– ఆగస్టు 1 నుంచి అమలు
– ఏపీలో హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం, చెన్నై, బెంగళూరు నుంచి అమలు, పాండిచ్చేరి కేంద్రాలకు అవకాశం
www.apsrtconline. in .లభ్యం
సాక్షి,తిరుమల: ఏపీ ఎస్ఆర్టీసీ ప్రయాణికులకు శుభవార్త. బస్సు టికెట్టుతోపాటు తిరుమల శ్రీవారి రూ.300 దర్శనం టికెట్లు సులభంగా పొందే అవకాశం కలగబోతోంది. రోజూ వెయ్యి మంది ఆర్టీసీ ప్రయాణికులకు శ్రీవారి దర్శనం రేపటి నుండి అమల్లోకి రానుంది.
ఇలా టికెట్లు పొందవచ్చు
ఏపీలోని విజయవాడ, విశాఖపట్నం, తెలంగాణాలోని హైదరాబాద్, తమిళనాడులోని చెన్నైయ్, కేంద్ర పాలిత ప్రాంతమైన పాండిచ్చేరి, కర్ణాటకాలోని బెంగుళూరు నగరాలు నుండి తిరుపతి లేదా తిరుమలకు ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించేవారు ఈ సదుపాయం పొందవచ్చు. వీరు ఆర్టీసీ www. apsrtconline. in .వెబ్సైట్ద్వారా బస్సు టికెట్టు రిజర్వేషన్ చేసుకోవాలి. అదే సందర్భంలోనే వెబ్సైట్లో కనిపించే టీటీడీ తిరుమల శ్రీవారి దర్శనం ఆప్షన్ల ప్రకారం టికెట్లు నమోదు చేసుకుని ఆన్లైన్లోనే నగదు చెల్లించాలి. ఒకవేళ ఆయా బస్సు డిపో రిజర్వేషన్ కేంద్రాల్లో కూడా వ్యక్తిగతంగా ప్రయాణీకులు రిజర్వు చేసుకుని బస్సుతోపాటు శ్రీవారి దర్శన టికెట్లు కూడా పొందవచ్చు. ఈ సౌకర్యం 1వ తేది నుండి అమలు చేస్తున్నట్టు ఆర్టీసీ రీజినల్ మేనేజరు నాగశివుడు తెలిపారు.
రోజూ వెయ్యిమందికి శ్రీవారి దర్శనం
ఆర్టీసీ బస్సుల్లో తిరుమల డిపోకు చేరిన భక్తులకు ఇక్కడి సిబ్బంది ప్రత్యేకంగా శ్రీవారి దర్శనానికి తీసుకెళతారు. ఇందులో ఉదయం 11 గంటలకు 600 మంది , సాయంత్రం 4 గంటలకు మరో 400 మందికి శ్రీవారి దర్శనానికి అనుమతిస్తారు. దర్శన సమయంలో భక్తులు ఆధార్లేదా, ఇతర ప్రభుత్వ గుర్తింపు కార్డుల్లో ఏదో ఒకటి చూపించాల్సి ఉంటుంది. భవిష్యత్లో ఏపీఎస్ ఆర్టీసీ ప్రయాణీకుల డిమాండ్ ప్రకారం ఈ రూ.300 టికెట్ల సంఖ్యను పెంచేందుకు టీటీడీ కూడా సుముఖంగా ఉంది.