మోసాలు ఎల్లకాలం సాగవు బాబూ

29 Aug, 2016 23:04 IST|Sakshi
  • వైఎస్సార్‌సీపీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు జక్కంపూడి రాజా 
  • నరేంద్రపురం (రాజానగరం) : 
    ఓట్లు వేసి గెలిపించిన ప్రజలను మోసాలతో మభ్యపెడుతూ అధికారం చెల్లాయిస్తున్న సీఎం చంద్రబాబు ఓటుకు నోటు కేసులో నిలువునా బుక్కయ్యారని వైఎస్సార్‌సీపీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు జక్కంపూడి రాజా అన్నారు. సోమవారం ఇక్కడ విలేకరులతో మాట్లాడుతూ రాష్ట్రానికి రావలసిన ప్రత్యేక హోదాను సైతం తాకట్టు పెట్టి ఈ కేసు నుంచి తప్పించుకుందామని చూసిన ఆయన ఎత్తుగడ కోర్టు జోక్యంతో పటాపంచలైందన్నారు. ఎప్పుడూ తాను నిప్పు అని గొప్పలు చెప్పుకునే ఆయన ఈ కేసులో తన నిజాయితీ ఏమిటో నిరూపించుకోవాలన్నారు. వైఎస్సార్‌సీపీకి చెందిన మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల కృష్ణారెడ్డి వేసిన పిటిషన్‌పై ఏసీబీ కోర్టు ఈ కేసును పునర్విచారణకు ఆదేశించడాన్ని ప్రస్తావిస్తూ ఆయన పైవిధంగా అన్నారు. వచ్చే నెల 29లోగా విచారణ పూర్తి చేయాలంటూ కోర్టు ఆదేశాలివ్వడంతో అయోమయంలో పడిన చంద్రబాబు తిరుపతిలోని కేంద్రమంత్రి పర్యటనను సైతం రద్దు చేసుకుని విజయవాడకు పరుగు పెట్టడం ఆయనలోని భయాన్ని తెలియజేస్తోందన్నారు. చంద్రబాబు నీతి తప్పితే కోర్టులు చూస్తూ ఊరుకోవన్నారు. ప్రజాస్వామ్యం పట్ల మీకు ఏమాత్రం గౌరవం ఉన్నా తక్షణమే సీఎం పదవి నుంచి తప్పుకోవాలన్నారు. 
    పాలకుల అభివృద్ధేగాని రాష్ట్ర ప్రగతి లేదు 
    టీడీపీ అధికారంలోకి వచ్చాక రాష్ట్ర ప్రగతి కన్నా ఆ పార్టీ నాయకులు, కార్యకర్తల అభివృద్ధి బాగా జరిగిందన్నారు. 2015లో గోదావరి, 2016లో కృష్ణా పుష్కరాలకు కేటాయించిన నిధులు, చేసిన ఖర్చులపై ఏసీబీ విచారణ జరిపితే మరెన్నో కుంభకోణాలు బయటపడతాయన్నారు. తాత్కాలిక సచివాలయంలో నాణ్యతలేక మంత్రులే తమ చాంబర్లు పెట్టుకోవడానికి వెనుకంజ వేస్తున్నారంటే అంతకుమించిన సిగ్గు చేటు మరొకటి ఉండదన్నారు.
     
మరిన్ని వార్తలు