ఇలాగైతే దివాలాయే

27 Mar, 2017 23:41 IST|Sakshi
ఇలాగైతే దివాలాయే
నగదు రహితంతో చిరు వ్యాపారుల ఇక్కట్లు
వర్తక సంఘాల ప్రతినిధుల సమావేశంలో ఆవేదన 
రాజమహేంద్రవరం సిటీ : నగదు రహిత లావాదేవీలపై కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయం చిరు వ్యాపారుల పాలిట శాపంగా మారే ప్రమాదం ఉందని పలువురు వ్యాపారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సోమవారం ది రాజమండ్రి చాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ అధ్యక్షుడు బూర్లగడ్డ వెంకట సుబ్బారాయుడు ఆధ్యక్షతన నగరంలో పలు సంఘాల ప్రతినిధులతో చాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. చిరు వ్యాపారుల హక్కులు కాపాడుతానని ప్రధాని మోదీ ఇచ్చిన హామీ తుంగలో తొక్కారని కేంద్ర ప్రభుత్వం తీసుకు వచ్చే నూతన విధానం ద్వారా పీజీ డిగ్రీ పొందిన వారు మాత్రమే బిల్లు బయటకు తీసే అవకాశం ఉంటుందన్నారు. ఏ మాత్రం చదువు లేని వారు వ్యాపారాలను మూసుకోవాల్సిన దుస్థితి నెలకొనే ప్రమాదం ఉందని పలు సంఘాల నాయకులు నిరసన వ్యక్తం చేశారు. కొత్తగా ప్రవేశపెట్టిన విధానంతో దేశవ్యాప్తంగా రెండు కోట్ల మంది చిరు వ్యాపారుల కుటుంబాలు రోడ్డున పడనున్నాయని పలువురు పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం రూ.500, రూ.1,000 నోట్లను రద్దు చేసి ప్రధానమంత్రి గరీబ్‌ కల్యాణ్‌ పథకాన్ని రూపొందించి నిధుల సమీకరణ కోసం చిరు వ్యాపారులు, ప్రజలపై ఒత్తిడి తీసుకు రావడం దారుణమన్నారు. కేంద్ర ప్రభుత్వం చిరు వ్యాపారులకు వ్యతిరేకంగా తీసుకు వచ్చిన విధానాలను నిరసిస్తూ ఏప్రిల్‌ 16న రాజమహేంద్రవరం కేంద్రంగా వివిధ జిల్లాల వర్తక ప్రతినిధులతో సమావేశం నిర్వహించేందుకు తీర్మానించారు.  ఫెడరేషన్‌ ఆఫ్‌ చాంబర్‌ ఆఫ్‌ కామర్స్, ఇండస్ట్రీ కన్వీనర్‌ అశోక్‌కుమార్‌ జైన్, జిల్లా ఫెడరేషన్‌ చాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ చైర్మన్‌ నందెపు శ్రీనివాస్, ఉపాధ్యక్షులు గ్రంధి వెంకటేశ్వర్రావు,ç కార్యదర్శి కాలేపు రామచంద్రరావు, హోల్‌సేల్‌ క్లాత్‌ మర్చంట్స్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు దొండపాటి ప్రవీణ్‌కుమార్‌, కాలేపు వెంకట వీరభద్రరావు, పలు సంఘాల నాయకులు పాల్గొన్నారు.  
మరిన్ని వార్తలు