జీవో 271ని రద్దు చేయాలి

4 Aug, 2016 00:31 IST|Sakshi
– అఖిల పక్షాల రైతు సంఘాల ఆధ్వర్యంలో ధర్నా
 
కర్నూలు(న్యూసిటీ): భూమిపై రైతుకు ఉన్న యాజమాన్య హక్కులను హరించే జీవో నెం.271ని రద్దు చేయాలని వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ రైతు విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వంగాల భరత్‌కుమార్‌రెడ్డి డిమాండ్‌ చేశారు. బుధవారం స్థానిక కలెక్టరేట్‌ ఎదురుగా వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ రైతు విభాగం, రైతు సంఘం, భారతీయ కిసాన్‌సంఘ్‌ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ జీవో నెం.271 ప్రకారం యాజమాన్య హక్కు పత్రాలు ఉండి భూమిని సాగు చేసుకుంటున్నా.. 1బీలో ఆరైతు పేరు లేకపోతే హక్కులు చెల్లబోవన్నారు. ఈ జీవోతో నిజమైన రైతుల భూములు చేజారే అవకాశం ఉందన్నారు. జీఓ నెం.271ని రద్దు చేసి గతంలో మాది పాస్‌పుస్తకం టైటిల్‌డీడ్‌లకు ఉన్న సాధికారతను కొనసాగించాలన్నారు. అవి లేకుండా భూముల రిజిస్ట్రేషన్‌ను జరగకుండా ఉండేందుకు ఉత్తర్వులు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. రైతులను దోపిడీ చేసి కార్పొరేట్‌ సంస్థలకు భూములను కట్టబెట్టడానికి సీఎం చంద్రబాబు జీవో నెం.271ని విడుదల చేశారని  వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ రైతు విభాగం రాష్ట్ర సంయుక్త కార్యదర్శి పి.ప్రతాప్‌రెడ్డి విమర్శించారు. రాజధాని పేరుతో రైతుల భూములను సింగపూర్‌ కంపెనీలకు అప్పజెపుతూ రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ రంగాన్ని నీరుగారుస్తోందని రైతు సంఘం జిల్లా కార్యదర్శి కె.జ గన్నాథం ఆరోపించారు. అనంతరం జిల్లా కలెక్టర్‌ సీహెచ్‌ విజయమోహన్‌కు వినతిపత్రం అందజేశారు. ధర్నాలో వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కార్యదర్శి భీమలింగప్ప, హంద్రీనీవా పరివాహక గ్రామాల పరిరక్షణ సమితి అధ్యక్షుడు ఎం.రామకష్ణారెడ్డి, వైఎస్‌ఆర్‌సీపీ కర్నూలు నియోజకవర్గ ఇన్‌చార్జ్‌ హఫీజ్‌ఖాన్, రైతు సంఘం కార్యదర్శి సోమన్న, కౌలు రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు ఆదిశేషన్న, వీరన్న తదితరులు పాల్గొన్నారు.
 

whatsapp channel

మరిన్ని వార్తలు