పిడుగుపాటుకు మూగజీవాలు మృతి

4 May, 2016 18:50 IST|Sakshi

తెలంగాణ వ్యాప్తంగా బుధవారం కురిసిన అకాల వర్షానికి మూగ జీవాలు మృతి చెందాయి. పిడుగుపాటుకు గురై మూడు మూగజీవాలు మృత్యువాత పడ్డాయి. మంగళవారం రాత్రి పిడుగు పడి మండల పరిధిలోని రంగారెడ్డి జిల్లా అగర్‌మియాగూడకు చెందిన ఎండీ ఆయూబ్ పొలంలో కట్టేసిన రెండు ఒంగోలు జాతి గిత్తలు మృతి చెందాయి. వాటి విలువ రూ.1 లక్ష ఉంటుందని బాధితుడు వాపోయాడు.

మరో ఘటనలో రాచులూరుకు చెందిన గుయ్యని మల్లయ్య వ్యవసాయ పొలంలోని షెడ్‌లో ఉన్న గేదె పిడుగుపాటుతో మృతి చెందింది. దాని విలువ రూ.50 వేలు ఉంటుందని బాధితుడు తెలిపాడు. ప్రభుత్వం పరిహారం అందించి ఆదుకోవాలని బాధితులు కోరుతున్నారు.

నిజామాబాద్ జిల్లాలో పిడుగుపాటుకు 15 మూగజీవాలు మృతి చెందాయి. నాగిరెడ్డిపేట మండలం ఆత్మకూరులో పిడుగుపడి 3 పాడి గేదెలు మృతిచెందాయి. ఎల్లారెడ్డి మండలం అజాంబాద్ గ్రామంలో పిడుగుపాటుకు 12 మేకలు ప్రాణాలు విడిచాయి. మూగజీవాల మృతితో యజమానులు లబోదిబోమంటున్నారు.

 

మరిన్ని వార్తలు