలం నుంచి సీతారాంపేట్‌లో పలు వీధుల మీదుగా క్లాసిక్‌గార్డెన్ సమీపంలో ఉన్న ఓ పాలిషింగ్ యూనిట్ వద్దకు వెళ్లి ఆగింది.

మృతదేహం వద్ద క్లూస్ టీం సిబ్బంది వివరాలు సేకరించారు. దుండగులు బండరాళ్లతో శ్రీను తలపై మోది హత్య చేసినట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. మృతదేహానికి సమీపం లో ఓ ముళ్లచెట్లు వద్ద ఖాళీ మద్యం సీసాలు పడి ఉన్నాయి. దీంతో హతుడికి తెలిసిన వారే చంపేసి ఉండొచ్చనే అనుమానాలు వ్యక్తమయ్యాయి. మృతదేహాన్ని శ్మశానవాటికలో పూడ్చేందుకు తీసుకొచ్చి ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు. ఈక్రమంలోనే మృతదేహంపై బండరాళ్ల పేర్చి ఉండొచ్చని అనుమానం వ్యక్తం చేశారు. మొదటగా హతుడి వివరాలు తెలియరాలేదు.

సీతారాంపేట్‌లో వ్యక్తి దారుణ హత్య విషయం తెలుసుకున్న పట్టణవాసులు పెద్దఎత్తున ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఈ విషయం దావానలంలా పట్టణంలో వ్యాపించడంతో తీవ్ర కలకలం రేగింది. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తాండూరులోని జిల్లా ఆస్పత్రికి తరలించారు.  కాగా, హతుడికి కుమార్తె విజయ (3), కొడుకు లక్కీ(1) ఉన్నారు. కేసు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ వెంకట్రామయ్య పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు