రైతును బలిగొన్న కాలేజీ బస్సు

25 Jul, 2016 20:25 IST|Sakshi
రైతును బలిగొన్న కాలేజీ బస్సు
ధవళేశ్వరం :
వ్యవసాయ పనులు చూసుకునేందుకు స్కూటర్‌పై వెళుతున్న రైతును కాలేజీ బస్సు బలిగొన్న ఉదంతమిది. పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. కొత్తపేట మండలం వానపల్లి గ్రామానికి చెందిన నేమాని సూర్యనారాయణమూర్తి(37) వ్యవసాయం చేసుకుంటూ, జీవనం సాగిస్తున్నాడు. టీచర్‌ ట్రైనింగ్‌ పొందుతున్న భార్య, కుమారుడు చదువు కోసం రాజమహేంద్రవరంలోని దానవాయిపేటలో కొంతకాలంగా నివసిస్తున్నాడు. రెండు రోజులకు ఓసారి వాన పల్లి వెళ్లి, వ్యవసాయ పనులు చూసుకుని వస్తున్నాడు. ఇలాఉండగా సోమవారం ఉదయం రాజమహేంద్రవరం నుంచి స్కూటర్‌పై అతడు వానపల్లి బయలుదేరాడు. ధవళేశ్వరం ఎఫ్‌సీఐ గోడౌన్ల సమీపంలో రాజమహేంద్రవరం వైపు వెళుతున్న ఓ ప్రైవేట్‌ ఇంజనీరింగ్‌ కళాశాల బస్సు అతడి స్కూటర్‌ను ఢీకొంది. ఈ సంఘటనలో తలకు తీవ్ర గాయం కావడంతో అతడిని రాజమహేంద్రవరం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అప్పటికే అతడు మరణించినట్టు వైద్యులు ధ్రువీకరించారు. సీఐ ఎం.కృపానందం ఆధ్వర్యంలో హెచ్‌సీ జి.మణి కేసు దర్యాప్తు చేస్తున్నారు.
 
25 ఆర్‌జేసీ 182 ప్రమాదానికి గురైన స్కూటర్, పక్కనే మృతదేహం
 
మరిన్ని వార్తలు