చెర్లగూడెం ఎడమ కాల్వ కోసం పరిశీలన

23 Jan, 2017 01:11 IST|Sakshi

సంస్థాన్‌ నారాయణపురం :చెర్లగూడెం ఎడమ కాల్వ కోసం మండల పరిధిలోని జనగాం, చిల్లాపురం, నారాయణపురం, రాచకొండ గ్రామాల్లో చెరువులను ఆదివారం మునుగోడు ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి, ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్, రిటైర్డ్‌ ఇంజనీరింగ్‌ల ఫోరం ప్రధాన కార్యదర్శి శ్యాంప్రసాద్‌రెడ్డి, ఇతర సభ్యులు, అఖిలపక్ష నాయకులు, రైతులతో కలిసి పరిశీలించారు. మర్రిగూడ మండలం చెర్లగూడెం రిజర్వాయర్‌ నుంచి సంస్థాన్‌ నారాయణపురానికి వచ్చే ఎడమ కాల్వ ఏయే గ్రామాల నుంచి వెళ్తుంది, ఏయే చెరువులను ఏ విధంగా నింపవచ్చో వంటి అంశాలను మ్యాపుల ద్వారా పరిశీలించారు. చెర్లగూడెం సముద్రమట్టానికి 385 మీటర్ల ఎత్తులో ఉండడంతో, మండలంలోని చిల్లాపురంలోని పెద్దచెరువు 415మీటర్లు, మొల్కచెరువు 420మీటర్లు, మేళ్ల చెరువు 430మీటర్ల ఎత్తు ఉండడంతో చెరువులకు నీళ్లు ఏ విధంగా నింపాలని, ఎక్కడి నుంచి నింపాలని పరిశీలించారు. చెర్లగూడెం ఎడమకాల్వ11కి.మీ.ల వద్ద వాచ్యతండా వద్ద 70మీటర్ల ఎత్తుతో లిఫ్టింగ్‌ చేసి, జనగాం పరిధిలోని మొలక చెరువును నింపి, అక్కడి నుంచి చిల్లాపురం పరిధిలో ఉన్న పెద్ద చెరువుతో పాటు సంస్థాన్‌ నారాయణపురం పరిధిలో ఉన్న మేళ్ల చెరువుకు నీళ్లందించవచ్చని గుర్తించారు.

మొలక చెరువు నుంచి మేళ్ల చెరువుకు నీళ్లు అందించడానికి ఏదైనా ఆటంకం ఏర్పడితే నైజా కాలం నాటి రాచకాలువను కూడా పరిశీలించారు. మొలక చెరువు, పెద్ద చెరువు, మేళ్ల చెరువు, నీళ్లకొండ చెరువులను పరిశీలించి, సాధ్యాసాధ్యాలపై రిటైర్డ్‌ ఇంజనీర్స్‌ ఫోరం ఒక ప్రతిపాదన తయారు చేయాలని ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు కోరారు.  మొలక చెరువులో ఒక టీఎంసీ నీళ్ల కెపాసిటీతో పాటు మేళ్లచెరువు, ఇతర చెరువులు కూడా నింపాలని గుర్తించారు. రైతులతో కూడా మాట్లాడి, వారి అభిప్రాయాలను సేకరించారు. అఖిలపక్ష నాయకులతో కూడా చర్చిం చారు. ఎటువంటి సమస్యలు ఎదురైనా చెరువులు నింపే కార్యక్రమాన్ని పూర్తి చేయడానికి అందరం కలిసి కట్టుగా పనిచేయాలన్నారు. వారి వెంట రిటైర్డ్‌ ఇంజనీర్ల ఫోరం సభ్యులు ఇంద్రసేనారెడ్డి, రమణానాయక్, మెంగ లక్ష్మణ్, ఐబీ డీఈ సూర్యనారాయణ, జెడ్పీటీసీ సభ్యుడు బొల్ల శివశంకర్, ఎంపీపీ వాంకుడోతు బుజ్జి, ప్రజాప్రతినిధులు పాశం హాలియా, కరంటోతు విజయలక్ష్మి, మేఘావత్‌ పద్మ, ఆత్కూరి రాములు, దుబ్బాక భాస్కర్, బచ్చనగోని దేవేందర్, ఏర్పుల అంజమ్మ, కత్తుల లక్ష్మయ్య, పీఏసీఎస్‌ చైర్మన్‌ గడ్డం మురళీధర్‌రెడ్డి, పాశం ఉపేందర్‌రెడ్డి, సురేందర్‌రెడ్డి, నలపరాజు రమేష్, జక్కిలి అయిలయ్య, వీరారెడ్డి, కె.లింగయ్య, జి.శ్రీనివాసాచారి, గాలయ్య,  యాదయ్య తదితరులున్నారు.

మరిన్ని వార్తలు