వర్మి కంపోస్ట్‌ కొనుగోలు

13 Feb, 2017 22:15 IST|Sakshi
వర్మి కంపోస్ట్‌ కొనుగోలు
– ముందుకు వచ్చే రైతులతో ఎంఓయూ
- అధికారుల సమీక్షలో కలెక్టర్‌ అరుణ్‌కుమార్‌
 కాకినాడ సిటీ : రైతులు తయారు చేసిన వర్మికంపోస్ట్‌ వారి అవసరాలు పోను మిగిలినది ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని కలెక్టర్‌ హెచ్‌.అరుణ్‌కుమార్‌ అన్నారు. దీనికి సంబంధించి ఎవరైనా ముందుకు వస్తే వారితో ఎంఓయూ చేసుకోవాలని జిల్లా పరిషత్‌ సీఈఓను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌ కోర్టు హాలులో జిల్లా అధికారులతో వివిధ అంశాలపై కలెక్టర్‌ సమీక్షించారు. గ్రామ పంచాయతీల్లో సాలిడ్‌ వేస్ట్‌ మేనేజ్‌మెంట్, వర్మీ కంపోస్ట్‌ యూనిట్లను మంజూరు చేశామని, రైతులకు కూడా 15 యూనిట్లు మంజూరు చేశామన్నారు. ఇరిగేషన్‌కు సంబంధించి కాలువల్లో గుర్రపు డెక్కను ఉపాధి హామీ పథకంలో తొలగించడానికి చర్యలు చేపట్టాలని డ్వామా పీడీకి సూచించారు. ఏజెన్సీలో ఇచ్చిన 50 శాతం సీసీ రోడ్డు పనులను పంచాయతీరాజ్‌శాఖ త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. ఏజెన్సీ, సబ్‌ప్లాన్‌లోని 15 మండలాల్లోని గర్భిణులకు ఏడో నెల నుంచి ప్రసవం అయిన మూడు నెలల వరకు పౌష్టికాహారాన్ని అందించాలని, ఇందుకు డీఎంహెచ్‌ఓ, డీఆర్‌డీఏ పీడీ, ఐసీడీఎస్‌ పీడీ సమన్వయంగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. జాయింట్‌ కలెక్టర్‌ ఎస్‌.సత్యనారాయణ మాట్లాడుతూ మీ–కోసంలో వచ్చిన దరఖాస్తులన్నీ త్వరితగతిన పరిష్కరించాలని ఆదేశించారు. వచ్చే వేసవిని దృష్టిలో పెట్టుకుని ప్రణాళిక వివరాల నివేదికను వెంటనే సమర్పించాలని, 15వ తేదీన ఈ అంశంపై చీఫ్‌ సెక్రటరీతో కలెక్టర్‌ల సమీక్ష ఉంటుందని జేసీ తెలిపారు. నగదు రహిత లావాదేవీలకు సంబంధించి భీమ్‌ యాప్‌ను ఉద్యోగులందరూ ఉపయోగించాలన్నారు. జేసీ–2 జె.రాధాకృష్ణమూర్తి, జెడ్పీ సీఈఓ కె.పద్మ, సీపీఓ మోహన్‌రావు, డీఎంహెచ్‌ఓ డాక్టర్‌ కె.చంద్రయ్య, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు. 
మరిన్ని వార్తలు