ఈ–మార్కెటింగ్‌కు కేంద్రం నిధులు

25 Aug, 2016 01:24 IST|Sakshi
ఈ–మార్కెటింగ్‌కు కేంద్రం నిధులు
 
  • అసిస్టెంట్‌ అగ్రికల్చర్‌ మార్కెటింగ్‌ అడ్వయిజర్‌ జవహర్‌
పొదలకూరు:
ప్రభుత్వం నిర్వహించే యార్డుల్లో ఈ–మార్కెటింగ్‌ సౌకర్యం కోసం కేంద్ర ప్రభుత్వం ఒక్కొక్క యార్డుకు రూ.30 లక్షలు మంజూరు చేస్తున్నట్టు అసిస్టెంట్‌ అగ్రికల్చర్‌ మార్కెటింగ్‌ అడ్వయిజర్‌(మినిస్ట్రి ఆఫ్‌ అగ్రికల్చర్, గవర్నమెంట్‌ ఆఫ్‌ ఇండియా) ఎం.జవహర్‌ పేర్కొన్నారు. పొదలకూరు ప్రభుత్వ నిమ్మమార్కెట్‌ యార్డును బుధవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులు మార్కెట్లలో మోసపోకుండా ఈ–మార్కెట్‌ విధానాన్ని ప్రవేశపెట్టి ఆన్‌లైన్‌ పద్ధతిలో రైతులు తీసుకువచ్చే పంటలను కొనుగోలు చేస్తామన్నారు. ఇందుకోసం కేంద్ర ప్రభుత్వ మార్కెటింగ్‌ మంత్రిత్వ శాఖ దేశంలోని రాష్ట్రాలకు గైడ్‌లైన్స్‌ ఇచ్చిందన్నారు. 17 రాష్ట్రాలు కేంద్రం గైడ్‌లైన్స్‌ను పాటించేందుకు సమ్మతించినట్లు తెలిపారు. అందులో ఏపీ కూడా ఉందన్నారు. తొలివిడతగా పైలెట్‌ ప్రాజెక్టు కింద దేశంలోని వివిధ ప్రాంతాల్లో 21 మార్కెట్లలో ఈ–ట్రేడింగ్‌ విధానాన్ని విజయవంతంగా అమలు చేశామన్నారు. రెండో విడతలో దేశంలోని వివిధ రాష్ట్రాల్లో 200 మార్కెట్లలో ఈ–ట్రేడింగ్‌ విధానాన్ని అమలు చేస్తామని, ఇందులో ఆంధ్రప్రదేశ్‌లో 12 చోట్ల ఏర్పాటు చేయనున్నట్టు వెల్లడించారు. ఈ నేపథ్యంలోనే రాపూరు మార్కెట్‌ కమిటీ పరిధిలోని పొదలకూరు నిమ్మమార్కెట్‌ను ఎంపిక చేశామన్నారు. నాగార్జున ఫర్టిలైజర్స్‌ కెమికల్స్‌ వారు రూపొందించిన సాప్ట్‌వేర్‌ను ఈ–మార్కెట్‌లో ఉపయోగిస్తామన్నారు. అడ్వయిజర్‌ వెంట మార్కెటింగ్‌శాఖ ఏడీ ఉపేంద్ర, రాపూరు మార్కెట్‌ కమిటీ సెక్రటరీ ఎం.శ్రీనివాసులు ఉన్నారు. 
మరిన్ని వార్తలు